కోహ్లీ డక్ అవ్వడానికి అసలు కారణం ఇదే !
Virat Kohli: భారత్-ఆస్ట్రేలియా తొలి వన్డేలో స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ డక్ అయ్యాడు. జహీర్ ఖాన్ ఆయన అవుట్ వెనుక బౌలర్ల వ్యూహాన్ని వివరించారు. అలాగే కోహ్లీ, రోహిత్ లపై సునీల్ గవాస్కర్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

భారత్-ఆస్ట్రేలియా తొలి వన్డేలో కోహ్లీ అవుట్ పై అభిమానుల నిరాశ
పెర్త్లో జరిగిన భారత్-ఆస్ట్రేలియా తొలి వన్డేలో భారత క్రికెట్ జట్టు తీవ్రంగా నిరాశపరిచింది. చాలా రోజుల తర్వాత అంతర్జాతీయ క్రికెట్కు తిరిగి వచ్చిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు అభిమానులు ఆశించిన విధంగా రాణించలేకపోయారు. మిచెల్ స్టార్క్ వేసిన ఆఫ్స్టంప్ బయట బంతిని కవర్ డ్రైవ్ ఆడబోయిన విరాట్ క్యాచ్ రూపంలో అవుట్ అయ్యాడు. కూపర్ కాన్నోల్లీ అద్భుతంగా డైవ్ చేసి కోహ్లీ ఇచ్చిన క్యాచ్ను అందుకున్నాడు. కేవలం ఎనిమిది బంతులు మాత్రమే ఆడి, ఒక్క రన్ కూడా చేయకుండా పెవిలియన్ కు చేరాడు.
కోహ్లీపై బౌలర్ల ప్రత్యేక వ్యూహం: డక్ పై జహీర్ ఖాన్ విశ్లేషణ
భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్, కోహ్లీ అవుట్ వెనుక ఉన్న బౌలర్ల వ్యూహాన్ని విశ్లేషించారు. ఆయన క్రిక్బజ్తో మాట్లాడుతూ, “ఇప్పుడు చాలా మంది బౌలర్లు కోహ్లీకి ఆఫ్స్టంప్ బయట బంతులు వేయడం అలవాటు చేసుకున్నారు. ఆస్ట్రేలియా బౌలర్లు కూడా అదే ప్లాన్ని కచ్చితంగా అమలు చేశారు. కోహ్లీ కవర్ డ్రైవ్ల్లో, ఆన్సైడ్ షాట్లను అద్భుతంగా ఆడతారు. అయితే, బౌలర్లు ఆయన లైన్ను ఆఫ్స్టంప్ బయట ఉంచి ఒత్తిడి పెంచుతున్నారు. ఇది ఒక ట్రాప్ అయినప్పటికీ, ఆ వ్యూహాన్ని అమలు చేసిన బౌలర్లను మెచ్చుకోవాలి” అన్నారు. పక్కా వ్యూహాలతో బౌలర్లు కోహ్లీని దెబ్బకొట్టారని అభిప్రాయపడ్డారు.
రోహిత్, కోహ్లీలపై సునీల్ గవాస్కర్ కామెంట్స్
పెర్త్ లో భారత జట్టు ఓటమి తర్వాత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ స్పందించారు. ఆయన ఇండియా టుడేతో మాట్లాడుతూ.. “రోహిత్, కోహ్లీలు కొన్ని నెలల తర్వాత మళ్లీ అంతర్జాతీయ క్రికెట్లోకి వచ్చారు. పెర్త్ పిచ్ చాలా బౌన్స్ కలిగి ఉంటుంది. అది వారికి కష్టంగా మారింది. కానీ ఈ ఇద్దరూ ఫామ్ లోకి వస్తే భారీ స్కోర్లు తప్పవు. అడిలైడ్లో జరిగే రెండో వన్డేలో వీరు రాణిస్తారు” అని అన్నారు.
అడిలైడ్ లో భారత్ 300 పరుగులు చేస్తుంది: గవాస్కర్
అడిలైడ్ వన్డేలో భారత్ 300 ప్లస్ స్కోర్ చేస్తుందని సునీల్ గవాస్కర్ అంచనా వేశారు. “రోహిత్, కోహ్లీ ఎక్కువ సమయం నెట్స్లో గడిపితే, మరిన్ని థ్రోడౌన్లు తీసుకుంటే త్వరగా రిథమ్ అందుకుంటారు. ఒకసారి వారు స్కోరింగ్ మొదలుపెడితే, భారత్ జట్టు స్కోరు 300 లేదా అంతకంటే ఎక్కువ అవుతుంది” అని అన్నారు. ప్రస్తుతం మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భారత్ 0-1తో వెనుకబడి ఉంది. రెండో వన్డే అక్టోబర్ 23న అడిలైడ్లో జరగనుంది.
వర్షం ఎఫెక్ట్.. తొలి వన్డేలో భారత్ కు షాక్
తొలి వన్డే మ్యాచ్లో వర్షం ప్రభావం కారణంగా ప్రతి జట్టుకు 26 ఓవర్ల ఇన్నింగ్స్ మాత్రమే లభించింది. భారత్ తొలుత బ్యాటింగ్ చేస్తూ 9 వికెట్లకు కేవలం 136 పరుగులకే పరిమితమైంది. ఆ తర్వాత ఆస్ట్రేలియాకు డక్వర్త్ లూయిస్ విధానం ప్రకారం 131 పరుగుల లక్ష్యం ఇచ్చారు. ఆస్ట్రేలియా 21.1 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఆ లక్ష్యాన్ని చేధించి మ్యాచ్ను 7 వికెట్ల తేడాతో గెలుచుకుంది.
అడిలైడ్లో రెండో వన్డే
పెర్త్లో పరాజయం తర్వాత టీమిండియా ఇప్పుడు అడిలైడ్లో రివెంజ్ తీసుకోవాలని చూస్తోంది. రోహిత్ శర్మ, కోహ్లీ లాంటి స్టార్ ఆటగాళ్లు ఫామ్ లోకి వస్తే సిరీస్లో భారత్ తిరిగి నిలబడే అవకాశం ఉంది. అభిమానులందరూ ఇప్పుడు గురువారం జరగనున్న రెండో వన్డే కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.