ఇక నా వల్ల కాదు... జరిగిన అవమానం చాలు, అంపైరింగ్ వదిలేస్తున్నా... బంగ్లా అంపైర్ షాకింగ్ నిర్ణయం...
బంగ్లా స్టార్ ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్ విపరీత చేష్టల కారణంగా అవమానానికి గురైన బంగ్లా అంపైర్ మోనిరుజమన్... అంపైరింగ్కి వీడ్కోలు చెప్పాడు. బంగ్లాబంధు ఢాకా ప్రీమియర్ లీగ్లో జరిగిన అవమానాలతో అంపైరింగ్కి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్టు ప్రకటించాడు.
నాటౌట్గా ప్రకటించడంతో చిర్రెత్తుకుపోయిన షకీబ్ అల్ హసన్, వికెట్లను పీకేసి అంపైర్ మోనిరుజుమన్ను దూషిస్తూ బూతులు తిట్టాడు. అంతకుముందు ఓవర్లో వికెట్లను తన్నుతూ ఆగ్రహం వ్యక్తం చేశాడు...
ఈ సంఘటనపై సీరియస్ అయిన బంగ్లా క్రికెట్ బోర్డు, షకీబ్ అల్ హసన్కు భారీ జరిమాని విధించడంతో పాటు మూడు మ్యాచులు ఆడకుండా నిషేధం విధించింది. షకీబ్ అల్ హసన్ కూడా తాను అలా ప్రవర్తించి ఉండకూడదని ప్రశ్చాతాపం వ్యక్తం చేశాడు.
అయితే ఆ తర్వాత సంఘటన తర్వాత బంగ్లా క్రికెటర్ మహ్మదుల్లా కూడా అంపైర్ మోనిరుజమన్తో తీవ్రంగా ప్రవర్తించాడు. అప్పీలుకి నాటౌట్గా ప్రకటించడంతో కోపంగా గ్రౌండ్ని తన్నుతూ, మైదానంలో పడుకుని నిరసన వ్యక్తం చేశాడు.
ఈ సంఘటన తర్వాత మహ్మదుల్లాపై 20 వేల టాకాల జరిమానా విధించింది బంగ్లా క్రికెట్ బోర్డు. అయితే ఈ వరుస సంఘటనలతో ఐసీసీ ఎమర్జింగ్ ప్యానెల్ మెంబర్గా ఉన్న మోనిరుజమన్, అన్ని ఫార్మాట్ల క్రికెట్ అంపైరింగ్ నుంచి తప్పుకుంటున్నట్టు సంచలన నిర్ణయం తీసుకున్నాడు.
‘ఇక నా వల్ల కాదు, జరిగిన అవమానం చాలు, ఇక అంపైరింగ్ చేయాలని అనుకోవడం లేదు. నాకు కూడా ఆత్మాభిమానం ఉంది. అంపైర్లు కూడా తప్పులు చేస్తారు. కానీ ఇలా ట్రీట్ చేయడం కరెక్టు కాదు...
నేను కేవలం డబ్బుల కోసం మాత్రమే అంపైరింగ్ చేయడం లేదు. ఎవ్వరూ కావాలని తప్పులు చేయడం. షకీబ్ ఆటతో నాకు సంబంధం లేదు. కానీ అతను ప్రవర్తించిన విధానాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నా...
మహ్మదుల్లా మ్యాచ్లో నేను టీవీ ఎంపైర్గా ఉన్నా. జరిగిన ఎపిసోడ్ మొత్తం చూశా. అతని ప్రవర్తన చూసి ఏం చేయాలో అర్థం కాక మొద్దుబారిపోయా... అప్పుడే ఇక అంపైరింగ్ చేయకూడదని నిర్ణయించుకున్నా...
నేను బంగ్లా క్రికెట్ బోర్డు ఉద్యోగిని కాదు. అంపైర్లకు డబ్బులు బోర్డు నుంచే అందుతాయి. కానీ నేను కేవలం గేమ్ మీద ప్రేమతో అంపైరింగ్ ఎంచుకున్నా. నాకు కేవలం మ్యాచ్ ఫీ మాత్రమే వస్తుంది. కానీ ఇలా వచ్చే ఆ డబ్బులు నాకొద్దు’ అంటూ రిటైర్మెంట్ ప్రకటన చేశాడు మోనిరుజమన్...