టెస్టు ఛాంపియన్షిప్పై కరోనా ఎఫెక్ట్... రూల్స్ మార్చబోతున్న ఐసీసీ...
గత ఏడాది అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని టెస్టు ఛాంపియన్షిప్ను మొదలెట్టింది ఐసీసీ. టెస్టుల్లో వరుస విజయాలు సాధించి, ఎవ్వరికీ అందనంత ఎత్తులోకి దూసుకెళ్లింది భారత జట్టు. టీమిండియా టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కి అర్హత సాధించడం పక్కా అనుకుంటున్న సమయంలో సీన్ మారిపోయింది.
కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా జరగాల్సిన టెస్టు, వన్డే, టీ20 సిరీస్లకు ఆరు నెలల పాటు బ్రేక్ పడింది. నిజానికి ఈ ఏడాది నిర్వహించాల్సిన టీ20 వరల్డ్కప్ కూడా వచ్చే ఏడాదికి వాయిదా పడిన సంగతి తెలిసిందే.
కరోనా కారణంగా రద్దైన సిరీస్లు, టెస్టు ఛాంపియన్షిప్పై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. మొదట రద్దయిన మ్యాచులను పరిగణనలోకి తీసుకుని ఇరు జట్లకి చెరో పాయింట్ ఇవ్వాలని భావించింది ఐసీసీ.
అయితే ఇలా చేస్తే కొన్ని జట్లకి బెనిఫిట్ అయ్యే అవకాశం ఉండడంతో ఆ ఆలోచనను విరమించుకున్న అంతర్జాతీయ క్రికెట్ మండలి, విజయాల శాతాన్ని లెక్కలోకి తీసుకోవాలని చూస్తోందట.
అంటే ఆడిన టెస్టు మ్యాచుల్లో గెలిచిన మ్యాచులు ఫైనల్ చేరబోయే జట్లను నిర్ణయించబోతున్నాయి. టెస్టు ఛాంపియన్షిప్లో టెస్టు ర్యాంకింగ్లో ఉన్న టాప్ 9 జట్లు ఆరు సిరీస్లు ఆడాల్సి ఉంటుంది...
ప్రతీ సిరీస్కు 120 పాయింట్లు కేటాయిస్తారు. ఆసీస్ టూర్లో భారత జట్టు నాలుగు టెస్టులు ఆడబోతోంది. అంటే ఒక్కో మ్యాచ్కి 30 పాయింట్లు వస్తాయి. నాలుగు టెస్టులు గెలిస్తే భారత్ ఖాతాలో 120 పాయింట్లు చేరతాయి.
ఇలా వచ్చే ఏడాది ఏప్రిల్ నెల ముగిసే సమయానికి ఏ జట్లు అయితే టాప్ 2లో నిలుస్తాయో... వాటి మధ్య లార్డ్స్ మైదానంలో ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. గెలిచిన జట్టు మొట్టమొదటి టెస్టు ఛాంపియన్షిప్ను గెలుచుకుంటుంది.
ప్రస్తుతం వరుస విజయాలు అందుకుంటూ ఐసీసీ ర్యాంకింగ్లో టాప్కి దూసుకెళ్లిన ఆస్ట్రేలియా... 296 పాయింట్లతో ఉంది. విజయాల శాతం 82.22. భారత్ ఖాతాలో 360 పాయింట్లు ఉన్నప్పటికీ విజయాల శాతం మాత్రం 75 శాతం మాత్రమే.
మూడో స్థానంలో ఉన్న ఇంగ్లాండ్ ఖాతాలో 292 పాయింట్లు ఉన్నాయి. విజయాల శాతం 60.83... న్యూజిలాండ్ 50 శాతం, పాకిస్థాన్ 39.52 శాతం విజయాలను అందుకున్నాయి...
అయితే ఇకపై జరగబోయే టెస్టు సిరీస్లు ప్రతీ జట్టుకీ కీలకం కాబోతున్నాయి... 360 పాయింట్లతో ఉన్నా, విజయాల శాతం తక్కువగా ఉండడంతో రెండో స్థానంలో ఉన్న టీమిండియా, మళ్లీ టాప్లోకి వెళ్లాలంటే వచ్చే నెలలో జరగబోయే ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ తప్పక నెగ్గాల్సిందే.
ఈ నాలుగు టెస్టుల్లో రెండు టెస్టులు గెలిచినా ఆస్ట్రేలియా టాప్ ప్లేస్లో తన స్థానాన్ని మరింత పదిలం చేసుకుంటుంది... భారత్ టాప్ అవకాశాలు మరింత దిగజారతాయి.
ఆస్ట్రేలియా సిరీస్ ముగిసిన తర్వాత ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్ ఆడబోతోంది టీమిండియా. ఈ రెండు సిరీస్లు గెలిస్తే విజయాలు శాతం, పాయింట్లు కూడా ఎక్కువగా ఉండడంతో టీమిండియా ఫైనల్ ప్లేస్ ఖరారు చేసుకుంటుంది. ఓడితే మాత్రం ఫైనల్ చేరడం డౌటే.
ఇప్పటికైతే టెస్టు సిరీస్ ఫైనల్ కోసం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, టీమిండియా మధ్య తీవ్రమైన పోటీ నెలకొని ఉంది. న్యూజిలాండ్ స్వదేశంలో పాక్, విండీస్ వంటి వీక్ జట్లపై సిరీస్లు ఆడబోతోంది. ఇవి గెలిస్తే కివీస్కి అవకాశాలు మెరుగవుతాయి.