‘సారీ... ఐపీఎల్ ఆడలేం...’ తేల్చి చెప్పేసిన ఇంగ్లాండ్ క్రికెటర్లు... యాషెస్ సిరీస్తో పాటు బిజీ షెడ్యూల్...
ఐపీఎల్ 2021 సీజన్లో మిగిలిన మ్యాచులు పూర్తి చేయడం కష్టమేనని సౌరవ్ గంగూలీ వ్యాఖ్యల నుంచి ఫ్యాన్స్ తేరుకోకముందే, మరో షాక్ తగిలింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఐపీఎల్ పెట్టినా పాల్గొనలేమని తేల్చిచెప్పేసింది ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు..
షెడ్యూల్ ప్రకారం ఐపీఎల్ జరిగి ఉంటే మే 30 నాటికి సీజన్ పూర్తి అయ్యేది. అయితే జూన్ 2 నుంచి న్యూజిలాండ్తో రెండు మ్యాచుల టెస్టు సిరీస్ ఆడనుంది ఇంగ్లాండ్ జట్టు. ఐపీఎల్ కోసం ఈ సీజన్ను మిస్ అయ్యేందుకు కూడా ముందుకొచ్చారు కొందరు క్రికెటర్లు.
ఇంగ్లాండ్తో రెండు టెస్టుల సిరీస్ ముగిసిన తర్వాత శ్రీలంకతో కలిసి మూడు టీ20, మూడు వన్డేల సిరీస్ ఆడనుంది ఇంగ్లాండ్. ఆ తర్వాత పాకిస్తాన్తో కూడా మూడు వన్డే, మూడు టీ20 మ్యాచుల సిరీస్ జరుగుతుంది.
ఆ తర్వాత ఆగస్టులో టీమిండియాతో టెస్టు సిరీస్ మొదలవుతుంది. అంటే వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ ముగిసిన తర్వాత టీమిండియా నెల రోజులకు పైగా అక్కడే ఖాళీగా ఉంటుంటే, ఆ టైమ్లో ఇంగ్లాండ్ రెండు దేశాలతో సిరీస్లు ఆడనుంది.
‘ఇంగ్లాండ్ జట్టు క్రికెటర్లకు తగినంత విశ్రాంతిని ఇవ్వాలనే ఉద్దేశంతో రొటేషన్ పద్దతిని అనుసరిస్తోంది. కానీ ఐపీఎల్ కారణంగా చాలామంది ప్లేయర్లకు రెస్ట్ లేకుండా పోయింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంగ్లాండ్ క్రికెటర్లు చాలా బిజీగా గడపబోతున్నారు.
శ్రీలంక, న్యూజిలాండ్లతో వరుస సిరీస్లు ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఐపీఎల్ మిగిలిన మ్యాచుల్లో ఇంగ్లాండ్ క్రికెటర్లు పాల్గొనకపోవచ్చు.
ముందే టీ20 వరల్డ్కప్తో పాటు యాషెస్ సిరీస్ కూడా రానున్నాయి. వాటికి ఆటగాళ్లు మానసికంగా, శారీరకంగా సిద్ధంగా ఉండాలి...’ అంటూ తెలిపాడు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు డైరెక్టర్ ఆస్లే గైల్స్..
ఐపీఎల్ 2021 సీజన్లో సామ్ కుర్రాన్, మొయిన్ ఆలీ, ఇయాన్ మోర్గాన్, జానీ బెయిర్ స్టో, క్రిస్ వోక్స్, జోస్ బట్లర్, జాసన్ రాయ్, టామ్ కుర్రాన్తో పాటు గాయం నుంచి కోలుకున్న జోఫ్రా ఆర్చర్, బెన్ స్టోక్స్ తదితర క్రికెటర్లు ఐపీఎల్లో పాల్గొంటున్నారు.