- Home
- Sports
- Cricket
- నాకేం వింతగా అనిపించడం లేదు.. వాళ్లకిది జరగాల్సిందే.. ముంబై పై షేన్ వాట్సన్ షాకింగ్ కామెంట్స్
నాకేం వింతగా అనిపించడం లేదు.. వాళ్లకిది జరగాల్సిందే.. ముంబై పై షేన్ వాట్సన్ షాకింగ్ కామెంట్స్
TATA IPL 2022 - MI vs LSG: ఐపీఎల్ లో తిరుగులేని జట్టుగా ఉన్న ముంబై ఇండియన్స్ ఈ సీజన్ లో మాత్రం విజయం కోసం వేయి కండ్లతో ఎదురు చూస్తున్నది. ఇప్పటికే ఆ జట్టు 5 ఓటములతో ప్లేఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకున్నది.

ఐదు సార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ఈ సీజన్ లో ఒక్క మ్యాచ్ కూడా గెలువలేదు. శనివారం మధ్యాహ్నం ఆ జట్టు లక్నో సూపర్ జెయింట్స్ తో కీలక మ్యాచ్ ఆడనున్నది. ఈ మ్యాచ్ లో ఓడితే గనక ముంబై ఇక ప్లే ఆఫ్ అవకాశాలను దాదాపు వదులుకున్నట్టే..
వరుసగా ఐదు మ్యాచుల్లో ఓడి ఐపీఎల్ - 2022 పాయింట్ల పట్టికలో అట్టడుగన ఉన్న ముంబై ఇండియన్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ అసిస్టెంట్ కోచ్ షేన్ వాట్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పాయింట్ల పట్టికలో వాళ్లు (ముంబై) చిట్ట చివర నిలవడం తనకేమీ ఆశ్చర్యం కలిగించలేదని చెప్పాడు.
వాట్సన్ మాట్లాడుతూ.. ‘పాయింట్ల పట్టికలో ముంబై ఆఖరున నిలవడం నాకేం వింతగా అనిపించడం లేదు. వేలం ప్రక్రియలో వాళ్లు అనుసరించిన వ్యూహాలను చూసినప్పుడే నాకు కాస్త తేడాగా అనిపించింది.
ఎందుకంటే వాళ్లు ఇషాన్ కిషన్, జోఫ్రా ఆర్చర్ మీద చాలా ఖర్చు చేశారు. గాయం కారణంగా ఆర్చర్ కొద్దికాలంగా ఫీల్డ్ కు దూరంగా ఉన్నాడు. అయినా అతడి మీద అంత ఖర్చు పెట్టడమనేది నిజంగా నాకైతే షాక్ అనిపించింది.
ఈ సీజన్ కు అతడు అందుబాటులో ఉండేది తక్కువే అని తెలిసినా ముంబై మాత్రం రాబోయే సీజన్లు దృష్టిలో పెట్టుకుని ఆర్చర్ మీద భారీగా వెచ్చించింది...
ఇక ఇషాన్ కిషన్ కోసం ఏకంగా రూ. 15 కోట్ల పైచీలుకు ఖర్చు చేసింది. కానీ అతడు దానికి తగ్గట్టుగా ఆడుతున్నాడా..? అతడు టాలెంటెడ్ ప్లేయర్ కావచ్చు గానీ ఈ సీజన్ లో మాత్రం అంతగా ఆకట్టుకోవడం లేదు కదా... వీటి కారణంగా ముంబై జట్టుతో బ్యాలెన్స్ తప్పుతున్నది..’ అని తెలిపాడు.
వాట్సన్ చెప్పినట్టు ఆర్చర్ ఈ సీజన్ కు అందుబాటులో లేకున్నా ముంబై అతడి మీద రూ. 8 కోట్లు ఖర్చు పెట్టింది. రాబోయే సీజన్ కోసం ఆర్చర్ ను నిలుపుకోవడానికి అతడి మీద ఇంత ఖర్చు చేయడం అవసరమా..? అని ఏకంగా ముంబై సారథి రోహిత్ శర్మ కూడా జట్టు యాజమాన్యం దగ్గర వాపోయినట్టు వార్తలు వచ్చాయి..
ఆ రూ. 8 కోట్లే ఉంటే దేశవాళీలోనే నలుగురైదుగురు నాణ్యమైన బౌలర్లు దొరికేవారని రోహిత్ వాదన. ఒకప్పుడు భీకర బౌలింగ్ దళంతో ఉన్న ముంబై ఈసారి మాత్రం దారుణంగా చతికిలపడుతున్నది. బుమ్రా మినహా ఆ జట్టు బౌలర్లలో బాసిల్ తంపి, మిల్స్, టిమ్ డేవిడ్ లు దారుణంగా విఫలమవుతున్నారు.
ఇదే విషయాన్ని కొద్దిరోజుల క్రితం భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా వేలెత్తి చూపాడు. తాజాగా టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ముంబై ప్రధాన బలహీనత బౌలింగే అని.. అది మెరుగుపడనంత వరకు జట్టు ఎన్ని మార్పులు చేసిని లాభం లేదని చెప్పారు.