ఐసీసీ టోర్నీలలో విఫలమైతే ఆటగాళ్లను తిట్టండి.. ఐపీఎల్ ఏం పాపం చేసింది..? విమర్శకులకు గంభీర్ స్ట్రాంగ్ కౌంటర్
Gautam Gambhir: ఐసీసీ టోర్నీలలో భారత జట్టు విఫలమైన ప్రతీసారి సగటు క్రికెట్ అభిమానితో పాటు ఆట పట్ల విశేష అవగాహన ఉన్న విశ్లేషకుల వేళ్లన్నీ ఐపీఎల్ మీదకే వెళ్తాయి. ఈ లీగ్ భారత క్రికెట్ ను నాశనం చేస్తుందని విమర్శలు వెళ్లువెత్తుతాయి.
నాలుగేండ్లకోసారి జరిగే ఐసీసీ వన్డే ప్రపంచకప్ తో పాటు రెండేండ్లకోమారు నిర్వహించే టీ20 వరల్డ్ కప్ లలో భారత జట్టు ఓడినప్పుడల్లా క్రికెట్ ఫ్యాన్స్ తో పాటు విశ్లేషకులు ఇండియన్ ప్రీమియర్ లీగ్ మీద దుమ్మెత్తిపోస్తారు. ఈ లీగ్ వల్లే టీమిండియా ఆటగాళ్లు ఆటను మరిచిపోతున్నారని, ఐపీఎల్ ఇండియన్ క్రికెట్ ను నాశనం చేస్తుందని వాపోతారు.
ఇటీవలే ఆస్ట్రేలియా వేదికగా ముగిసిన టీ20 ప్రపంచకప్ లో భారత జట్టు సెమీస్ లో ఓడిన విషయం తెలిసిందే. సెమీస్ ఓటమ తర్వాత పాకిస్తాన్ దిగ్గజం వసీం అక్రమ్.. ‘ఐపీఎల్ వల్ల ఇండియన్ క్రికెట్ మంచి జరుగుతుందని చెప్పారు. అది స్టార్ట్ చేశాక ఇండియా ఎన్ని ఐసీసీ ట్రోఫీలు నెగ్గింది..? వాస్తవానికి ఐపీఎల్ మొదలయ్యాక ఇండియా ఆట నానాటికీ దిగజారిపోయింది..’ అని కామెంట్స్ చేశాడు.
Image credit: PTI
ఇదే విషయమై సునీల్ గవాస్కర్ కూడా.. ఐపీఎల్ వల్ల క్రికెటర్లు జాతీయ జట్టుకు ఆడటాన్ని కూడా పక్కనబెడుతున్నారని వ్యాఖ్యానించిన విషయం తెలసిందే. వీళ్లిద్దరే గాక చాలామంది క్రికెట్ పండితులు కూడా ఐపీఎల్ ను విలన్ గా చేశారు. తాజాగా ఐపీఎల్ మీద విమర్శలు చేసేవారందరికీ టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు.
ఫిక్కీ నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరైన గంభీర్ మాట్లాడుతూ.. ‘భారత క్రికెట్ కు ఐపీఎల్ మంచే చేసింది. నా అభిప్రాయం ప్రకారం మన క్రికెట్ లో ఇదో పెద్ద పురోగతి చర్య. అయితే ఈ లీగ్ స్టార్ట్ అయినప్పట్నుంచే దీని మీద విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అది సరైంది కాదు. మన (టీమిండియా) ఆటగాళ్లు ఐసీసీ టోర్నీలలో ఫెయిల్ అవుతున్నారంటే ఆటగాళ్లను తిట్టండి. వాళ్ల ప్రదర్శనలపై విమర్శ చేయండి గానీ ఐపీఎల్ ను తిట్టడంలో అర్థం లేదు.
సాధారణంగా ఏదైనా ఒక ఆటలో క్రీడాకారుడి కెరీర్ దాదాపు 35 - 36 ఏండ్లకు ముగుస్తుంది. అప్పటివరకే అతడు సంపాదించగలడు. క్రికెట్ కూడా అందుకు అతీతమేమీ కాదు. ఈ లీగ్ వల్ల రిటైరైన చాలా మంది క్రికెటర్లకు ఆర్థిక సాయం అందుతున్నది. ఎంతో మంది యువ ఆటగాళ్లకు ఐపీఎల్ ఒక మంచి వేదిక అవుతున్నది..
దేశవాళీలో ఏండ్లకేండ్లు ఆడినా రాని గుర్తింపు ఒక్క లీగ్ లో మెరవడం వల్ల వస్తుంది. కనీసం ఇంట్లో టీవీ కూడా లేని ఆటగాళ్లు ఇప్పుడు ఆర్థికంగా ఎక్కడ ఉన్నారో చూడండి.. ఐపీఎల్ ద్వారా కొత్త టాలెంట్ ఎప్పటికప్పుడు వెలుగులోకి వస్తూనే ఉంది. అటువంటి లీగ్ ను విమర్శించడం తగదు..’ అని హితువు పలికాడు.