- Home
- Sports
- Cricket
- యువ క్రికెటర్లు అతడిని చూసి నేర్చుకోవాలి.. సెలక్టర్లకు మరో ఆప్షన్ లేకుండా చేసి టీమ్లోకి వచ్చాడు : మహ్మద్ కైఫ్
యువ క్రికెటర్లు అతడిని చూసి నేర్చుకోవాలి.. సెలక్టర్లకు మరో ఆప్షన్ లేకుండా చేసి టీమ్లోకి వచ్చాడు : మహ్మద్ కైఫ్
టీమిండియాలోకి వస్తున్న కొత్త కుర్రాళ్లు ఒకట్రెండు మ్యాచ్ లలో మెరిసి తర్వాత విఫలమయ్యాక జట్టులో చోటు కోసం వేచి చూసే క్రమంలో కాస్త అసహనానికి లోనవుతున్నారు. అయితే ఈ విషయంలో యువ క్రికెటర్లు టీమిండియా నయా వాల్ ను ఆదర్శంగా తీసుకోవాలని సూచిస్తున్నాడు భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్.

బంగ్లాదేశ్ తో రెండు మ్యాచ్ ల టెస్టు సిరీస్ రేపటి నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. ఈ ఏడాది జూన్ లో ఇంగ్లాండ్ లో ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగిన టెస్టు తర్వాత భారత జట్టు మళ్లీ టెస్టు ఆడటం ఇదే ప్రథమం. ఈ సిరీస్ కు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గైర్హాజరీలో కెఎల్ రాహుల్ సారథిగా వ్యవహరిస్తుండగా నయా వాల్ ఛతేశ్వర్ పుజారా వైస్ కెప్టెన్ గా ఉన్నాడు.
పుజారా భారత జట్టు తరఫున కేవలం టెస్టులలో మాత్రమే ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే 90కి పైగా టెస్టులు ఆడిన ఈ వెటరన్ ఆటగాడు గతేడాది పేలవ ఫామ్ తో విమర్శలు ఎదుర్కున్నాడు.
ఇంగ్లాండ్ సిరీస్ తో పాటు ఆ తర్వాత న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా సిరీస్ లలో పుజారా పేలవ ఫామ్ తో తడబడ్డాడు. దీంతో బీసీసీఐ అతడిని శ్రీలంకతో స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్ లో పక్కనబెట్టింది. దీంతో పుజారా కెరీర్ కు ముగింపు పడ్డట్టేనని అనుకున్నారంతా. కానీ మూడు నెలల వ్యవధిలోనే పుజారా మళ్లీ జట్టుతో చేరాడు.
తాజాగా ఇదే విషయమై టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ పుజారాపై ప్రశంసలు కురిపించాడు. పుజారా తన ఆటతో సెలక్టర్లకు వేరే ఆప్షన్ లేకుండా చేశాడని అన్నాడు. కైఫ్ మాట్లాడుతూ.. ‘శ్రీలంకతో సిరీస్ లో పుజారా ఎంపిక కాలేదు. కానీ తర్వాత అతడు కౌంటీకి వెళ్లి తనను తాను నిరూపించుకున్నాడు. కౌంటీలలో సెంచరీల మీద సెంచరీలు చేసి తిరిగి జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు. దీంతో సెలక్టర్లకు పుజారాను ఎంపిక చేయాల్సిన తప్పనిసరి పరిస్థితులు ఎదురయ్యాయి.
ఇది నేటి తరం క్రికెటర్లకు ఆదర్శం. క్రికెట్ లో వయసు ఒక సంఖ్య మాత్రమే. ఇది నైపుణ్యంతో ఆడాల్సిన ఆట. ఇది ఫుట్ బాల్ కాదు. ఆ ఆటలో అయితే మ్యాచ్ ఆసాంతం పరిగెత్తుతూనే ఉండాలి. కానీ క్రికెట్ లో అలా అవసరం లేదు. ఇంకోరకంగా చెప్పాలంటే వయసు ఎక్కువైతే ఆటపై అవగాహన వస్తుంది. అనుభవం క్రికెట్ లో బాగా పనిచేస్తుంది. రోహిత్, కోహ్లీ, పుజారాలే దానికి ఉదాహరణ.
భారత జట్టుకు పుజారా లాంటి బ్యాటర్లు కావాలి. సీమ్, పేస్, స్పిన్ ట్రాక్ లపై రాణించే బ్యాటర్లు భారత్ కు అవసరం ఉంది..’ అని కైఫ్ తెలిపాడు. భారత జట్టు బంగ్లాదేశ్ తో బుధవారం నుంచి తొలి టెస్టు ఆడనున్న నేపథ్యంలో పుజారా మీద టీమిండియా భారీ ఆశలే పెట్టుకుంది.