పార్టీ చేసుకున్న ఆ ఐదుగురికి కరోనా నెగిటివ్... టీమిండియాతో కలిసి ఒకే ఫ్లైట్లో...
న్యూ ఇయర్ పార్టీ పేరుతో రెస్టారెంట్లో డిన్నర్ చేసిన ఐదుగురు క్రికెటర్లకి కరోనా టెస్టులు నిర్వహించగా నెగిటివ్ రిపోర్టు వచ్చింది. రోహిత్ శర్మతో పాటు రిషబ్ పంత్, పృథ్వీషా, శుబ్మన్ గిల్, నవ్దీప్ సైనీ డిన్నర్కి వెళ్లారు. ఈ క్రికెటర్ల బిల్ చెల్లించిన ఓ అభిమాని, ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేయడం పెద్ద దుమారం రేగింది.
భారత క్రికెటర్లు కరోనా ప్రొటోకాల్ నిబందనలకు విరుద్ధంగా నడుచుకున్నారంటూ ఆసీస్ మీడియా పెద్ద ఎత్తున కథనాలు ప్రచారం చేసింది.
దీంతో బీసీసీఐ, క్రికెట్ ఆస్ట్రేలియా విషయం తేల్చేందుకు దర్యాప్తుకి ఆదేశించాయి.
తాజాగా నిర్వహించిన పరీక్షల్లో ఆటగాళ్లకు కరోనా నెగిటివ్ రావడంతో బీసీసీఐ ఊపిరి పీల్చుకుంది.
మూడో టెస్టు జరుగుతున్న సిడ్నీలో కరోనా కేసులు ఎక్కువగా ఉండడంతో ఇన్ని రోజులు మెల్బోర్న్ క్రికెట్ స్టేడియంలోనే ప్రాక్టీస్ చేసింది టీమిండియా...
ఆస్ట్రేలియా జట్టు కూడా మెల్బోర్న్లోనే గడిపింది... మ్యాచ్కి మూడు రోజుల ముందు ఇరు జట్లు సిడ్నీ బయలుదేరి వెళ్లాయి.
సోమవారం జనవరి 4న ప్రత్యేక ఛార్టెడ్ విమానంలో ఇరు జట్ల ఆటగాళ్లు సిడ్నీ చేరనున్నాయి. ఐసోలేషన్లో ఉన్న ఐదుగురు క్రికెటర్లు కూడా భారత జట్టుతో కలిసి సిడ్నీ వెళతారు.
కరోనా నిబంధనల ప్రకారం బయో బబుల్ జోన్లో ఉన్న సదరు రెస్టారెంట్కి వెళ్లేందుకు భారత క్రికెటర్లకు అనుమతి ఉందని విచారణలో తేలింది...
బిల్ కట్టిన నవల్దీప్ సింగ్... మొదట భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ను హగ్ చేసుకున్నానని రాసుకొచ్చాడు. ఇదే ఇంత రచ్చ లేవడానికి కారణమైంది...
తనపై బీభత్సమైన ట్రోలింగ్ రావడంతో హగ్ చేసుకోలేదని, వారిని చూసిన ఆనందంలో అలా రాసుకొచ్చానని మరోసారి పోస్టు చేశాడు నవల్దీప్... తప్పుని మన్నించాల్సిందిగా బీసీసీఐ, క్రికెట్ ఆస్ట్రేలియాలను కోరాడు.
మెల్బోర్న్లో ఆదివారం రోజు వర్షం కురవడంతో భారత జట్టు ప్రాక్టీస్ సెషన్కి దూరంగా ఉండాల్సి వచ్చింది..
మూడో టెస్టు జరగబోతున్న సిడ్నీలో కూడా మొదటి మూడు రోజుల పాటు వర్షం కురిసే అవకాశం ఉందని తెలియచేసింది వాతావరణ శాఖ...