- Home
- Sports
- Cricket
- Virat Kohli: వికెట్ కీపర్ ఓకే.. తుది జట్టుపై చర్చించాలి.. రెండో టెస్టుకు ముందు విరాట్ ఆసక్తికర వ్యాఖ్యలు
Virat Kohli: వికెట్ కీపర్ ఓకే.. తుది జట్టుపై చర్చించాలి.. రెండో టెస్టుకు ముందు విరాట్ ఆసక్తికర వ్యాఖ్యలు
India Vs New Zealand: భారత్-న్యూజిలాండ్ మధ్య ముంబై వేదికగా రేపట్నుంచి రెండో టెస్టు మొదలుకానున్నది. ఈ నేపథ్యంలో సారథి విరాట్ కోహ్లీ పలు విషయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఇండియా-న్యూజిలాండ్ రెండో టెస్టుకు ముందు టీమిండియా సారథి విరాట్ కోహ్లీ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తొలి టెస్టులో గాయం కారణంగా వికెట్ కీపింగ్ చేయడానికి ఇబ్బంది పడ్డ వృద్ధిమాన్ సాహా.. రెండో మ్యాచ్ కు ఫిట్ గా ఉన్నాడని కోహ్లీ చెప్పాడు.
రెండో టెస్టుకు ముందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో విరాట్ మాట్లాడాడు. విరాట్ స్పందిస్తూ.. ‘సాహా ఫిట్ గా ఉన్నాడు. మెడ నొప్పి గాయం నుంచి అతడు పూర్తిగా కోలుకున్నాడు. రెండో టెస్టులో అతడు ఆడతాడు..’ అని చెప్పాడు. మెడ నొప్పి కారణంగా సాహా.. తొలి టెస్టులో బ్యాటింగ్ చేశాడు. కానీ మూడో రోజు వికెట్ కీపింగ్ బాధ్యతలను కెఎస్ భరత్ చూసుకున్నాడు.
కోహ్లీ జట్టులోకి తిరిగి చేరుతున్న నేపథ్యంలో తుది జట్టులో ఎవర్ని ఉంచాలి..? ఎవర్ని తొలగించాలి..? అనే విషయమ్మీద సందిగ్దత నెలకొంది. కాన్పూర్ టెస్టులో సెంచరీ, హాఫ్ సెంచరీతో ఇరగదీసిన శ్రేయస్ అయ్యర్ ను పక్కనబెడతారని వాదనలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో ఫామ్ లో లేని వైస్ కెప్టెన్ రహానే, ఛతేశ్వర్ పుజారాలలో ఒక్కరిని తప్పించాలని కూడా పలువురు సీనియర్లు అభిప్రాయపడుతున్నారు.
ఈ నేపథ్యంలో విరాట్ స్పందిస్తూ.. ‘తుది జట్టు గురించి ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ముంబై లో పరిస్థితులకు అనుగుణంగా మేము తుది నిర్ణయం తీసుకుంటాం..’ అని చెప్పాడు. అయితే ముంబైలో అల్పపీడనం కారణంగా ఈ మ్యాచ్ కొనసాగుతుందా..? లేదా..? అనేది వేచి చూడాలి.
కాన్పూర్ టెస్టులో భారత్ జట్టు అద్బుతంగా రాణించిందని, ఆ మ్యాచులో సారథి రహానే వ్యూహాలు భాగున్నాయని కోహ్లీ కొనియాడాడు. న్యూజిలాండ్ ను ఒత్తిడిలోకి నెట్టడంలో రహానే సక్సెస్ అయ్యాడని విరాట్ చెప్పుకొచ్చాడు. అయితే కొన్నిసార్లు ప్రత్యర్థి జట్టు ఫైనల్ సెషన్ లో బాగా ఆడినప్పుడు మనం క్రెడిట్ వాళ్లకే ఇవ్వాల్సి ఉంటుందని తెలిపాడు.
ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఆడటం తనకు ఎప్పుడూ ప్రత్యేకమేనని విరాట్ తెలిపాడు. 2016 లో ఇక్కడ చివరగా ఇంగ్లాండ్ తో టెస్టు జరిగింది. ఈ మ్యాచులో విరాట్.. 235 పరుగులు చేశాడు. అయితే పరిస్థితులకు తగ్గట్టు తాను బ్యాటింగ్ చేస్తానని విరాట్ తెలిపాడు.
ఇక దక్షిణాఫ్రికా పర్యటన గురించి కూడా విరాట్ స్పందించాడు. ‘సౌతాఫ్రికా టూర్ గురించి మేము బీసీసీఐతో టచ్ లో ఉన్నాం. మరో రెండు, మూడు రోజుల్లో దానిపై స్పష్టత వస్తుందని ఆశిస్తున్నాం..’ అని అన్నాడు. దక్షిణాఫ్రికా లో ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తితో ఆ సిరీస్ జరుగుతుందా..? లేదా..? అనేది సందిగ్దంగా మారింది.