- Home
- Sports
- Cricket
- ‘తొలి టెస్టులో రాణించి మ్యాన్ ఆఫ్ మ్యాచ్ వచ్చినా కుల్దీప్ను పక్కనబెట్టారు.. నాకైతే ఏడుపొచ్చింది..’
‘తొలి టెస్టులో రాణించి మ్యాన్ ఆఫ్ మ్యాచ్ వచ్చినా కుల్దీప్ను పక్కనబెట్టారు.. నాకైతే ఏడుపొచ్చింది..’
బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తొలి టెస్టులో 8 వికెట్లతో చెలరేగాడు. బంగ్లా జట్టును దెబ్బతీసి భారత్ ఘన విజయంలో కీలక పాత్ర పోషించాడు.ఈ మ్యాచ్ లో అతడి ప్రదర్శనకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా దక్కింది. కానీ అనూహ్యంగా రెండో టెస్టులో అతడిని పక్కనబెట్టింది టీమ్ మేనేజ్మెంట్.

బంగ్లాదేశ్ పర్యటనలో భారత జట్టు వన్డే సిరీస్ కోల్పోయినా టెస్టులలో మాత్రం రాణించింది. రెండు టెస్టులను గెలుచుకుని సిరీస్ ను క్లీన్ స్వీప్ గెలిచింది. తొలి టెస్టులో భారత్ గెలవడానికి కీలక పాత్ర పోషించింది స్పిన్నర్ కుల్దీప్ యాదవ్. తొలి టెస్ట్ లో కుల్దీప్.. మొదటి ఇన్నింగ్స్ లో బ్యాట్ తో రాణించడమే గాక ఐదు వికెట్లు కూడా తీశాడు.
ఇక రెండో ఇన్నింగ్స్ లో మూడు వికెట్లు పడగొట్టి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆ మ్యాచ్ లో కుల్దీప్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యాడు. ఇంత చేసినా కుల్దీప్ ను స్పిన్ కు అనుకూలించే మీర్పూర్ పిచ్ పై టీమిండియా మేనేజ్మెంట్ పక్కనబెట్టింది. అతడిని కాదని 12 ఏండ్ల తర్వాత జట్టులోకి వచ్చిన జయదేవ్ ఉనద్కత్ ను ఆడించింది. కుల్దీప్ ను పక్కనబెట్టడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది.
తాజాగా ఈ వివాదంపై కుల్దీప్ కోచ్ కపిల్ పాండే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతడిని పక్కనబెట్టడంతో తాను ఏడ్చానని, అసలు కుల్దీప్ కే ఎందుకిలా జరుగుతుందో అర్థం కావడం లేదని అన్నాడు. బంగ్లా పర్యటన ముగించుకుని స్వదేశానికి చేరుకున్న తర్వాత కపిల్ మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశాడు.
కపిల్ పాండే మాట్లాడుతూ..‘కుల్దీప్ చాలాకాలంగా జట్టులో చోటు దక్కించుకోవడం బెంచ్ కే పరిమితం అవుతున్నాడు. అడపాదడపా అవకాశాలిచ్చినా దానిని సద్వినియోగం చేసుకున్నా కీలక మ్యాచ్ లలో అతడిని పక్కనబెడుతున్నారు. కుల్దీప్ నాకు చిన్నప్పట్నుంచి తెలుసు. వన్డేలలో అతడికి రెండు హ్యాట్రిక్ (ఇండియా ఏ, అండర్ -19 జట్టుకు ఆడినప్పుడు) లు ఉన్నాయి. అయినా టీమ్ మేనేజ్మెంట్ పట్టించుకోవడం లేదు.
ఇక బంగ్లాదేశ్ తో తొలి టెస్ట్ లో అత్యద్భుత ప్రదర్శనతో కుల్దీప్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకున్నాడు. కానీ స్పిన్ కు అనుకూలించే పిచ్ పై మాత్రం అతడిని తప్పించడం బాదేసింది. నాకైతే కుల్దీప్ ను ఎలా ఓదార్చోలా కూడా తెలియలేదు. నేనొక్కడినే చాలాసేపు ఏడ్చాను.
అయితే తనను తుది జట్టులో తీసుకోకపోవడంపై కుల్దీప్ స్పందిస్తూ ఇచ్చిన సమాధానం అతడి పరిణితిని తెలిపింది. గతంతో పోలిస్తే కుల్దీప్ లో పరిణితి బాగా పెరిగింది..’ అని తెలిపాడు. 2019 లో ఆస్ట్రేలియా గడ్డపై ఆడి (బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా) సిడ్నీ టెస్టులో కుల్దీప్ ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. ఆ తర్వాత కుల్దీప్ మళ్లీ చాలాకాలానికి బంగ్లాదేశ్ తో టెస్టు ఆడాడు.