శుభ్మన్ గిల్ వద్దు.. శ్రేయాస్ ప్లేస్లో అతడే కరెక్ట్.. స్పిన్ ఆడటంలో అతడు దిట్ట : దినేశ్ కార్తీక్
Border Gavaskar Trophy: నాగ్పూర్ టెస్టులో భారత మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ ఆడేది అనుమానంగానే ఉంది. న్యూజిలాండ్ తో వన్డే సీరస్ కు ముందు అతడు గాయపడటంతో అయ్యర్ ఇంకా కోలుకోలేదు. ఈ నేపథ్యంలో అతడి స్థానంలో ఎవరిని ఆడిస్తారనేది ఇంకా తేలాల్సి ఉంది.
బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ - ఆస్ట్రేలియా మధ్య ఫిబ్రవరి 9 నుంచి తొలి టెస్టు ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈ టెస్టు కోసం భారత జట్టు ఇదివరకే నాగ్పూర్లో ప్రాక్టీస్ చేస్తుండగా ఆస్ట్రేలియా టీమ్ బెంగళూరులో ప్రత్యేక శిక్షణా శిభిరాన్ని ఏర్పాటు చేసి చెమటోడ్చుతున్నది.
అయితే నాగ్పూర్ టెస్టులో భారత మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ ఆడేది అనుమానంగానే ఉంది. న్యూజిలాండ్ తో వన్డే సీరస్ కు ముందు అతడు గాయపడటంతో అయ్యర్ ఇంకా కోలుకోలేదు. అతడు తొలి టెస్టు ఆడేది అనుమానమే అని బోర్డు వర్గాలు కూడా చెబుతున్నాయి. అదీగాక వికెట్ కీపర్ రిషభ్ పంత్ కు రోడ్డు ప్రమాదం కూడా జరుగడంతో మిడిలార్డర్ బలహీనంగా కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలో ఈ ఏడాది వన్డేలు, టీ20లలో అదరగొడుతున్న టీమిండియా యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ ను తుది జట్టులోకి తీసుకోవాలని వాదనలు వినిపిస్తున్నాయి. గిల్ తో పాటు టీ20లలో ఐసీసీ బ్యాటింగ్ ర్యాకింగ్ లలో నెంబర్ వన్ గా ఉన్న సూర్యను కూడా ఈ సిరీస్ కు ఎంపిక చేయడంతో అతడిని ఆడించాలని కూడా విశ్లేషణలు వినిపిస్తున్నాయి.ఈ ఇద్దరిలో ఎవరిని ఎంపిక చేస్తే బాగుంటుందన్న దానిపైనా క్రీడా పండితులు వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ ఇదే విషయమై స్పందించాడు. క్రిక్ బజ్ లో జరిగిన ఓ చర్చా కార్యక్రమంలో కార్తీక్ మాట్లాడుతూ... ‘నాగ్పూర్ టెస్టులో శ్రేయాస్ అయ్యర్ ఆడకుంటే ఆ స్థానంలో సూర్య - గిల్ లలో ఎవరిని ఆడించాలనే చర్చ జోరుగా సాగుతోంది. నా అభిప్రాయం మేరకైతే అయ్యర్ ప్లేస్ లో సూర్యకుమార్ యాదవ్ ను ఆడించడమే బెటర్.
ఎందుకంటే సూర్య స్పిన్ బాగా ఆడగలడు. ఇక భారత్- ఆస్ట్రేలియా సిరీస్ లో చర్చ అంతా స్పిన్ చుట్టే తిరుగుతోంది కావున సూర్యను ఆడించడమే బెటర్ అని నా ఫీలింగ్. భారత్ లో స్పిన్ కు సహకరించే పిచ్ లపై సూర్య తప్పక రాణిస్తాడు. అయితే అతడికి ఒక అవకాశమివ్వాలి. టీ20లలో అతడు ఎలా విజృంభిస్తున్నాడనేది చూస్తూనే ఉన్నాం..’అని చెప్పాడు.
మరికొంతమంది క్రీడా విశ్లేషకులేమో నాగ్పూర్ టెస్టులో సూర్యను పక్కనబెట్టి గిల్ ను ఆడించాలని భావిస్తున్నారు. ఈ ఏడాది 12 మ్యాచ్ లు ఆడిన (టీ20, వన్డే) గిల్.. ఏకంగా నాలుగు సెంచరీలు చేశాడు. వన్డేలలో మెరిసిన గిల్.. ఇటీవలే టీ20లో కూడా ఓ సెంచరీ చేశాడు. గతేడాది డిసెంబర్ లో బంగ్లాదేశ్ తో టెస్టులో కూడా సెంచరీతో కదం తొక్కిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫామ్ లో ఉన్న ఆటగాడిని పక్కనబెట్టడం సరికాదని, అదీ ఆస్ట్రేలియా వంటి కఠిన ప్రత్యర్థి మీద సూర్య కంటే గిల్ ను ఆడిస్తేనే బెటర్ అని అంటున్నారు.