బౌలింగ్ చేయలేకపోతే అతన్ని పక్కనపెట్టేయండి... పాండ్యా కంటే విహారి బెస్ట్... మాజీ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్...
ఐపీఎల్ 2021 సీజన్కి సడెన్గా బ్రేక్ పడడంతో ఇప్పుడు అందరి దృష్టి, ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్పైకి మళ్లింది. టెస్టు ఫార్మాట్లో తొలిసారిగా ఐసీసీ నిర్వహిస్తున్న ఈ సుదీర్ఘ మెగా ఈవెంట్ ఫైనల్ మ్యాచ్కి భారత జట్టును ఎంపిక చేయనుంది బీసీసీఐ.
ఇంగ్లాండ్లో న్యూజిలాండ్తో ఆడబోయే ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్కి హార్ధిక్ పాండ్యా పేరు కూడా పరిశీలనలో ఉంది. అయితే పాండ్యా ఫామ్ క్రికెట్ ఫ్యాన్స్ను తీవ్రంగా కలవరపెడుతోంది.
వెన్నెముక సర్జరీ తర్వాత రీఎంట్రీ ఇచ్చిన హార్ధిక్ పాండ్యా... ఆస్ట్రేలియా టూర్లో, ఇంగ్లాండ్తో స్వదేశంలో జరిగిన వన్డే, టీ20ల్లో బ్యాటుతో బాగానే రాణించాడు. అయితే బౌలింగ్ చేయడానికి మాత్రం పాండ్యా ఇంకా ఇబ్బందిపడుతూనే ఉన్నాడు.
‘ఇంగ్లాండ్తో జరిగిన సిరీస్లో హార్ధిక్ పాండ్యాను బౌలింగ్ చేయకూడదని జట్టే కోరి ఉంటుంది. ఎందుకంటే వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్, ఆ తర్వాత ఇంగ్లాండ్ టూర్ కోసం అతను సిద్ధంగా ఉండాలని టీమ్ భావించి ఉండొచ్చు.
అయితే ఐపీఎల్2021 సీజన్లో కూడా హార్ధిక్ పాండ్యా బౌలింగ్ చేయలేకపోయాడు. కేవలం బ్యాట్స్మెన్గా మాత్రమే అయితే హార్ధిక్ పాండ్యాకి టెస్టు జట్టులో చోటు ఇవ్వకపోవడమే మంచిది. అతని ప్లేస్లో విహారిని తీసుకుంటే బెటర్...
ఒకవేళ పాండ్యా బౌలింగ్ చేయడానికి ఫిట్గా ఉంటే, టెస్టులకు అతన్ని ఎంపిక చేయడం కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే అతను పార్ట్ టైం బౌలర్గా జట్టును ఎంతగానో ఉపయోగపడతాడు. అతను ఆల్రౌండర్గానే జట్టుకి అవసరం...
2018లో నాటింగ్మ్లో జరిగిన టెస్టులో హార్ధిక్ పాండ్యా ఇలా బౌలింగ్ చేసి ఐదు వికెట్లు పడగొట్టాడు. పాండ్యా నుంచి టీమిండియా కోరుకునేది అదే...’ అంటూ చెప్పుకొచ్చాడు మాజీ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్...
‘టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో పృథ్వీషాకి చోటు దక్కకపోవచ్చు. ఎందుకంటే రోహిత్ శర్మతో పాటు కెఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, శుబ్మన్ గిల్ రూపంలో జట్టుకి నలుగురు ఓపెనర్లు రెఢీగా ఉన్నారు...
ఫైనల్ మ్యాచ్కి ముందు జరిగే ఇండియా ఏ జట్టులో అయితే పృథ్వీషాకి తప్పనిసరిగా చోటు ఉంటుంది... అలాగే రవీంద్ర జడేజా ఫిట్నెస్ సాధించడంతో అక్షర్ పటేల్కి తుదిజట్టులో చోటు దక్కడం కష్టమే’ అంటూ చెప్పుకొచ్చాడు ఎమ్మెస్కే ప్రసాద్...
జూన్ 18 నుంచి ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ కోసం జూన్ 2న ఇంగ్లాండ్ బయలుదేరి వెళ్లనుంది భారత జట్టు. ఈ వారంలో జట్టును ఎంపిక చేసి, బీసీసీఐకి సమర్పించనున్నారు సెలక్టర్లు.
అయితే ప్రస్తుతం ఇండియా నుంచి విమానాల రాకపోకలపై ఆంక్షలు ఉన్న నేపథ్యంలో భారత జట్టు పర్యటనపై అన్ని రకాల అనుమతులు వచ్చిన తర్వాత భారత జట్టును ప్రకటించనుంది బీసీసీఐ..