- Home
- Sports
- Cricket
- IPL: టికెట్ల విక్రయం షురూ.. అభిమానులకు రెండు శుభవార్తలు చెప్పిన బీసీసీఐ.. ఇక పండుగే.. కానీ అవి పాటించాల్సిందే
IPL: టికెట్ల విక్రయం షురూ.. అభిమానులకు రెండు శుభవార్తలు చెప్పిన బీసీసీఐ.. ఇక పండుగే.. కానీ అవి పాటించాల్సిందే
BCCI To Allow 25% Capacity: మెగా ఐపీఎల్ సీజన్ కోసం క్రికెట్ అభిమానులంతా కళ్లల్లో వత్తులేసుకుని చూస్తున్న వేళ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) వారికి గుడ్ న్యూస్ చెప్పింది. ఒక్కటి కాదు.. రెండు శుభవార్తలు చెప్పింది.

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్-15 సీజన్ కు మరో మూడు రోజులే గడువున్నది. ఈనెల 26 నుంచి మహారాష్ట్ర వేదికగా ఐపీఎల్ మెగా సీజన్ కు తెరలేవనున్నది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ అభిమానులకు బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది.
ఈసారి ఐపీఎల్ కోసం స్టేడియంలో ప్రేక్షకులకు అనుమతినిస్తున్నట్టు బీసీసీఐ ప్రకటించింది. స్టేడియాల్లోకి 25 శాతం ప్రేక్షకులను అనుమతించినట్టు తెలిపింది. ఈ మేరకు బీసీసీఐ అధికారిక ప్రకటన కూడా వెలువరించింది.
‘ఐపీఎల్-15వ సీజన్ కు ప్రేక్షకులను అనుమతిస్తున్నాం. మ్యాచులు జరిగే స్టేడియాలలో 25 శాతం మంది సామర్థ్యంతో ఐపీఎల్ ను నిర్వహిస్తాం. తమ అభిమాన క్రికెటర్ల ఆటను దగ్గర్నుంచి చూడాలని కోరుకునే అభిమానుల కోరికను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నాం.
అయితే మ్యాచులకు వచ్చే ప్రేక్షకులు కొవిడ్-19 నిబంధనలను కచ్చితంగా పాటించాలి. స్టేడియంలో కూడా కొవిడ్ ప్రోటోకాల్స్ అమల్లో ఉంటాయి..’ అని తెలిపింది. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారినే స్టేడియంలోకి అనుమతించనున్నారు.
మహారాష్ట్రలోని వాంఖెడే, బ్రబోర్న్ (సీసీఐ), డీవై పాటిల్ స్టేడియంలో 55 మ్యాచులు జరుగనుండగా.. పూణెలోని ఎంసీఎ గ్రౌండ్ లో 15 మ్యాచులు జరుగుతాయి. లీగ్ దశలో మొత్తంగా 70 మ్యాచులు ఉంటాయన్న విషయం తెలిసిందే. అయితే ప్లే ఆఫ్స్ కు సంబంధించిన షెడ్యూల్ ఇంకా విడుదల చేయాల్సి ఉంది.
పలు యూరప్ దేశాలతో పాటు చైనాలో మళ్లీ కరోనా విజృంభిస్తుండటంతో అప్రమత్తంగా ఉండాలని ఇటీవలే కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు లేఖలు రాసిన నేపథ్యంలో మ్యాచులు జరుగుతున్న మహారాష్ట్రలో.. ప్రేక్షకుల మధ్య మ్యాచుల నిర్వహణ పై అనుమానాలు నెలకొన్నాయి. అయితే బీసీసీఐ మాత్రం 25 శాతం మంది ప్రేక్షకులకు అనుమతించడం గమనార్హం.
ఈనెల 26 నుంచి వాంఖెడే స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ - కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరిగే మ్యాచుతో ఈ సీజన్ కు తెరలేవనుంది.
అయితే ఈ మ్యాచు కోసం టికెట్ల విక్రయాన్ని కూడా ప్రారంభించింది బీసీసీఐ. బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి ఐపీఎల్ అధికారిక వెబ్ సైట్ www.iplt20.com. తో పాటు www.BookMyShow.com లలో కూడా అందుబాటులో ఉంచినట్టు బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది.