ఏడాది దాటింది, అయినా ఆ డబ్బులు ఇంకా ఇవ్వలేదట... మహిళా క్రికెటర్ల పట్ల బీసీసీఐ వైఖరికి...
భారత క్రికెట్ బోర్డు, మహిళా క్రికెటర్లపై ఎంత వివక్ష చూపిస్తున్నదీ ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. భారత పురుష క్రికెటర్లకు చెల్లించే వేతనంలో 10 శాతం కూడా మహిళా క్రికెటర్లకు ఇవ్వని బీసీసీఐ, అనేక విషయాల్లో వారికీ, వీరికీ మధ్య తీవ్రమైన వ్యత్యాసం చూపిస్తోందని టాక్ వినబడుతోంది.
ఇంగ్లాండ్ టూర్కి వెళ్లే పురుష క్రికెటర్లకు స్వయంగా కరోనా పరీక్షలు చేస్తున్న బీసీసీఐ, మహిళా క్రికెటర్లను మాత్రం ఎవరికి వారే వెళ్లి కరోనా టెస్టులు చేసుకుని, రిపోర్టు సమర్పించాల్సిందిగా కోరింది.
అయితే ఈ విషయం బయటికి రావడంతో బీసీసీఐ మహిళా క్రికెటర్ల విషయంలో ఎలాంటి వివక్ష చూపించడం లేదని, మాకు కూడా చార్టెట్ ఫ్లైట్ ఏర్పాటు చేసిందని హర్మన్ప్రీత్ కౌర్, మిథాలీరాజ్ వంటి క్రికెటర్లతో ట్వీట్లు వేయించింది బీసీసీఐ.
తాజాగా మహిళా క్రికెటర్ల పట్ల వివక్ష చూపిస్తున్నారనేదానికి నిదర్శనంగా బీసీసీఐ చేసిన మరో పని బయటికి వచ్చింది. 2020లో ఆస్ట్రేలియాలో జరిగిన ఐసీసీ టీ20 వరల్డ్కప్లో భారత మహిళలు ఫైనల్ చేరిన విషయం తెలిసిందే... ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడింది భారత జట్టు.
ఐసీసీ మెగా టోర్నీలో రన్నరప్గా నిలిచిన జట్టుకి బహుమతిగా 5 లక్షల డాలర్లు (దాదాపు 36 కోట్ల రూపాయలు) అందించింది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్. ఏడాది దాటినా ఈ డబ్బు, ఇంకా ప్లేయర్లకు చేరలేదు.
ఐసీసీ టోర్నీల్లో టీమ్ గెలిచిన డబ్బును, అంతర్జాతీయ క్రికెట్ మండలి సదరు క్రికెట్ బోర్డుకి పంపిస్తుంది. అలాగే బీసీసీఐకి ఈ మొత్తాన్ని అందచేసింది ఐసీసీ. అయితే బీసీసీఐ మాత్రం ఇప్పటికీ ఈ మొత్తాన్ని ప్లేయర్లకు ఇవ్వలేదు..
టీ20 వరల్డ్కప్లో పాల్గొన్న 15 మంది జట్టులో ఒక్కో ప్లేయర్కి 33 వేల డాలర్లు అంటే దాదాపు 24 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తం సి కేటగిరి ప్లేయర్లకు చెల్లించే సెంట్రల్ కాంట్రాక్ట్ మొత్తం కంటే రెట్టింపు...
పురుష క్రికెటర్ల విషయంలో అయితే ఈ డబ్బు, టోర్నీ ముగిసిన వారం రోజులకే వారి ఖాతాల్లో చేరిపోయేది. మహిళా క్రికెటర్లు మాత్రం ఏడాదికి పైగా వేచి చూడాల్సి వస్తోంది. సరైన సమయానికి ఈ డబ్బులు వారికి అందిఉంటే, కరోనా లాక్డౌన్లో ఎంతో ఉపయోగపడేవని అంటున్నారు ఫిమేల్ క్రికెట్ ఫెడరేషన్ సభ్యులు.