- Home
- Sports
- Cricket
- మాపై ఓడగానే టీమిండియా కెప్టెన్లను మార్చింది.. పాక్పై ఓటమిని ఆ జట్టు భరించడం లేదు : రమీజ్ రాజా
మాపై ఓడగానే టీమిండియా కెప్టెన్లను మార్చింది.. పాక్పై ఓటమిని ఆ జట్టు భరించడం లేదు : రమీజ్ రాజా
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మాజీ చైర్మెన్ రమీజ్ రాజా ఆ పదవి నుంచి దిగిపోయినా భారత్ పై తన విద్వేషాన్ని వెల్లగక్కుతూనే ఉన్నాడు. తాజాగా ఆయన.. తమపై ఓడిపోడగానే భారత్ కెప్టెన్లను మార్చుతుందని అన్నాడు.

తన పదవి నుంచి దిగిపోయిన తర్వాత రమీజ్ రాజాపై ఆ జట్టు మాజీలు దుమ్మెత్తిపోస్తూనే ఉన్నారు. పీసీబీ చైర్మెన్ గా ఉన్న సమయంలో ఆయన చాలా దురుసుగా ప్రవర్తించేవాడని, అంతా తానే అన్నట్టు వ్యవహరించేవాడని వాపోతున్నారు. అదే సమయంలో తనను అర్థాంతరంగా పీసీబీ అధ్యక్ష పదవి నుంచి తొలగించినందుకు ఆయన కూడా ఆరోపణలు సందిస్తూనే ఉన్నాడు.
తాజాగా రమీజ్ రాజా పాక్ లోని సునో టీవీతో మాట్లాడుతూ భారత్ పై ఎప్పటిలాగే విద్వేషాన్ని వెల్లగక్కాడు. తన హయాంలో బిలియన్ డాలర్ ఇండస్ట్రీ అయిన భారత్ (బీసీసీఐ) ను రెండు సార్లు ఓడించామని.. తమపై ఓడిపోగానే బీసీసీఐ కెప్టెన్లను, చీఫ్ సెలక్టర్ ను మార్చిందని వ్యాఖ్యానించాడు.
Rohit - babar azam
రమీజ్ మాట్లాడుతూ.. ‘నా హయాంలో పరిమిత ఓవర్ల క్రికెట్ లో పాకిస్తాన్ అద్భుతాలు సృష్టించింది. మేం ఆసియా కప్ ఫైనల్ ఆడాం. కానీ ప్రపంచ క్రికెట్ లోనే సంపన్న బోర్డుగా ఉన్న బీసీసీఐ కనీసం ఫైనల్ కు కూడా రాలేదు. మాపై ఓడిపోగానే ఆ జట్టు కెప్టెన్ ను మార్చింది. చీఫ్ సెలక్టర్, ఇతర సిబ్బందిని కూడా తీసేసింది.
పాకిస్తాన్ పై ఓడటాన్ని బీసీసీఐ జీర్ణించుకోలేదు. వాళ్ల కంటే మేం పైన ఉండటం వాళ్లకు కంటగింపుగా ఉంది..’ అని వాపోయాడు. అయితే రమీజ్ చెప్పినట్టు ఆసియా కప్ లో టీమిండియా ఫైనల్ చేరకపోయినా ఆ టోర్నీ ముగిసిన తర్వాత భారత జట్టు కెప్టెన్ ను గానీ చీఫ్ సెలక్టర్ ను గానీ మార్చలేదు. టీ20 ప్రపంచకప్ లో సెమీస్ లో భారత్ ఓటమి నేపథ్యంలో సెలక్టర్లపై వేటు వేసింది.
టీ20లలో రోహిత్ శర్మను తప్పించినట్టు బీసీసీఐ ఇప్పటివరకూ అధికారిక ప్రకటన చేయలేదు. బంగ్లాదేశ్ తో వన్డే సిరీస్ లో గాయపడ్డ రోహిత్ శర్మ విశ్రాంతి తీసుకుంటున్నాడే తప్ప అతడు కూడా తాను పొట్టి ఫార్మాట్ నుంచి తప్పుకుంటున్నట్టు చెప్పలేదు. రాబోయే టీ20 ప్రపంచకప్ వరకూ జట్టుకు యువరక్తాన్ని ఎక్కించాలని సెలక్టర్లు హార్ధిక్ పాండ్యా కు తాత్కాలిక సారథ్య బాధ్యతలు అప్పగించారే తప్ప గంపగుత్తగా అతడే టీమిండియా సారథి అని ప్రకటించలేదు.
2021 టీ20 ప్రపంచకప్ లో పాకిస్తాన్ చేతిలో ఓడిన తర్వాత భారత్ ఇంటిబాట పట్టాల్సి వచ్చింది. అయితే టోర్నీ కంటే ముందే అప్పటి సారథి విరాట్ కోహ్లీ.. పొట్టి ఫార్మాట్ లో తనకు ఇదే చివరి టోర్నీ అని, ఆ తర్వాత సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుంటానని ప్రకటించిన విషయం తెలిసిందే.