పీసీబీ కాబోయే ఛైర్మన్కు షాకిచ్చిన బలూచిస్తాన్ హైకోర్టు.. అష్రఫ్ ఎన్నిక వాయిదా..
PCB: పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు కాబోయే ఛైర్మన్ జకా అష్రఫ్ కు సంబంధించి అధ్యక్ష ఎన్నికను నిలిపేయాలని కోర్టు ఆదేశించింది. జులై 17 వరకూ ఎన్నికలు నిర్వహించడానికి వీళ్లేదని స్టే విధించింది.

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కు బలూచిస్తాన్ హైకోర్టు ఊహించని షాకిచ్చింది. కొత్త పాలకవర్గాన్ని ఎన్నుకోవడానికి సిద్ధమవుతున్న పీసీబీ.. ఛైర్మన్కు సంబంధించిన ఎన్నికను నిలిపేయాలని కోర్టు ఆదేశించింది. జులై 17 వరకూ ఎన్నికలు నిర్వహించడానికి వీళ్లేదని స్టే విధించింది.
పీసీబీ ఛైర్మన్ ఎన్నికను నిరసిస్తూ పాకిస్తాన్ లోని లాహోర్, రావల్పిండి, బలూచిస్తాన్ హైకోర్టులలో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. పీసీబీ 2014 రాజ్యాంగ చట్టాన్ని ఉల్లంఘించినట్టు పిర్యాదుదారులు తమ పిటిషన్లలో పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిగిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని ఫిర్యాదుదారులు కోరడంతో బలూచిస్తాన్ కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ కేసులో పీసీబీ వాదనలు వినిపించడానికి పీసీబీ సిద్ధంగా ఉన్నా హైకోర్టు మాత్రం అందుకు సిద్ధంగా లేమని తెలిపింది. జులై 17 వరకూ ఛైర్మెన్ కు సంబంధించిన ఎటువంటి ఎన్నికా చేపట్టడానికి వీళ్లేదంటూ ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలతో అష్రఫ్ ఎన్నికకు బ్రేక్ పడ్డట్టైంది. ఒకవేళ ఈ ఆరోపణలు నిజమని తేలితే ఇప్పుడున్న పీసీబీ కార్యవర్గాన్ని మొత్తం రద్దు చేసి కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకోవాల్సి ఉంటుంది.
పీసీబీ గవర్నింగ్ బాడీలో పది మంది సభ్యులుంటారు. వీరిలో ఇద్దరిని ప్రధాని సిఫారసు చేస్తారు. మిగితావారిలో నలుగురు ప్రాంతీయ ప్రతినిధులు, నలుగురు సేవా ప్రతినిధులు ఉంటారు. వీరంతా పీసీబీ నూతన ఛైర్మన్ ను ఎన్నుకోవాల్సి ఉంటుంది. కానీ పీసీబీ ఛైర్మన్ ఎవరనేది మాత్రం ప్రధాని చేతుల్లో ఉంటుంది.
అయితే దీని వెనుక పీసీబీ మాజీ చీఫ్ నజమ్ సేథీ కుట్ర ఉందని అష్రఫ్ వర్గాలు చెబుతున్నాయి. 2013 - 14 సమయంలో పీసీబీ చీఫ్ గా ఆయనే ఉన్నారని, ఇటీవల ప్రధాని అండతో మరోసారి ఈ పదవి చేపట్టిన ఆయన మూడో సారి పీసీబీ చీఫ్ అయ్యే అవకాశాన్ని కోల్పోయినందుకే ఇలా చేశాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.
త్వరగా పీసీబీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టి బోర్డుపై తన మార్కును చూపాలనుకున్న అష్రఫ్ కు ఇది ఎదురుదెబ్బే. ఒకవేళ ఈ ఆరోపణలు నిజమని తేలితే ప్రస్తుతం ఉన్న కార్యవర్గం మొత్తం రద్దు అయి కొత్త గవర్నింగ్ బాడీని ఎన్నుకోవడం ఇప్పట్లో అయ్యే పని అయితే కాదు. మరి పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ సపోర్ట్ తో వస్తున్న అష్రఫ్.. ఈ కేసును తనకు అనుకూలంగా ఎలా మలుచుకుంటాడన్నది ఆసక్తికరంగా మారింది.