బెన్ స్టోక్స్ సంచలన నిర్ణయం... ఇంగ్లాండ్, ఇండియా టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు...
ఇంగ్లాండ్ స్టార్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. కరోనా కష్టకాలంలో బయో బబుల్ జీవితం గడపలేకుండా క్రికెట్ నుంచి నిరవధిక విరామం తీసుకుంటున్నట్టు ప్రకటించాడు... క్రికెట్ ఫ్యాన్స్ని నిరాశపరిచినా, ఈ నిర్ణయం టీమిండియాకి కలిసొచ్చే అవకాశం ఉంది...
ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ తరుపున ఆడే బెన్ స్టోక్స్, ఐపీఎల్ 2021 సీజన్లో ఆడిన మొదటి మ్యాచ్లోనే గాయపడి... సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. చేతికి శస్త్రచికిత్స తర్వాత కొన్ని నెలల పాటు క్రికెట్కి దూరమయ్యాడు...
న్యూజిలాండ్తో జరిగిన టెస్టు సిరీస్, ఆ తర్వాత శ్రీలంకతో జరిగిన సిరీస్కి దూరంగా ఉన్నాడు బెన్ స్టోక్స్. అయితే పాకిస్తాన్తో వన్డే సిరీస్ ఆరంభానికి ముందు ఇంగ్లాండ్ జట్టు కరోనా బారిన పడడంతో బెన్ స్టోక్స్ రీఎంట్రీ ఇచ్చాడు.
పాకిస్తాన్తో జరిగిన వన్డే సిరీస్కి కెప్టెన్గా వ్యవహరించి, 3-0 తేడాతో సిరీస్ను క్లీన్స్వీప్ చేశాడు. ఆ తర్వాత టీ20 సిరీస్కి దూరంగా ఉన్న బెన్ స్టోక్స్, మెంటల్ హెల్త్ కోసం క్రికెట్ నుంచి నిరవధిక విరామం తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు...
‘టీమిండియాతో జరిగే టెస్టు సిరీస్కి దూరంగా ఉండాలని బెన్ స్టోక్స్ నిర్ణయం తీసుకున్నాడు. అతను మానసికంగా ఆరోగ్యం ఉండేందుకు అలాగే ఎడమ చేతి వేలికి అయిన గాయం తగ్గడానికి సమయం ఇవ్వడానికి స్టోక్స్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. అతని వేలికి అయిన గాయం పూర్తిగా మానలేదు...’ అంటూ కామెంట్ చేసింది ఇంగ్లాండ్ బోర్డు.
ఇంగ్లాండ్, ఇండియా మధ్య టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు బెన్ స్టోక్స్ అర్ధాంతరంగా తప్పుకోవడంతో అతని స్థానంలో క్రేగ్ ఓవర్టన్ను రిప్లేస్మెంట్గా ఎంపిక చేసింది ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు...
‘బెన్ స్టోక్స్ ఎంతో ధైర్యంగా ముందుకొచ్చి మెంటల్ ప్రెషర్ ఎదుర్కొంటున్నట్టు తెలిపాడు. ఆ నిర్ణయాన్ని మేం గౌరవిస్తున్నాం. మా క్రికెటర్లు అందరూ మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవడం మా ప్రధాన బాధ్యత... కరోనా విపత్తు సమయంలో అథ్లెట్లు తీవ్రమైన మానసిక ఒత్తిడి ఎదుర్కొంటున్నారు...’ అంటూ తెలిపాడు ఇంగ్లాండ్ మెన్స్ క్రికెట్ మేనేజింగ్ డైరెక్టర్ అష్లే గిల్స్...
స్టార్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్, టెస్టు సిరీస్లో బరిలో దిగకపోవడం భారత జట్టుకి కలిసొచ్చే విషయమే. ఇండియాలో జరిగిన టెస్టు సిరీస్లో బెన్ స్టోక్స్ ఆల్రౌండ్ షోతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే.
ఆగస్టు 4 నుంచి ప్రారంభమయ్యే టెస్టు సిరీస్లో ఐదు టెస్టులు ఆడబోతున్నాయి ఇండియా, ఇంగ్లాండ్ జట్లు. ఈ రెండు జట్లకీ ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2021-23 సీజన్లో ఇదే తొలి టెస్టు సిరీస్...