కోచ్లకు రెస్ట్ ఎందుకో అర్థం కావడం లేదు.. ద్రావిడ్ పై జడేజా షాకింగ్ కామెంట్స్
గతంలో ఒక్క ద్రావిడ్ కు మాత్రమే రెస్ట్ ఇచ్చిన బీసీసీఐ.. టీ20 ప్రపంచకప్ తర్వాత ఏకంగా కోచింగ్ సిబ్బంది మొత్తానికి బ్రేక్ ఇచ్చింది. బౌలింగ్ కోచ్ పరాస్ మంబ్రే, ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ లు కూడా సెలవులోనే ఉన్నారు.
టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత టీమిండియా ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, అశ్విన్ లతో పాటు జట్టు మేనేజ్మెంట్ హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ తో పాటు కోచింగ్ సిబ్బందికి కూడా రెస్ట్ ఇచ్చింది.
ద్రావిడ్ గతంలో వెస్టిండీస్, జింబాబ్వే సిరీస్ లకు కూడా విశ్రాంతి తీసుకున్నాడు. ఆటగాళ్లతో సమానంగా ద్రావిడ్ కు కూడా వర్క్ లోడ్ మేనేజ్మెంట్ లో భాగంగా టీమ్ మేనేజ్మెంట్.. అతడికి రెస్ట్ ఇచ్చి ఎన్సీఏ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ కు ఆ బాధ్యతలు అప్పజెప్పుతున్నది.
అయితే గతంలో ఒక్క ద్రావిడ్ కు మాత్రమే రెస్ట్ ఇచ్చిన బీసీసీఐ.. టీ20 ప్రపంచకప్ తర్వాత ఏకంగా కోచింగ్ సిబ్బంది మొత్తానికి బ్రేక్ ఇచ్చింది. బౌలింగ్ కోచ్ పరాస్ మంబ్రే, ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ లు కూడా సెలవులోనే ఉండటంతో ఎన్సీఏ టీమ్ హృషికేశ్ కనిత్కర్ (బ్యాటింగ్), సాయిరాజ్ బహుతులే (బౌలింగ్) లతో కలిసి వీవీఎస్ లక్ష్మణ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.
కోచ్ లకు విరామమివ్వడంపై టీమిండియా మాజీ సారథి అజయ్ జడేజా ఆగ్రహం వ్యక్తం చేశాడు. అసలు కోచ్ లకు రెస్ట్ ఇవ్వడం ఏంటో అర్థం కావడం లేదని అన్నాడు. ఆటగాళ్లతో సమానంగా కోచ్ లకు విరామమివ్వడంపై జడేజా తనదైన శైలిలో స్పందించారు.
విక్రమ్ రాథోడ్ తో నాకు ఎప్పట్నుంచో పరిచయం ఉంది. భారత క్రికెట్ కు ద్రావిడ్ చాలా సేవ చేశాడు. నాకు అతడిపై గౌరవముంది. కానీ హెడ్ కోచ్ అన్నాక నిత్యం ఆటగాళ్లతో ఉండాలి. మెరుగైన జట్టును తీర్చిదిద్దడానికి ప్లేయర్స్ తో మమేకమవ్వాలి. అలా అయితేనే జట్టులో అందరితో సమన్వయం మెరుగ్గా ఉంటుంది..’ అని తెలిపాడు.
కాగా ద్రావిడ్ కు రెస్ట్ ఇవ్వడంపై గతంలో టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి కూడా ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం గమనార్హం. కానీ టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మాత్రం కోచ్ లు కూడా ఆటగాళ్లలాగే మనుషులేనని, వారు కూడా మానసికంగా చాలా ఒత్తిడికి లోనవుతారని, వాళ్లకు రెస్ట్ ఇవ్వడంలో తప్పులేదని వ్యాఖ్యానించాడు.