కాలం కలిసొచ్చి బాడీ సహకరిస్తే ఆడతా లేదంటే అంతే.. టీమిండియా కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు
బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత జట్టు త్వరలోనే నాగ్పూర్ వేదికగా తొలి టెస్టు ఆడనుంది. ఈ టెస్టు ప్రారంభం నేపథ్యంలో.. భారత క్రికెట్ జట్టుకు టీ20లలో తాత్కాలిక సారథిగా వ్యవహరిస్తున్న హార్ధిక్ పాండ్యా తన టెస్టుల పునరాగమనంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
టీమిండియా ఇటీవలే న్యూజిలాండ్ సిరీస్ ముగించుకుని ప్రస్తుతం ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్ కు సిద్ధమవుతున్నది. నాగ్పూర్ వేదికగా తొలి టెస్టు జరుగనున్నది. ఇప్పటికే నాగ్పూర్ చేరుకుని ఇక్కడ ప్రాక్టీస్ మొదలుపెట్టింది టీమిండియా. టెస్టు సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో భారత క్రికెట్ జట్టుకు టీ20లలో తాత్కాలిక సారథిగా వ్యవహరిస్తున్న హార్ధిక్ పాండ్యా తన టెస్టుల పునరాగమనంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
2021లో గాయంతో టీమ్ లో చోటు కోల్పోయి కొన్నాళ్ల పాటు విరామం తీసుకున్న పాండ్యా.. 2022లో గుజరాత్ టైటాన్స్ కు సారథిగా వ్యవహరించాడు. ఐపీఎల్ తో పాండ్యా సెకండ్ ఇన్నింగ్స్ మొదలైంది. ఈ సీజన్ లో గుజరాత్ కు ట్రోఫీ అందించడంలో కీలక పాత్ర పోషించిన పాండ్యా.. ఆ తర్వాత భారత జట్టులో కూడా మెరుపులు మెరిపిస్తున్నాడు.
ఐపీఎల్ తర్వాత భారత జట్టులోకి వచ్చిన పాండ్యా.. మళ్లీ పునరాగమనాన్ని ఘనంగా చాటాడు. అతడి నిలకడను, ఐపీఎల్ లో కెప్టెన్సీ స్కిల్స్ ను చూసిన బీసీసీఐ కూడా టీ20లలో రాహుల్ ను తప్పించి మరీ పాండ్యాకే సారథ్య బాధ్యతలు కట్టబెట్టింది. రోహిత్ తర్వాత భావి సారథిగా కూడా అతడే రానున్నట్టు బోర్డు వర్గాలు చెబుతున్నాయి.
అయితే అటు టీ20లతో పాటు ఇటు వన్డేలలో కూడా రాణిస్తున్న పాండ్యా.. తిరిగి టెస్టులలోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడు..? అని ఈ మధ్య కొత్త చర్చ మొదలైంది. పాండ్యా టెస్టు ఆడి నాలుగేండ్లు దాటింది. న్యూజిలాండ్ తో మూడో టీ20 ముగిశాక పాండ్యాకు ఇదే ప్రశ్న ఎదురైంది. ‘హార్ధిక్, టీ20, వన్డేలలో అదరగొడుతున్నావు. మరి టెస్టులలోకి రీఎంట్రీ ఎప్పుడు..?’అని కామెంటేటర్ అడిగాడు.
దానికి పాండ్యా స్పందిస్తూ.. ‘టెస్టులా... వస్తా. కానీ ఇప్పుడే కాదు. ప్రస్తుతానికి నా దృష్టంతా వైట్ బాల్ (టీ20, వన్డే) క్రికెట్ మీదే ఉంది. నా వరకైతే ఇప్పుడు అదే చాలా కీలకం. కాలం కలిసొచ్చి, నేను ఫిట్ గా ఉంటే.. నా బాడీ టెస్టు క్రికెట్ ఆడేందుకు సహకరిస్తే తప్పకుండా టెస్టులలోకి రీఎంట్రీ ఇస్తా. కానీ అప్పటిదాకా నేను వైట్ బాల్ క్రికెట్ మీదే దృష్టి సారిస్తా..’అని అన్నాడు.
హార్ధిక్ తన కెరీర్ లో 11 టెస్టులు ఆడాడు. 2017లో భారత జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లగా పాండ్యా.. గాలె టెస్టులో అరంగేట్రం చేశాడు. మొత్తంగా 18 ఇన్నింగ్స్ లలో 532 పరుగులు చేశాడు. 17 వికెట్లు పడగొట్టాడు. 2018లో నాటింగ్హోమ్ లో భారత్ - ఇంగ్లాండ్ టెస్టు మ్యాచ్ తర్వాత పాండ్యా మళ్లీ టెస్టులు ఆడలేదు.