- Home
- Sports
- Cricket
- Sourav Ganguly: అలా కాకుంటే బయో బబుల్ లేకుండానే ఐపీఎల్ నిర్వహిస్తాం.. దాదా ఆసక్తికర వ్యాఖ్యలు
Sourav Ganguly: అలా కాకుంటే బయో బబుల్ లేకుండానే ఐపీఎల్ నిర్వహిస్తాం.. దాదా ఆసక్తికర వ్యాఖ్యలు
TATA IPL 2022: కరోనా కారణంగా గడిచిన రెండున్నరేండ్లుగా బయో బబుల్ లో జరుగుతున్న క్రికెట్ మ్యాచులు.. ఇకపై సాధారణంగా గతంలో మాదిరిగానే నిర్వహించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

కరోనా పుణ్యమా అని తీవ్ర ఆంక్షల నడుమ సాగుతున్న ఐపీఎల్.. రెండు నెలల పాటు క్రికెటర్లు కఠిన నిబంధనల సాగుతున్నది. ఐపీఎల్ మాత్రమే గాక అంతర్జాతీయ సిరీస్ లు కూడా ఇదే విధంగా సాగుతున్నాయి.
అయితే కొద్దిరోజులుగా కరోనా వ్యాప్తి నెమ్మదిగా కనుమరుగవుతున్నది. ఒకవేళ ఉన్నా ఎక్కడో కొద్దిచోటే దాని ప్రభావం కనబడుతున్నది. ఈ నేపథ్యంలో ఇక బయో బబుల్స్ కు స్వస్తి చెప్పాలనే డిమాండ్ అన్ని దేశాల క్రికెట్ బోర్డుల నుంచి వినిపిస్తున్నది. బీసీసీఐ కూడా దేశవాళీ క్రికెట్లో బబుల్ లేకుండానే మ్యాచ్ లను నిర్వహించాలని చూస్తున్నది.
ఈ నేపథ్యంలో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కూడా బయో బబుల్ నిర్వహణ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాము కూడా ఈ విధానానికి స్వస్తి పలకాలని చూస్తున్నట్టు తెలిపాడు.
ఓ జాతీయ ఛానెల్ తో గంగూలీ మాట్లాడుతూ.. ‘దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య పెరగకుంటే బయో బబుల్స్ అవసరం లేదు. ఐపీఎల్ ను కూడా గతంలో మాదిరిగానే సాధారణ వాతావరణంలో నిర్వహించవచ్చు.
అయితే దీనిమీద ఇప్పుడే నిర్ణయం తీసుకోలేం. ప్రస్తుతానికి మేము వేచి చూసే ధోరణిలో ఉన్నాం. కరోనా ఇప్పుడప్పుడే మానవ జీవితాల్లోంచి వెళ్లే పరిస్థితులు లేవని నిపుణులు చెబుతున్నారు. మరో పదేండ్ల పాటు దాంతో పాటే కలిసి జీవించాలి..’ అని చెప్పాడు.
ఇప్పటికే రంజీలతో పాటు ఇతర దేశవాళీ మ్యాచులకు బబుల్ నిబంధనలను ఎత్తేసిన బీసీసీఐ.. తాజాగా దక్షిణాఫ్రికాతో జూన్ లో జరుగనున్న ఐదు మ్యాచుల టీ20 సిరీస్ ను కూడా బబుల్ లేకుండానే జరిపించాలని నిర్ణయించినట్టు వార్తలు వస్తున్నాయి.
ఇక 2020లో ఐపీఎల్ ను దుబాయ్ లో పూర్తి బయో బబుల్ ఆంక్షలతో స్టేడియాల్లోకి ప్రేక్షకులు రాకుండా నిర్వహించిన బీసీసీఐ.. 2021 లో సగం సీజన్ ను విజయవంతంగానే నిర్వహించినా పలు జట్లలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో దానిని వాయిదా వేసి రెండో దశను మళ్లీ సెప్టెంబర్ లో దుబాయ్ లో నిర్వహించిన విషయం తెలిసిందే.
తాజా సీజన్ లో కొత్తగా రెండు జట్లు చేరడంతో ఐపీఎల్ లో మ్యాచుల సంఖ్య 74 (లీగ్ మ్యాచులు 70. నాలుగు నాకౌట్) కు పెరిగింది. మహారాష్ట్రలోని నాలుగు వేదికలలో ప్రస్తుత సీజన్ విజయవంతంగా సాగుతున్నది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో పలు కరోనా కేసులు నమోదైనా అవి లీగ్ ను పెద్దగా ప్రభావం చేయలేదు. మే 29న ఈ సీజన్ ముగుస్తుంది.