- Home
- Sports
- Cricket
- ముప్పై ఏండ్లయినా కానరాని అకాడమీ.. రాష్ట్ర ప్రభుత్వానికి భూమిని తిరిగిచ్చేసిన దిగ్గజ క్రికెటర్
ముప్పై ఏండ్లయినా కానరాని అకాడమీ.. రాష్ట్ర ప్రభుత్వానికి భూమిని తిరిగిచ్చేసిన దిగ్గజ క్రికెటర్
Sunil Gavaskar: భారత క్రికెట్ జట్టు మాజీ సారథి, దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ గతంలో తనకు కేటాయించిన ఓ భూమిని తిరిగి మహారాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేశాడు. భారత్ క్రికెట్ కు ఆయన చేసిన సేవలకు గాను 1988లొో రాష్ట్ర ప్రభుత్వం సన్నీకి భూమిని కేటాయించింది.

భారత్ క్రికెట్ జట్టు గర్వించే ఆటగాళ్లలో తొలి స్థానంలో ఉన్న ముంబై సొగసరి బ్యాటర్ సునీల్ గవాస్కర్.. ముప్పై ఏండ్ల తర్వాత తనకు కేటాయించిన ఓ భూమిని తిరిగి ప్రభుత్వానికే ఇచ్చేయడం చర్చనీయాంశంగా మారింది.
33 ఏండ్లయినా సునీల్ గవాస్కర్ తనకు కేటాయించిన భూమిలో క్రికెట్ అకాడమీని నిర్మించలేదు. దీంతో ఆయన తనకు భూమి వద్దంటూ రాష్ట్ర ప్రభుత్వానికే తిరిగిచ్చేశాడు.
వివరాల్లోకి వెళ్తే.. 1988లో అప్పటి మహారాష్ట్ర ప్రభుత్వం గవాస్కర్ కు ముంబై లోని అత్యంత ఖరీదైన ప్రాంతంగా పేరున్న బాంద్రా శివార్లలో 20 వేల స్క్వేర్ ఫీట్ లలో ఒక ప్లాట్ ను కేటాయించింది. అందులో క్రికెట్ అకాడమీని ఏర్పాటు చేయాలని గవాస్కర్ గతంలో భావించాడు.
అయితే 33 ఏండ్లు గడుస్తున్నప్పటికీ అక్కడ అకాడమీకి సంబంధించిన ఒక్క అడుగు కూడా ముందకు పడలేదు. అకాడమీ సంగతి పక్కనబెడితే అక్కడ కనీసం మౌళిక సదుపాయాలను కూడా అభివృద్ధి చేయలేదు.
గతంలో క్రికెట్ అకాడమీ విషయమై సచిన్ తో కలిసి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేను కలిసిన గవాస్కర్.. అకాడమీకి సంబంధించిన ప్లాన్ ను వివరించాడు. కానీ ఆ ప్రణాళిక కూడా కార్యరూపం దాల్చలేదు.
దీంతో రాష్ట్ర గృహ నిర్మాణాల శాఖ మంత్రి జితేంద్ర అవ్హద్.. గతేడాది గవాస్కర్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. 30 ఏండ్లు కావస్తున్నా ఇంకా అకాడమీ నిర్మించకుండా అంత విలువైన భూమిని ఖాళీగా ఉంచితే ఎలా..? అని ప్రశ్నించారు.
ఇక తాజాగా గవాస్కర్.. తనకు కేటాయించిన భూమిని తిరిగి ఇచ్చేస్తున్నట్టు ఉద్ధవ్ ఠాక్రేకు బుధవారం లేఖ రాసినట్టు మహారాష్ట్ర హౌసింగ్ అండ్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (ఎంహెచ్డీఏ) పేర్కొంది.
భారత్ తరఫున 125 టెస్టులాడిన గవాస్కర్.. 51.12 సగటుతో 10,122 పరుగులు చేశాడు. ఇందులో 45 హాఫ్ సెంచరీలు, 34 సెంచరీలు ఉన్నాయి. వన్డేలలో 108 మ్యాచులాడి 3,093 రన్స్ సాధించాడు. వన్డేలలో సన్నీ 27 హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ చేశాడు. భారత క్రికెట్ కు గవాస్కర్ చేసిన సేవలకు గాను 1988లో రాష్ట్ర ప్రభుత్వం అతడికి భూమిని కేటాయించింది.