సీఎం, పీఎం కేర్లకి కాదు, ముందు వాళ్లకి ఇవ్వండి... క్రికెటర్ శ్రీశాంత్ పోస్ట్...
స్పాట్ ఫిక్సింగ్ కారణంగా ఏడేళ్ల పాటు నిషేధాన్ని ఎదుర్కొన్న వివాదాస్పద క్రికెటర్ శ్రీశాంత్... మళ్లీ క్రికెట్లో కమ్బ్యాక్ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నాడు. సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీలో సత్తా చాటినా, ఐపీఎల్ 2021 వేలం షార్ట్ లిస్టులో శ్రీశాంత్కి చోటు దక్కలేదు.
ఐపీఎల్ 2021 వేలంలో పాల్గొనే ప్లేయర్ల లిస్టులో చోటు దక్కకపోయినా ఏ మాత్రం నిరాశపడకుండా, మళ్లీ ప్రయత్నిస్తానని చెప్పిన 37 ఏళ్ల శ్రీశాంత్... రాజకీయాలతో పాటు సినిమాలు, టీవీ షోలలో పాల్గొన్న విషయం తెలిసిందే.
తాజాగా సోషల్ మీడియాలో ఓ సంచలన పోస్టు చేశాడు క్రికెటర్ శ్రీశాంత్... ‘ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి సహాయ నిధులకు విరాళం ఇచ్చేముందు... మీ చుట్టూ ఉన్నవాళ్ల పరిస్థితిని ఓ సారి గమనించండి...
మీ చుట్టాల్లో, మీకు తెలిసిన వాళ్లల్లో, మీ స్నేహితుల్లో లేదా పనివాళ్లల్లో ఎవ్వరైనా ఈ కష్టకాలంలో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉంటే, వారికి చేతనైన సాయం చేయండి... వారికి అండగా నిలవండి...
ఎందుకంటే మీ పక్కన ఉన్న వాళ్లను మీరు చేరుకోని, ఆదుకోగలరు. ఏ ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రి వల్ల అది అయ్యే పని కాదు’ అంటూ మంచి మెసేజ్తో పోస్టు చేశాడు శ్రీశాంత్...
2007 టీ20 వరల్డ్కప్తో పాటు 2011 వన్డే వరల్డ్కప్ గెలిచిన జట్టులో సభ్యుడైన శ్రీశాంత్, 2013లో స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొని జీవితకాల నిషేధానికి గురయ్యాడు. ఆ తర్వాత అతనిపై నిషేధాన్ని ఏడేళ్లకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది సుప్రీం...
ఏడేళ్ల బ్యాన్ పూర్తయిన తర్వాత 2021 జనవరిలో కేరళ జట్టు తరుపున సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 పాల్గొన్నాడు శ్రీశాంత్. మొదటి మ్యాచ్లోనే రెండు వికెట్లు తీసిన శ్రీశాంత్, కెరీర్ ఆరంభంలో కంటే ఇప్పుడే ఫిట్గా ఉన్నానని ప్రకటించాడు.