- Home
- Sports
- Cricket
- సూర్యతో అతడిని పోల్చొద్దు.. ఒకవేళ తాను కూడా ఫెయిల్ అయితే అప్పుడు ఎవరిని నిందిస్తారు? : కపిల్ దేవ్
సూర్యతో అతడిని పోల్చొద్దు.. ఒకవేళ తాను కూడా ఫెయిల్ అయితే అప్పుడు ఎవరిని నిందిస్తారు? : కపిల్ దేవ్
Suryakumar Yadav: సూర్యను వన్డేలకు తప్పించి టీ20లకే పరిమితం చేయాలని, వన్డే ఫార్మాట్ లో అతడి బదులు సంజూ శాంసన్ ను ఆడించాలని సోషల్ మీడియా వేదికగా టీమిండియా ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో కపిల్ దేవ్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఫామ్ పై తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో మాజీ క్రికెటర్లు అతడికి మద్దతుగా నిలుస్తున్నారు. సూర్యను వన్డేలకు తప్పించి టీ20లకే పరిమితం చేయాలని, వన్డే ఫార్మాట్ లో అతడి బదులు సంజూ శాంసన్ ను ఆడించాలని సోషల్ మీడియా వేదికగా టీమిండియా ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.
ఫ్యాన్స్ తో పాటు మాజీ క్రికెటర్లలో కొంతమంది ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. వరుసగా మూడు వన్డేలలో సూర్య డకౌట్ అయిన నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ మాట్లాడుతూ కూడా.. ‘ఇంకా సంజూ ఏం చేయాలి..?’అని ప్రశ్నించాడు. ఇప్పటికైనా అతడిని టీమ్ లో ఆడించాలని
సూచించాడు.
వరుసగా విమర్శలు ఎదుర్కుంటున్న సూర్యకు దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ మద్దతుగా నిలిచాడు. సూర్యతో సంజూను పోల్చొద్దని, ఎవరి టాలెంట్ వాళ్లదేని చెప్పాడు. మెరుగైన ప్రదర్శన చేసేవాళ్లకే టీమ్ మేనేజ్మెంట్ అవకాశాలను అందిస్తుందని, ఒకవేళ సంజూకు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైతే అప్పుడు ఎవరిని నిందించేవారని ప్రశ్నించాడు.
ఇదే విషయమై కపిల్ దేవ్ ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ... ‘జట్టులో మెరుగైన ప్రదర్శన చేసినవారికే టీమ్ మేనేజ్మెంట్ అవకాశాను అందిస్తుంది. సూర్యతో సంజూను పోల్చడం సరికాదు. ఒకవేళ సంజూ కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కుంటే అప్పుడు ఎవరిని నిందిస్తారు..? సంజూను కాదని మరోవాళ్లను తీసుకురండి అని మాట్లాడేవాళ్లే కదా. ఇది సరికాదు.
టీమ్ మేనేజ్మెంట్ సూర్యకు మద్దతుగా నిలవాలని భావిస్తే అతడికి వరుసగా అవాకాశాలు దక్కుతాయి. డ్రెస్సింగ్ రూమ్ బయట జనం ఏదైనా మాట్లాడతారు. కానీ తుది జట్టు ఎంపిక విషయంలో కెప్టెన్, హెడ్ కోచ్, టీమ్ మేనేజ్మెంట్ దే తుది నిర్ణయం. కావున సూర్య - సంజూల మధ్య పోలికలు పెట్టడం సరికాదు...’అని చెప్పాడు.
ఇక ఆస్ట్రేలియాతో తొలి రెండు వన్డేలలో నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన సూర్య.. మూడో వన్డేలో ఏడో స్థానంలో బ్యాటింగ్ రావడంపై కపిల్ స్పందించాడు. అతడు ఫినిషర్ పాత్ర పోషించాలని టీమ్ భావించినప్పుడు అలా చేయడంలో తప్పులేదని అన్నాడు. ఇదేం కొత్త కాదని, గతంలో చాలాసార్లు, చాలా మంది ఆటగాళ్లు జట్టు అవసరాల కోసం ఇలా చేశారని చెప్పుకొచ్చాడు.
కాగా ఈ విషయంలో రోహిత్ శర్మ కూడా మూడో వన్డే తర్వాత ఇదేవిషయాన్ని చెప్పిన విషయం తెలిసిందే. మ్యాచ్ చివరి 15 ఓవర్లలో సూర్యను బరిలోకి దింపితే అతడి మెరుపులతో భారత్ లక్ష్యాన్ని ఛేదిస్తుందని భావించామని, కానీ అతడు డకౌట్ అవడం తమను తీవ్రంగా నిరాశపరిచిందని రోహిత్ చెప్పాడు. తొలి రెండు వన్డేలలో మిచెల్ స్టార్క్ బౌలింగ్ లో డకౌట్ అయిన సూర్య.. మూడో వన్డేలో ఆస్టన్ అగర్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.