- Home
- Sports
- Cricket
- దీపక్ చాహర్ కు మరో గాయం.. మొత్తం సీజన్ నుంచే ఔట్..? సీఎస్కే 14 కోట్ల ఆశలు ఆవిరి.. ఇక చెన్నై కథ కంచికేనా..
దీపక్ చాహర్ కు మరో గాయం.. మొత్తం సీజన్ నుంచే ఔట్..? సీఎస్కే 14 కోట్ల ఆశలు ఆవిరి.. ఇక చెన్నై కథ కంచికేనా..
Deepak Chahar Doubtful for Full Season: ఈ సీజన్ లో డిఫెండింగ్ ఛాంపియన్లు గా బరిలోకి దిగిన చెన్నైకి ఏదీ కలిసి రావడం లేదు. ఇప్పటికే ఆ జట్టుకు వరుస ఓటములు చుట్టుముడుతుండగా.. ఇప్పుడు రూ. 14 కోట్ల ఆశలు పెట్టుకున్న ఆటగాడు కూడా సీజన్ కు పూర్తిగా దూరమయ్యే అవకాశం ఉంది.

మూలిగే నక్క మీద తాటి పండు పడటం అంటే ఇదేనేమో.. ఇప్పటికే సీజన్ లో డిఫెండింగ్ ఛాంపియన్లుగా బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ కు నాలుగు వరుస పరాజయాలు ఎదురై.. తీవ్ర ఒత్తిడిలో ఉండగా ఇప్పుడు ఆ జట్టుకు మరో షాక్ తగిలింది.
వేలంలో ఆ జట్టు ముచ్చటపడి ఏకంగా రూ. 14 కోట్లు పెట్టి దక్కించుకున్న ఆల్ రౌండర్ దీపక్ చాహర్.. మరో గాయంతో బాధపడుతున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
వెస్టిండీస్ తో టీ20 సిరీస్ సందర్భంగా ఈడెన్ గార్డెన్ లో జరిగిన మూడో టీ20లో తొడ కండరాల గాయంతో మ్యాచ్ నుంచి అర్థాంతరంగా తప్పుకున్నాడు. ఆ తర్వాత అతడు బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) లో చికిత్స పొందుతున్నాడు.
అయితే మొదట్లో దీపక్ చాహర్ కు ఆపరేషన్ అవసరమనుకున్నా.. తర్వాత అది అవసరంలేదని, కానీ ఈనెల 15 వరకు మాత్రం అతడు అందుబాటులో ఉండడని ఎన్సీఏ వర్గాలు చెన్నైకి తెలిపాయి. ఈ నేపథ్యంలో దీపక్.. 15 తర్వాత జరుగబోయే మ్యాచులకు వచ్చి తమ రాత మారుస్తాడని చెన్నై కొండంత ఆశలు పెట్టుకుంది.
కానీ ఇప్పుడు ఎన్సీఏ లో దీపక్ చాహర్ కు మరో గాయమైనట్టు సమాచారం. తొడ కండరాల నొప్పి తగ్గినా అతడికి గతంలో ఉన్న వెన్ను నొప్పి తిరగబెట్టిందని అది మానడానికి కనీసం నాలుగు నుంచి ఆరు వారాలైనా విశ్రాంతి తీసుకోవాలని ఎన్సీఏ వైద్యులు సూచించినట్టు వార్తలు వస్తున్నాయి.
ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం అతడు ఈ సీజన్ నుంచి పూర్తిగా తప్పుకున్నట్టే.. ఇది చెన్నై కి ఊహించని షాకే. ఇదే విషయమై సీఎస్కే అధికార ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. ‘మాకు దీపక్ చాహర్ వెన్ను నొప్పి గురించి తెలియదు. తొడ కండరాల గాయం నుంచి కోలుకున్న చాహర్.. ఐపీఎల్ లో సీఎస్కే తరఫున ఆడేందుకు ఎంతో కష్టపడుతున్నాడు. కానీ ఈ సమయంలో ఇలాంటి వార్త వినాల్సి వస్తుందనుకోలేదు..’ అని తెలిపాడు.
ఏదేమైనా దీపక్ చాహర్ రాక ఖాయమని ఇన్నాళ్లు భావించిన చెన్నై అభిమానులకు ఈ వార్త మింగుడుపడనిదే. మంగళవారం రాత్రి ఆ జట్టు.. వరుసగా మూడు విజయాలతో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో తలపడుతున్న వేళ చెన్నై ఆటగాళ్ల ఆట మీద కూడా ఇది ప్రభావం చూపనుంది.
ఇక ఇప్పటికే నాలుగు మ్యాచులు ఓడిన రవీంద్ర జడేజా సారథ్యంలోని చెన్నై.. నేటి మ్యాచులో కూడా ఓడితే ప్లే ఆఫ్స్ మీద ఆశలను వదులకుని చెన్నై ఎక్స్ప్రెస్ కు టికెట్లు బుక్ చేసుకోవాల్సిందే..