- Home
- Sports
- Cricket
- పుజారా, రహానేల స్థానాలను భర్తీ చేయడం కష్టం.. కానీ అతడిపై పెద్ద బాధ్యత ఉంది.. హిట్ మ్యాన్ ఆసక్తికర వ్యాఖ్యలు
పుజారా, రహానేల స్థానాలను భర్తీ చేయడం కష్టం.. కానీ అతడిపై పెద్ద బాధ్యత ఉంది.. హిట్ మ్యాన్ ఆసక్తికర వ్యాఖ్యలు
India vs Srilanka: ఇటీవలే లంకతో ముగిసిన టీ20 సిరీస్ లో అదరగొట్టిన అయ్యర్.. ఇప్పుడు లంకతో టెస్టు సిరీస్ లో కూడా మెరిశాడు. తన హాఫ్ సెంచరీల ప్రయాణాన్ని కొనసాగిస్తూ..

భారత టెస్టు జట్టులో ఛటేశ్వర్ పుజారా, అజింక్యా రహానే లు దిగ్గజాలు. ఫామ్ కోల్పోయినంత మాత్రానో.. సరిగా ఆడటం లేదనో వాళ్లను తాత్కాలికంగా పక్కకు పెట్టినా టీమిండియా బ్యాటింగ్ లో... ముఖ్యంగా టెస్టులలో గత ఐదారేండ్లుగా వాళ్లు వేసిన ముద్ర సుస్పష్టం.
అయితే లంకతో టెస్టు సిరీస్ సందర్భంగా ఆ ఇద్దరినీ పక్కకుపెట్టింది బీసీసీఐ. వారి స్థానంలో హనుమ విహారి, శ్రేయస్ అయ్యర్ లకు అవకాశం కల్పించింది.
పుజారా స్థానంలో విహారి బ్యాటింగ్ కు రాగా.. రహానే స్థానంలో శ్రేయస్ అయ్యర్ క్రీజులోకి వచ్చాడు. ఈ క్రమంలో అయ్యర్.. బౌలర్లకు అనుకూలిస్తున్న బెంగళూరు పిచ్ పై అద్భుతంగా ఆడాడు.
రెండు ఇన్నింగ్స్ లలోనూ హాఫ్ సెంచరీలు చేశాడు. భారత బ్యాటింగ్ కు వెన్నెముకగా నిలిచాడు. రెండో టెస్టులో అతడికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా దక్కింది.
ఈ నేపథ్యంలో టీమిండియా సారథి రోహిత్ శర్మ.. అయ్యర్ పై ప్రశంసలు కురిపించాడు. అతడిపై పెద్ద బాధ్యత ఉందని, దానిని అతడు నిర్వర్తించగలడని నమ్ముతున్నట్టు చెప్పుకొచ్చాడు.
రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ‘శ్రేయస్ ఇటీవల లంకతో టీ20 ల సందర్భంగా ప్రదర్శించిన ఫామ్ ను కొనసాగించాడు. అతడిపై ఎంత పెద్ద బాధ్యత ఉందో అయ్యర్ కు తెలుసు. రహానే, పుజారాల స్థానంలో అతడు ఆడుతున్నాడు.
అయితే అందుకు సిద్ధంగా ఉన్నాడు. అతడు భారత జట్టులోకి అడుగుపెట్టినప్పట్నుంచి చూస్తున్నాను. అప్పటికంటే ఇప్పుడు ఇంకా భాగా మెరుగయ్యాడు..’ అని హిట్ మ్యాన్ చెప్పాడు.
గతంలో పరిమిత ఓవర్ల క్రికెట్ కే పరిమితమైన అయ్యర్.. గతేడాది నవంబర్ లో న్యూజిలాండ్ తో జరిగిన కాన్పూర్ టెస్టులో అరంగ్రేటం చేశాడు. తొలి టెస్టులోనే సెంచరీతో పాటు హాఫ్ సెంచరీ కూడా చేశాడు.
దక్షిణాఫ్రికా పర్యటనకు ఎంపికైనా అనారోగ్య సమస్యలతో ఆ సిరీస్ లో అతడు ఆడలేదు. కానీ ఇటీవలే లంకతో స్వదేశంలో ముగిసిన టీ20 సిరీస్ లో వరుస మ్యాచుల్లో 3 హాఫ్ సెంచరీలు చేశాడు.
ఆ సిరీస్ లో 204 పరుగులు చేశాడు అయ్యర్. దీంతో అతడికి ఫిబ్రవరి నెలకు గాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు కూడా దక్కింది. ఇక లంకతో ముగిసిన రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో భారత బ్యాటర్లంతా విఫలమైన చోట అయ్యర్ 92 పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్ లో 67 రన్స్ చేశాడు.