ప్లేఆఫ్ రేసులో రేపు కీలక మ్యాచ్.. ఢిల్లీకి గుడ్ న్యూస్.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన స్టార్ ఓపెనర్
Prithvi Shaw: కీలక మ్యాచులు ముందున్న నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ అభిమానులకు ఆ జట్టు యాజమాన్యం శుభవార్త చెప్పింది. ఢిల్లీ స్టార్ ఓపెనర్ పృథ్వీ షా ఆ జట్టుతో కలిశాడు.
ప్లేఆఫ్స్ రేసులో ముందంజలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ కు శుభవార్త. ఆ జట్టు స్టార్ ఓపెనర్ పృథ్వీ షా తిరిగి జట్టుతో చేరాడు. ఈ విషయాన్ని స్వయంగా ఢిల్లీ క్యాపిటల్స్ తన అధికారిక ట్విటర్ ఖాతాలో వెల్లడించింది.
గత వారం రోజులుగా టైపాయిడ్ తో బాధపడుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ పృథ్వీ షా.. శనివారం రాత్రి ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యాడు. అక్కడ్నుంచి అతడు నేరుగా ఢిల్లీ ఆటగాళ్లు బస చేస్తున్న హోటల్ తాజ్ కు చేరుకున్నాడు.
ఇదే విషయమై ఢిల్లీ తన ట్విటర్ ఖాతాలో స్పందిస్తూ.. ‘వారం రోజులుగాటైపాయిడ్ తో బాధపడుతున్న పృథ్వీ షా శనివారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యాడు. అతడు తిరిగి మా జట్టుతో కలిశాడు. ప్రస్తుతం అతడు మా జట్టు మెడికల్ టీమ్ పర్యవేక్షణలో ఉన్నాడు..’ అని రాసుకొచ్చింది.
ఢిల్లీ ఆడిన గత మూడు మ్యాచుల్లో పృథ్వీ ఆడలేదు. సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్ తో మ్యాచ్ ల సమయంలో అతడు ఆస్పత్రిలోనే ఉన్నాడు. అతడు తర్వాత మ్యాచులకు అందుబాటులో ఉండటం కష్టమేనని అసిస్టెంట్ కోచ్ షేన్ వాట్సన్ కూడా తెలిపిన విషయం విదితమే.
కాగా ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే ఢిల్లీ క్యాపిటల్స్ రెండు కీలక మ్యాచులు ఆడాల్సి ఉంది. ఆ జట్టు.. సోమవారం పంజాబ్ కింగ్స్ ను ఢీకొననుంది మే 21న ముంబై ఇండియన్స్ తో పోటీ పడాల్సి ఉంది. అయితే సోమవారం నాటి మ్యాచ్ లో షా ఆడతాడా..? లేదా..? అనేది ఇంకా అనుమానమే. కానీ ముంబై తో మ్యాచ్ నాటికి షా సిద్ధంగా ఉండే అవకాశాలున్నాయి.
ఈ సీజన్ లో 9 మ్యాచులాడిన షా.. 259 పరుగులు సాధించాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. డేవిడ్ వార్నర్ తో కలిసి పవర్ ప్లే లో విధ్వంసం సృష్టించిన షా.. మూడు మ్యాచుల్లో లేకపోవడంతో ఆ జట్టు తొలి ఐదు ఓవర్లలో పరుగుల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నది.