దేవుడిపైనే భారం వేసిన పృథ్వీ షా.. టీమిండియాకు ఎంపిక కాకపోవడంపై ఎమోషనల్ పోస్ట్
India Tour Of England: దేశవాళీతో పాటు ఐపీఎల్ లో కూడా నిలకడగా రాణిస్తున్నా జాతీయ జట్టులో చోటు దక్కకపోవడం పట్ల ముంబై రంజీ కెప్టెన్ పృథ్వీ షా నిరాశలో ఉన్నాడు.

దక్షిణాఫ్రికా సిరీస్ లో చోటు దక్కకపోయినా త్వరలో జరుగనున్న ఐర్లాండ్ టూర్ కోసమైనా సెలక్టర్లు తనను ఎంపిక చేస్తారని ఆశలు పెట్టుకున్న టీమిండియా యువ ఆటగాడు పృథ్వీ షాకు మరోసారి నిరాశే ఎదురైంది.
ఐర్లాండ్ తో రెండు టీ20 మ్యాచుల కోసం ఇటీవల ప్రకటించిన 17 మంది జట్టు సభ్యులలో షా పేరు లేదు. దీంతో అతడు తీవ్ర నిరాశకు గురయ్యాడు. షా ను జట్టులోకి ఎంపిక చేయకపోవడంపై పలువురు క్రికెట్ అభిమానులు కూడా తప్పుబట్టారు.
షా ను ఎంపిక చేయకపోవడంపై సామాజిక మాధ్యమాల వేదికగా చాలా మంది సెలక్టర్ల తీరును తప్పుబట్టారు. తాజాగా తనకు జాతీయ జట్టులో చోటు దక్కకపోవడంపై స్వయంగా షా స్పందించాడు.
ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా అతడు స్పందిస్తూ.. ‘ఎప్పుడూ నమ్మకాన్ని వదులుకోకండి.. అద్భుతాలు మీ మార్గంలోనే ఉన్నాయి’ అని షిర్డీ సాయిబాబా ఉన్న ఫోటోను జతచేసి పోస్ట్ చేశాడు. ఈ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతున్నది.
తనకంటే వెనకొచ్చిన రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, రాహుల్ త్రిపాఠి వంటి ఆటగాళ్లకు అవకాశాలు కల్పిస్తున్న టీమ్ మేనేజ్మెంట్ .. షా కు మాత్రం మొండిచేయి చూపెడుతున్నది. షా చివరిసారిగా 2021 జులైలో భారత్ తరఫున ఆడాడు.
షా ను ఐర్లాండ్ టూర్ కు ఎంపికచేయకపోవడంపై ట్విటర్ లో పలువురు స్పందిస్తూ.. ‘ఐర్లాండ్ టూర్ లో పృథ్వీ షా ను ఎందుకు తీసుకోలేదు. ఇది చాలా దారుణం..’ ‘షా చేసిన తప్పేంటి..? బాగా ఆడటమే అతడి తప్పా చెప్పండి..?’ ‘బాధపడకు షా.. సూర్యుడు తూర్పున ఉదయించక మానడు.. నువ్వు టీమిండియాలోకి రాకుండా ఎవరూ అడ్డుకోలేరు..’ అని వారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఐర్లాండ్ పర్యటనకు భారత జట్టు : హార్ధిక్ పాండ్యా (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్, వెంకటేశ్ అయ్యర్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, దినేశ్ కార్తీక్, చహల్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, హర్షల్ పటేల్, ఆవేశ్ ఖాన్, అర్ష్దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్