సీసా పాతదే, సారా పాతదే! కలిపి కొడితే పోయే... టీమిండియా కొత్త జెర్సీపై ట్రోల్స్...
టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ కోసం కొత్త జెర్సీని ఆవిష్కరించింది బీసీసీఐ. ప్రీ లుక్లో లైట్ బ్లూ కలర్ కనిపించడంతో వింటేజ్ లుక్లో టీమిండియా ప్లేయర్లు కనిపించబోతున్నారని తెగ హడావుడి జరిగినా... కొత్త జెర్సీ పూర్తి లుక్ ఫ్యాన్స్ని పెద్దగా మెప్పించలేకపోయింది.. సోషల్ మీడియాలో టీమిండియా కొత్త జెర్సీపై ట్రోల్స్ వినిపిస్తున్నాయి.
Team India New Jersey
పాత జెర్సీ వస్తుందని అనుకుంటే, కొత్త పాత కాకుండా రెండింటినీ కలగాపులగం చేసి ఓ జెర్సీ తీసుకొచ్చింది బీసీసీఐ. లైట్ బ్లూ కలర్ జెర్సీ అంచులకు డార్క్ బ్లూ కలర్ని భుజాలపైన, అక్కడక్కడా అద్ది.. కొత్త జెర్సీని రూపొందించారు డిజైనర్లు...
2021 టీ20 వరల్డ్ కప్ కోసం భారత క్రికెట్ ఫ్యాన్స్ అరుపుల నుంచి సౌండ్ వేవ్స్ తీసుకుని జెర్సీని రూపొందించింది బీసీసీఐ. ఆరంభంలో ఈ జెర్సీకి బీభత్సమైన పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఆహో ఓహో అన్నారు అభిమానులు...
rohit sharma
అయితే టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో భారత జట్టు వరుసగా పాకిస్తాన్, న్యూజిలాండ్ చేతుల్లో ఓడి గ్రూప్ స్టేజీ నుంచే నిష్కమించడంలో ఈ సౌండ్ వేవ్ జెర్సీ కనిపించకుండా పోయింది... సైలెంట్ శబ్ద తరంగాలను తొలగించి డార్క్ బ్లూ కలర్ జెర్సీనే వాడింది బీసీసీఐ...
Image credit: MPL/Twitter
2007 నుంచి 2016 వరకూ భారత జట్టు ఉపయోగించిన బ్లూ కలర్ జెర్సీలకు ఆరెంజ్ కలర్ లైన్ అదనపు అందాన్ని, ఆకర్షణని జోడించేది. అయితే టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ నుంచి ఆ ఆరెంజ్ కలర్ లైన్ కనిపించడం మానేసింది. బ్లూ జెర్సీలోని ఆ కాషాయాన్ని బీసీసీఐ ఎందుకు తొలగించిందనేదానిపై కూడా సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది...
అయితే కొందరు మాత్రం బీసీసీఐ తీసుకొచ్చిందని కొత్త జెర్సీ చాలా బాగుందని, ఆరంభంలో బాలేదని పెదవి విరిచినవాళ్లు కూడా పోనుపోను దీనికే అలవాటు పడిపోతారని, ఎక్కువగా ఇష్టపడతారని... అంటున్నారు. ఈ జెర్సీలను ఆన్లైన్ అమ్మకానికి కూడా పెట్టేసింది బీసీసీఐ...
బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ వెర్షన్తో పాటు భారత ప్రస్తుత సారథి రోహిత్ శర్మ వెర్షన్తో జెర్సీలను విక్రయిస్తోంది బీసీసీఐ. ఈ జెర్సీల ధర రూ.4299. అయితే ఈ డిజైన్ విడుదల అయ్యిందో లేదో దాన్ని కాపీ కొట్టిన కొందరు వ్యాపారస్తులు రూ.699కే భారత కొత్త జెర్సీని మార్కెట్లో విక్రయిస్తుండడం విశేషం.