సన్రైజర్స్ ఓటమికి అతనే కారణం... అనుభవం ఉన్నా... వీరేంద్ర సెహ్వాగ్ కామెంట్స్...
ఐపీఎల్ 2021 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ ఆడిన మొదటి మ్యాచ్లో, కేకేఆర్ చేతిలో 10 పరుగుల తేడాతో ఓడిన విషయం తెలిసిందే. 188 పరుగుల టార్గెట్తో బరిలో దిగిన ఎస్ఆర్హెచ్, 177 పరుగుల దగ్గర ఆగిపోయింది... దీనికి ప్రధాన కారణం మనీశ్ పాండే నెమ్మదిగా ఆడడమే అంటున్నాడు మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్...
10 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన సన్రైజర్స్ హైదరాబాద్ను మనీశ్ పాండే, జానీ బెయిర్స్టో కలిసి ఆదుకున్నారు. మూడో వికెట్కి ఈ ఇద్దరూ 92 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పారు...
అయితే బెయిర్ స్టో అవుటైన తర్వాత విజయం దిశగా సాగుతున్నట్టు కనిపించలేదు సన్రైజర్స్ హైదరాబాద్. మహ్మద్ నబీ 11 బంతుల్లో 14, విజయ్ శంకర్ 7 బంతుల్లో 11 పరుగులు చేసి అవుట్ అయ్యారు...
ప్యాట్ కమ్మిన్స్ వేసిన 19వ ఓవర్లో రెండు సిక్సర్లు బాదిన అబ్దుల్ సమద్, విజయంపై ఆశలు రేపాడు. అయితే ఆఖరి ఓవర్లో విజయానికి 22 పరుగులు కావాల్సిన దశలో షకీబ్ అల్ హసన్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు...
సన్రైజర్స్ హైదరాబాద్ ఓటమి ఖరారైన తర్వాత ఆఖరి బంతికి సిక్సర్ బాదాడు మనీశ్ పాండే... అయితే అప్పటికి ఎస్ఆర్హెచ్ ఓడిపోవడంతో ఫలితం లేకపోయింది.
‘మనీశ్ పాండే చాలా సీనియర్ ప్లేయర్. రెండో ఓవర్లో క్రీజులోకి వచ్చిన మనీశ్ పాండే, ఆఖరి దాకా క్రీజులో ఉన్నాడు. అయినా మ్యాచ్ను గెలిపించలేకపోయాడు...
ఓటమి ఖరారైన తర్వాత సిక్సర్ కొట్టి ఏం లాభం... క్రీజులో కుదురుకున్న తర్వాత ఒత్తిడితో ఆడాల్సిన అవసరం లేదు. ఆఖరి 12 బంతుల్లో సింగిల్స్, డబుల్స్ తీయకుండా బౌండరీలు కొట్టి ఉంటే, సన్రైజర్స్కి విజయం దక్కి ఉండేది...
భారీ షాట్కి ప్రయత్నించి అవుటైనా పోయేదేం లేదు. బౌండరీలు, సిక్సర్లు కావాల్సినప్పుడు సింగిల్స్, డబుల్స్ తీయడం వల్ల ఏం లాభం...’ అంటూ కామెంట్ చేశాడు వీరేంద్ర సెహ్వాగ్.
అబ్దుల్ సమద్ బ్యాటింగ్ ఆర్డర్లో ఇంకాస్త ముందుకు వచ్చినా, మనీశ్ పాండే మరింత వేగంగా బౌండరీలు బాదినా సన్రైజర్స్ హైదరాబాద్కి దక్కి ఉండేదని అంటున్నారు సన్రైజర్స్ హైదరాబాద్ అభిమానులు...