దాదాగిరి: పీకల్లోతు వివాదాల్లో మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ
బోర్డు అధ్యక్షుడిగా కొనసాగుతూ పలు విరుద్ధ ప్రయోజనాలతో పొందుతున్న అనుచిత లబ్ది పట్ల బోర్డు వర్గాలతో పాటు మార్కెట్ వర్గాల్లోనూ గుసగుసలు వినిపిస్తున్నాయి. గంగూలీ కమర్షియల్ ఒప్పందాలు, పలు కంపెనీలకు ప్రచారకర్తగా కొనసాగుతుండటంపై ఇప్పటివరకు ఎవరూ బాహాటంగా అభ్యంతరం వ్యక్తం చేయలేదు. కానీ డిసెంబర్ 24న జరగబోయే బీసీసీఐ వార్షిక సర్వ సభ్య సమావేశంలో (ఏజీఎం)లో దాదాగిరి చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తోంది.
బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ వివాదాల్లో కూరుకుపోయాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలి అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం గంగూలీ వ్యాపార ప్రకటన ఒప్పందాలు కొత్త పుంతలు తొక్కుతుంది. 2019లో బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టకుముందు, ఇప్పుడు బోర్డు బాస్గా గంగూలీ ప్రకటనల ఒప్పందాలకు గణనీయమైన వ్యత్యాసం కనిపిస్తోంది.
బోర్డు అధ్యక్షుడిగా కొనసాగుతూ పలు విరుద్ధ ప్రయోజనాలతో పొందుతున్న అనుచిత లబ్ది పట్ల బోర్డు వర్గాలతో పాటు మార్కెట్ వర్గాల్లోనూ గుసగుసలు వినిపిస్తున్నాయి. గంగూలీ కమర్షియల్ ఒప్పందాలు, పలు కంపెనీలకు ప్రచారకర్తగా కొనసాగుతుండటంపై ఇప్పటివరకు ఎవరూ బాహాటంగా అభ్యంతరం వ్యక్తం చేయలేదు. కానీ డిసెంబర్ 24న జరగబోయే బీసీసీఐ వార్షిక సర్వ సభ్య సమావేశంలో (ఏజీఎం)లో దాదాగిరి చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. సభ్యుల నుంచి ఎదురుకాబోయే అనూహ్య అస్త్రాలకు గంగూలీ వద్ద సమాధానం ఉందననుకోవటం భ్రమే కానుంది!.
సౌరభ్ గంగూలీ విరుద్ధ ప్రయోజనాల జాబితా కాస్త పెద్దదిగానే ఉంది. బీసీసీఐ సభ్యులు కొందరు దాదా ప్రకటనల ఒప్పందాల తీరుపై నెమ్మదిగా విమర్శలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. బీసీసీఐ అధ్యక్షుడిగా దాదా పొందుతున్న విరుద్ధ ప్రయోజనాలు వివరాలు చూద్దాం.
1. డ్రీమ్ 11 ఐపీఎల్ టైటిల్ హక్కులను సొంతం చేసుకుంది. ఫాంటసీ గేమ్ మార్కెట్లో డ్రీమ్11కు మైసర్కిల్ 11 ప్రధాన ప్రత్యర్థి. బోర్డు అధికారిక స్పాన్సర్ వ్యాపార ప్రత్యర్థితో దాదా ఒప్పందం చేసుకోవటంపై ముందునుంచీ అభ్యంతరాలు ఉన్నాయి. డ్రీమ్11 నుంచి ఎటువంటి ఫిర్యాదు లేకపోవటంతో ఇక్కడ దాదాకు పెద్ద ఊరట లభించింది.
2. భారత క్రికెట్ జట్టు జెర్సీ స్పాన్సర్షిప్ హక్కులు ఆన్లైన్ ఎడ్యుకేషన్ సంస్థ బైజూస్ దక్కించుకుంది. గంగూలీ ఇటీవల, మరో ఎడ్యుటెక్ స్టార్టప్ కంపెనీ క్లాస్ప్లస్తో ఒప్పందం చేసుకున్నాడు. ఈ ఒప్పందం డిసెంబర్ 14న జరిగింది. దీనిపైనా బైజూస్ అదికారికంగా ఫిర్యాదు చేస్తే, దాదాకు తిప్పలు తప్పవు.
3. రానున్న ఐపీఎల్ సీజన్లకు మరో రెండు కొత్త ప్రాంఛైజీలకు బోర్డు టెండర్లు ఆహ్వానించేందుకు సిద్ధమవుతోంది. అహ్మదాబాద్ వేదికగా ప్రాంఛైజీకి ఆదాని గ్రూప్ రేసులో ముందుంది. ఆ కంపెనీ వంటనూనె ఉత్పత్తులకు గంగూలీ ప్రచారకర్తగా ఉంటున్నాడు. ఇది నేరుగా విరుద్ధ ప్రయోజనమే కానుంది.
4. బీసీసీఐ అధ్యక్షుడిగా కొనసాగుతూ ఐపీఎల్ ప్రాంఛైజీ నడుపుతున్న కంపెనీతో దాదా ఒప్పందం చేసుకోవటం విమర్శలకు తావిస్తోంది. జెఎస్డబ్ల్యూ గ్రూప్ ఈ ఏడాది జూన్లో గంగూలీని తమ సిమెంట్కు ప్రచారకర్తగా నియమించుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ ప్రాంఛైజీలో ఆ గ్రూపునకు 50 శాతం వాటా ఉంది.
5. బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సభ్యుడిగా గంగూలీ ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశాలకు ప్రత్యేక ఆహ్వానితుని హౌదాలో హాజరు అవుతారు. ఓ ప్రాంఛైజీ యాజమాన్య కంపెనీతో బంధం కొనసాగిస్తూ.. ఇలా ఐపీఎల్ పాలక మండలి సమావేశాలకు హాజరు కావటం విరుద్ధ ప్రయోజనాలు పొందటమే అవుతుంది.
ఇలా చెప్పుకుంటే పోతే గంగూలీ విరుద్ధ ప్రయోజాల జాబితా కొనసాగుతూనే ఉంటుంది. బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు అందుకున్న తర్వాత గంగూలీ మార్కెట్ నుంచి అనూహ్య డిమాండ్ చవిచూస్తున్నాడు. ప్రచారకర్తల మార్కెట్లో గంగూలీ ఇప్పుడు టాప్-5 ప్రాధాన్యత జాబితాలో ఉన్నట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
గంగూలీ నుంచి ఆశించింది ఇది కాదు...
క్రికెట్ పరిపాలకులు సహజంగానే సెలబ్రిటీలు కాదు. అయినా, క్రీడా సంఘాల బాధ్యతలు చేపట్టిన తర్వాత ముందు నుంచీ కొనసాగిస్తున్న వ్యాపార ఒప్పందాలను రద్దు చేసుకున్న ఉదంతాలు ఉన్నాయి. ఫిఫా అధ్యక్షుడు గియాని ఇన్ఫాంటినో వీసా కార్డు ప్రచారకర్తగా ఉన్నారు. ఆ సమయంలో ఫిఫాకు వీసా కార్దు స్పాన్సర్గా ఉండటంతో ఎటువంటి సమస్య లేదు. ప్రపంచ అథ్లెటిక్స్ అధ్యక్షుడు సెబాస్టియన్ కోహెకు నైకీతో విలువైన లక్ష డాలర్ల ఒప్పందం ఉండేది. 2015లో బాధ్యతలు చేపట్టిన తర్వాత సెబాస్టియన్ నైకీతో ఒప్పందాన్ని వదులుకున్నాడు. భారత క్రికెట్ మాజీ కెప్టెన్గా గంగూలీకి ప్రచార ఒప్పందాలు వస్తున్నాయని అనుకుంటే.. ఇది ముందు నుంచే ఉండాలి. బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ ఇప్పుడు నిత్యం వార్తల్లో ఉన్నారు. కంపెనీలకు కావాల్సిన ప్రధాన ముడిసరుకు అదే. దీంతో కంపెనీలు గంగూలీ వెంట పడుతున్నాయి.
బీసీసీఐ అధ్యక్షుడిగా ఏ కంపెనీకైనా, ఏ ఉత్పత్తులకు అయినా ప్రచారకర్తగా కొనసాగితే.. బోర్డు అధ్యక్షుడిగా గంగూలీ ప్రభావం చూపగలడు. వ్యక్తిగత ఇమేజ్తోనే ప్రచారకర్తగా ఒప్పందాలు చేసుకుంటున్నారని ఎట్టి పరిస్థితుల్లోనూ భావించలేం. బోర్డులో తీవ్ర గందరగోళానికి, వివాదాలకు దారితీసున్న విరుద్ధ ప్రయోజాలకు చెక్ పెట్టేందుకు గంగూలీ స్వయంగా.. ఇటువంటి ఒప్పందాలకు దూరంగా ఉండాల్సింది. కానీ, దాదా ఆలోచనలు భిన్నంగా ఉన్నట్టు స్పష్టమవుతున్నాయి. అందుకే విమర్శలు వెల్లువెత్తుతున్నా, ప్రచార ఒప్పందాల్లో దూకుడు చూపిస్తున్నారు.
కరోనా మహమ్మారి కష్ట కాలంలోనూ బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ క్రీయాశీలంగా వ్యవహరించలేదు. యుఏఈలో ఐపీఎల్ నిర్వహణ, రోహిత్ శర్మ ఫిట్నెస్పై వ్యాఖ్యలు, ఈమెయిల్లో దేశవాళీ క్రికెట్ సీజన్ నిర్వహణపై రాష్ట్ర క్రికెట్ సంఘాల అభిప్రాయ సేకరణకు ఆదేశం మినహా గంగూలీ పాత్ర పెద్దగా కనిపించదు. కరోనా కష్టకాలంలో దేశవాళీ సీజన్ లేకపోవటంతో సుమారు 6000 మంది ఆర్థికంగా నష్టపోయారు. దేశవాళీ క్రికెట్తో ముడిపడిన క్రికెటర్లు, అంపైర్లు, స్కోరర్లు, గ్రౌండ్ సిబ్బంది సహా ఇతరులను ఆదుకునేందుకు బోర్డు నుంచి గంగూలీ ఎటువంటి నిర్మాణాత్మక చర్యలు తీసుకోలేదు. దీనిపైనా రాష్ట్ర క్రికెట్ సంఘాల్లో అసంతృప్తి గూడుకట్టుకుంది. క్రిస్మస్ ముందు రోజు సమావేశంలో ఎదురుకానున్న ఈ సవాళ్లను, వివాదస్పద ప్రశ్నలకు దాదా ఏ రీతిన స్పందిస్తారో చూడాలి.