సీఎస్కేలో ఒక్క తమిళ ఆటగాడైనా ఉన్నాడా..? బీజేపీ వల్లే చెన్నైకి ఐపీఎల్ ట్రోఫీ : తమిళనాడు బీజేపీ చీఫ్
IPL 2023: ఇటవలే ముగిసిన ఐపీఎల్-16 టైటిల్ ను చెన్నై సూపర్ కింగ్స్ గెలుచుకున్న విషయం తెలిసిందే. ఫైనల్ లో ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను ఓడించింది.
ఐపీఎల్-16 లో చెన్నై సూపర్ కింగ్స్ విజయానికి భారతీయ జనతా పార్టీయే కారణమంటున్నారు తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె. అన్నామలై. బీజేపీ కార్యకర్త వల్లే చెన్నై.. ఐపీఎల్ లో ఐదో ట్రోఫీ గెలిచిందని.. పేరుకు తమిళ టీమ్ అయినా ఒక్క తమిళ ఆటగాడైనా జట్టులో ఉన్నాడా..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సీజన్ లో చెన్నై విజేతగా నిలిచిన తర్వాత తమిళనాడు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీఆర్బీ రాజా మాట్లాడుతూ.. దీనిని గుజరాత్ మోడల్ పై ద్రావిడియన్ మోడల్ విక్టరీగా అభివర్ణించారు. ఈ వ్యాఖ్యలపై అన్నామలై మండిపడ్డారు.
ఓ టీవీ చర్చలో పాల్గొన్న అన్నామలై మాట్లాడుతూ.. ‘రాజా మాట్లాడిన మాటలు ఆయన మూర్ఖత్వానికి నిదర్శనం. పేరుకు చెన్నై టీమ్ అయినా జట్టులో ఒక్క తమిళ ప్లేయర్ అయినా ఉన్నాడా..? కానీ గుజరాత్ టైటాన్స్ టీమ్ లో ఏకంగా ముగ్గురు తమిళ ప్లేయర్లు ఉన్నారు.
Image credit: PTI
ఇక ఫైనల్ మ్యాచ్ లో చెన్నైకి లాస్ట్ టూ బాల్స్ లో 6, 4 కొట్టి విజయాన్నిఅందించిన రవీంద్ర జడేజాదీ గుజరాతే. జడేజా బీజేపీ కార్యకర్త. ఆయన భార్య రివాబా జడేజా బీజేపీ ఎమ్మెల్యే. ఆమె విజయం కోసం జడేజా కష్టపడ్డాడు..’ అని అన్నారు.
Image credit: PTI
కాగా గుజరాత్ - చెన్నై మధ్య అహ్మదాబాద్ లో జరిగిన ఫైనల్ లో మొదలు బ్యాటింగ్ చేసిన గుజరాత్... నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 214 పరుగులు చేసింది. ఆ జట్టు తరఫున సాయిసుదర్శన్ (ఇతడిది తమిళనాడే) 47 బంతుల్లోనే 96 పరుగులు చేశాడు. వర్షం కారణంగా చెన్నై విజయాన్ని 15 ఒవర్లలో 171కు కుదించారు.
కాన్వే, రుతురాజ్, రహానే, రాయుడు, దూబేల జోరుతో సీఎస్కే విజయానికి దగ్గరగా వచ్చింది. ఆఖరి ఓవర్లో 13 పరుగులు అవసరం కాగా తొలి 4 బంతుల్లో 3 పరుగులే వచ్చాయి. అయితే మోహిత్ శర్మ వేసిన చివరి రెండు బంతుల్లో జడేజా 6, 4 కొట్టి చెన్నైకి మధురమైన విజయాన్ని అందించాడు. దీంతో సీఎస్కే ఐపీఎల్ లో ఐదో ట్రోఫీని అందుకుంది.