కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ ఇవ్వడం కరెక్ట్ కాదేమో..? మళ్లీ గెలికిన గంభీర్
INDvsSL: శ్రీలంకతో ఇటీవలే ముగిసిన వన్డే సిరీస్ లో మొదటి, చివరి వన్డేలో సెంచరీ చేశాడు విరాట్ కోహ్లీ. ఈ సిరీస్ లో అతడే హయ్యస్ట్ స్కోరర్. దీంతో అతడికే ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది.
నిత్యం కోహ్లీ మీద ఏదో ఒక కామెంట్ చేసే టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ తాజాగా మరోసారి తన నోటికి పనిచెప్పాడు. ఈ సిరీస్ లో హయ్యస్ట్ రన్ స్కోరర్ గా ఉన్న విరాట్ కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు ఇవ్వడం అతడికి కోపం తెప్పించింది.
లంకతో ఇటీవలే ముగిసిన వన్డే సిరీస్ లో కోహ్లీ తొలి వన్డేలో సెంచరీ చేశాడు. రెండో వన్డేలో విఫలమైనా మూడో వన్డేలో 160 ప్లస్ స్కోరు చేశాడు. మూడు మ్యాచ్ లలో కలిపి 141.50 సగటుతో 283 పరుగులు చేయడంతో అతడికే ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా దక్కింది. అయితే ఆ అవార్డు కోహ్లీకి ఇవ్వడం కరెక్ట్ కాదని అంటున్నాడు గంభీర్.
మ్యాచ్ అనంతరం గంభీర్ మాట్లాడుతూ... ‘విరాట్ కోహ్లీ ఒక్కడికే ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు ఇవ్వడం కరెక్ట్ కాదేమో.. కోహ్లీ ప్రదర్శనలకు ఏమాత్రం తీసిపోని విధంగా మహ్మద్ సిరాజ్ కూడా బౌలింగ్ లో రాణించాడు.
సాధారణంగా ఒక సిరీస్ లో సెంచరీలు చేసి అత్యధిక పరుగులు చేసినవారికే ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు ఇస్తారని మనకు తెలుసు. కానీ ఈ సిరీస్ లో సిరాజ్.. కొత్త బంతితో అద్భుతాలు చేశాడు. లంక బ్యాటర్ల పతనాన్ని శాసించాడు. అతడికి కూడా కోహ్లీతో సమానంగా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు ఇస్తే బాగుండేది...’అని అన్నాడు.
ఇదిలాఉండగా ఈ సిరీస్ లో సిరాజ్ మొత్తంగా 9 వికెట్లు తీశాడు. గువహతిలో 3 వికట్లు పడగొట్టగా కోల్కతా వన్డేలో రెండు వికెట్లు పడగొట్టాడు. ఇక తిరువనంతపురంలో నాలుగు వికెట్లు తీశాడు. భారత్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.
ఇక గంభీర్ కామెంట్స్ పై కోహ్లీ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోహ్లీపై ఏదో ఒకటి అనకుంటే గంభీర్ కు పొద్దు గడవదని వాళ్లు కౌంటర్ ఇస్తున్నారు. కాగా కొత్త ఏడాదిలో భారత్.. శ్రీలంకపై ఆధిపత్యం చెలాయించింది. తొలుత హార్ధిక్ పాండ్యా సారథ్యంలోని భారత జట్టు లంకను 2-1 తేడాతో ఓడించగా తర్వాత రోహిత్ సేన 3-0 తో వన్డే సిరీస్ ను కైవసం చేసుకుంది.