ICC WTC 2021: బౌన్సర్లతో భారత బ్యాట్స్మెన్ను భయపెడుతున్న కివీస్ బౌలర్లు... ఇదేం అంపైరింగ్...
మొట్టమొదటి ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ హోరాహోరీ ఫైట్ సాగుతోంది. భారత బ్యాట్స్మెన్, కివీస్ బౌలర్లు మధ్య నువ్వా, నేనా అన్నట్టుగా సాగుతోంది మ్యాచ్....
న్యూజిలాండ్ బౌలర్లు, పిచ్ సపోర్ట్తో బౌన్సర్లతో భారత బ్యాట్స్మెన్ను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు... టాస్ ఓడి బ్యాటింగ్ మొదలెట్టిన భారత జట్టుకి ఓపెనర్లు శుబ్మన్ గిల్, రోహిత్ శర్మ కలిసి తొలి వికెట్కి 62 పరుగులు జోడించి శుభారంభం అందించారు..
అయితే 64 బంతుల్లో 3 ఫోర్లతో 28 పరుగులు చేసిన శుబ్మన్ గిల్ను ఓ రాకాసి బౌన్సర్తో భయపెట్టే ప్రయత్నం చేశాడు న్యూజిలాండ్ పేసర్ కేల్ జెమ్మీసన్. జెమ్మీసన్ వేసిన బంతి, నేరుగా శుబ్మన్ గిల్ హెల్మెట్కి బలంగా తగిలింది.
ఫిజియో పర్యవేక్షణ తర్వాత తిరిగి బ్యాటింగ్ మొదలెట్టిన శుబ్మన్ గిల్, ఆ తర్వాత కొద్ది సేపటికే అవుట్ అయ్యాడు. నీల్ వాగ్నర్ బౌలింగ్లో వికెట్ కీపర్ వాట్లింగ్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు గిల్...
ఆ తర్వాత ‘నయా వాల్’ ఛతేశ్వర్ పూజారా, తన స్టైల్లో 35 బంతుల తర్వాత బౌండరీతో ఖాతా తెరిచాడు. రెండు ఫోర్లతో 8 పరుగులు చేసిన పూజారాను నీల్ వాగ్నర్ బౌన్సర్తో దెబ్బతీశాడు...
వాగ్నర్ వేసిన బౌన్సర్ను షాట్గా మలచబోయిన పూజారా హెల్మెట్కి బంతి బలంగా తగిలింది. దెబ్బకు పూజారా ధరించిన హెల్మెట్ కూడా విరిగిపోయింది.
హెల్మెట్ మార్చిన తర్వాత తిరిగి బ్యాటింగ్ ప్రారంభించిన పూజారా, కొద్దిసేపటికే ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు...
విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో రివ్యూ విషయంలో గందరగోళం నెలకొంది. ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్లో కోహ్లీ అవుట్కి అప్పీలు చేసింది న్యూజిలాండ్. బౌల్ట్తో సహా కివీస్ టీమ్ మొత్తం అవుట్ కోసం అప్పీలు చేసింది. అయితే అంపైర్ మాత్రం నాటౌట్గా ప్రకటించాడు.
కేన్ విలియంసన్ రివ్యూ తీసుకోవాలా? వద్దా? అని ఆలోచిస్తుండగానే డీఆర్ఎస్ టైం అయిపోయింది. అయితే అంపైర్లు మాత్రం ఎవ్వరూ కోరకుండానే థర్డ్ అంపైర్కి రిఫర్ చేశారు. రివ్యూలో నాటౌట్గా తేలింది. అయితే న్యూజిలాండ్ రివ్యూ తీసుకోకుండానే రివ్యూకి వెళ్లడంతో కివీస్ టీమ్కి ఓ రివ్యూ కలిసి వచ్చింది...
విరాట్ కోహ్లీ, అంపైర్లను ఈ విషయం గురించి నిలదీశాడు. దీనిపై మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. ‘ఫన్నీ అంపైరింగ్ ఇది. అంపైర్ నాటౌట్ ఇచ్చాక, ప్లేయర్లు కోరకుండానే రివ్యూ ఎలా వెళ్లింది...’ అంటూ ట్వీట్ చేశాడు వీరేంద్ర సెహ్వాగ్.