ఇప్పటికైనా ఇంకో రిజర్వు డే చేరిస్తే సరిపోతుందిగా... ఐసీసీకి మాజీ క్రికెటర్ల సూచన...
ఐసీసీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని, రెండేళ్ల పాటు నిర్వహించిన సుదీర్ఘమైన టోర్నీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కి క్రేజ్ అనుకున్నంత రావడం లేదు. దీనికి ఏకైక కారణం వాతావరణం...
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్కి వర్షం అంతరాయం కలిగించవచ్చని ఐసీసీ ముందుగానే భావించింది. ముందు జాగ్రత్తగా వర్షం కారణంగా అంతరాయం కలిగితే ఆ ఓవర్లను పూర్తిచేసేందుకు ఓ రిజర్వు డే కూడా కేటాయించింది.
అయితే ఇంగ్లాండ్ వాతావరణం, ఐసీసీకి కూడా దిమ్మతిరిగే షాక్ కలిగేలా చేసింది. మహా అయితే ఒక్కరోజు వర్షం కారణంగా రద్దు అవుతుందని భావించిన ఐసీసీకి, ఒకటికి రెండు రోజులు పూర్తిగా వాన కారణంగా రద్దు కాగా, రెండో రోజు బ్యాడ్ లైట్ కారణంగా ఓ సెషన్ మొత్తం ఆటకి అంతరాయం కలిగింది.
ఐదో రోజు ఎలాంటి అంతరాయం ఉండదని అంచనా వేసినా, మ్యాచ్ ప్రారంభమయ్యే సమయంలో పలకరించిన వర్షం, ఆ రోజు ఆటను ఓ గంట ఆలస్యం చేసింది...
ఆరు రోజుల్లో రిజల్ట్ రావచ్చని ఐసీసీ అంచనా వేస్తే... అందులో రెండున్నర రోజులకు పైగా వర్షం, వాతావరణం వల్ల రద్దు చేయాల్సి వచ్చింది. ఇక మిగిలిన మూడున్నర రోజుల్లో ఫలితం తేలడం అనుమానంగానే మారింది.
నిజానికి భారత జట్టు, స్వదేశంలో న్యూజిలాండ్తో ఫైనల్ ఆడినా... న్యూజిలాండ్లో కివీస్తో ఫైనల్ మ్యాచ్ ఆడి ఉన్నా... ఫలితం తేలేందుకు మూడున్నర రోజుల సమయం సరిపోయేది. కానీ తటస్థ వేదిక కావడంతో ఇరుజట్లు పోటాపోటీగా తలబడుతున్నాయి.
టీమిండియా, న్యూజిలాండ్ వంటి టాప్ టీమ్లు స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వడానికి శాయశక్తుల కృషి చేస్తున్నాయి. దీంతో ఇప్పుడు విమర్శలన్నీ ఐసీసీ వైపే మళ్లుతున్నాయి...
నేడు ఫైనల్ మ్యాచ్లో ఆఖరి రోజు. రిజర్వు డేలో ఫలితం తేలకపోతే రెండేళ్ల సుదీర్ఘ టోర్నీకి సరైన ఫినిషింగ్ ఇవ్వనట్టే అవుతుంది...
అందుకే ఐసీసీ, ఇప్పటికైనా వేగంగా స్పందించి ఫలితం తేలేందుకు ఇంకో రోజును రిజర్వు డేగా కేటాయిస్తే బాగుంటుందని చెబుతున్నారు క్రికెట్ విశ్లేషకులు...
నేడు 98 ఓవర్ల పాటు ఆట సాగినా, ఫలితం తేలేందుకు ఇంకో 70 నుంచి 80 ఓవర్ల ఆట అవసరం అవుతుందని క్రికెట్ విశ్లేషకులు అంచనా. దాన్ని ఐసీసీ ఏర్పాటుచేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఐసీసీ నుంచి మాత్రం ఎలాంటి స్పందన లేదు.