- Home
- Sports
- Cricket
- బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ భారత్దే.. ఆసీస్కు అంత సీన్ లేదు.. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ కామెంట్స్
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ భారత్దే.. ఆసీస్కు అంత సీన్ లేదు.. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ కామెంట్స్
Border-Gavaskar Trophy: ఫిబ్రవరిలో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు భారత పర్యటనకు రానుంది. నాలుగు టెస్టులు, మూడు వన్డేలు ఆడేందుకు గాను కమిన్స్ సేన భారత్ రాబోతున్నది. ఫిబ్రవరి 9 నుంచి తొలి టెస్టు మొదలవుతుంది.

విదేశాల్లో ఓడినా స్వదేశంలో భారత్ ను ఓడించడం అంత ఆషామాషీ కాదంటున్నాడు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఇయాన్ హీలి. త్వరలో భారత్ పర్యటనకు రానున్న ఆస్ట్రేలియా.. బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీని కోల్పోవడం ఖాయమని.. ఆ జట్టుకు భారత్ ను ఓడించేంత సీన్ లేదని అన్నాడు.
ఇతర దేశాలపై ఆధిపత్యం చెలాయించే ఆస్ట్రేలియా.. భారత్ లో మాత్రం తేలిపోతుంది. చివరిసారి ఆ జట్టు ఇక్కడ 2004లో సిరీస్ నెగ్గింది. ఆ తర్వాత 19 ఏండ్లుగా ఆసీస్ కు ప్రతీసారి నిరాశే ఎదురవుతున్నది. అదీగాక 2019-20, 2021 లలో భారత జట్టు.. ఆస్ట్రేలియాలో ఆ జట్టును ఓడించడం కంగారూలకు భారీ షాక్. దీంతో ఈ సారి భారత్ ను స్వదేశంలో ఓడించాలనే పట్టుదలతో ప్యాట్ కమిన్స్ సేన ఉంది.
ఇరు జట్లు ప్రతిష్టాత్మకంగా భావించే ఈ సిరీస్ లో తొలి టెస్టు ఫిబ్రవరి 9 నుంచి మొదలుకాబోతుంది. త్వరలోనే ఆసీస్ భారత్ కు రానుంది. ఈ సందర్భంగా హీలి మాట్లాడుతూ..‘స్వదేశంలో వాళ్ల (టీమిండియా)ను ఓడించడం సులవైన విషయం కాదు. వాళ్ల స్పిన్నర్లను చూస్తే నాకేమీ భయం కలగడం లేదు..
కానీ అక్కడి వికెట్లు (పిచ్) స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటాయి. అదీగాక భారత్ గనక స్పిన్ ఫ్రెండ్లీ పిచ్ లను తయారుచేస్తే ఆసీస్ కు తిప్పలు తప్పవు. గత పర్యటన సమయంలో కూడా మాకు ఇలాగే జరిగింది. మేం ఓడటానికి కారణం కూడా అదే. టెస్టు తొలి రోజు నుంచే స్పిన్నర్లు ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నిస్తారు.
అదే జరిగితే మాత్రం ఆసీస్ కు కష్టమే. అలా కాకుండా ఒకవేళ వాళ్లు ఫ్లాట్ వికెట్ గానీ బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్ లను తయారుచేస్తే అప్పుడు పోరు రసవత్తరమవుతుంది. అయినా కూడా ఆసీస్ బౌలర్లు చెమటోడ్చాల్సిందే. నా అభిప్రాయం ప్రకారం.. ఈ సిరీస్ ను భారత్ 2-1 తేడాతో గెలుస్తుంది...’అని అన్నాడు.
ఇక ఈ సిరీస్ భారత్ కు చాలా కీలకం. ఇప్పటికే ఆసీస్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ బెర్త్ ను ఆస్ట్రేలియా ఖాయం చేసుకోగా భారత్ మాత్రం కంగారూలను 3-0 లేదా 2-1 తేడాతో ఓడిస్తేనే ఫైనల్ పోరు ఆడేందుకు అవకాశం ఉంటుంది. మరి స్వదేశంలో రోహిత్ సేన ఏ మేరకు కంగారూలను నిలువరించగలుగుతుందో..?