అంటే మేం టెస్టు క్రికెట్ ఆడకూడదా..? ముల్తాన్ ఓటమి తర్వాత పాక్ సారథి అసహనం
17 ఏండ్ల తర్వాత పాకిస్తాన్ పర్యటనకు వచ్చిన ఇంగ్లాండ్.. ముల్తాన్ వేదికగా ముగిసిన రెండో టెస్టులో ఆతిథ్య జట్టును ఓడించి సిరీస్ కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ ఓడిపోవడంతో ఆ జట్టు సారథితో పాటు ఆటగాళ్ల పైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
స్వదేశంలో ఇంగ్లాండ్ తో వరుసగా రెండు టెస్టులలో ఓడి సిరీస్ కోల్పోయిన పాక్ జట్టుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా ఆ జట్టు బ్యాటింగ్ లో బాబర్ ఆజమ్ పై బాగా ఆధారపడిందని.. గత రెండు టెస్టులలో అది స్పష్టంగా కనిబడిందని మాజీలు వాపోతున్నారు. రావల్పిండి టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ చేసిన బాబర్.. రెండో ఇన్నింగ్స్ విఫలమయ్యాడు.
అలాగే ముల్తాన్ లో కూడా తొలి ఇన్నింగ్స్ లో బాగా ఆడి రెండో ఇన్నింగ్స్ లో చేతులెత్తేశాడు. బాబర్ నిష్క్రమణ తర్వాత పాక్ బ్యాటింగ్ పేకమేడలా కూలిపోతున్నది. ఇదిలాఉండగా రెండో టెస్టు తర్వాత పాత్రికేయుల సమావేశానికి వచ్చిన బాబర్ కు ఊహించని ప్రశ్న ఎదురైంది. అన్ని ఫార్మాట్లలో రాణిస్తున్న బాబర్ ఆజమ్ ను టీ20లపై దృష్టి పెట్టాలని అడిగాడు ఓ జర్నలిస్టు.
సదరు జర్నలిస్టు.. ‘ఈ ప్రశ్నను నేను అభిమానుల తరఫున అడుగుతున్నాను. బాబర్, రిజ్వాన్ లు టీ20 ఫార్మాట్ పై మరింత దృష్టి పెట్టాలని వారు కోరుకుంటున్నారు.. మరి మీరేమంటారు..?’ అని ప్రశ్నించాడు.
దానికి బాబర్ అదిరిపోయే రిప్లై ఇచ్చాడు. ‘అంటే ఏంటి మీ ఉద్దేశం. మమ్మల్ని టెస్టులు ఆడటం మానేయమని మీరు పరోక్షంగా చెబుతున్నారా..?’ అని విసుక్కున్నాడు. తర్వాత ఆ జర్నలిస్టు తాను అలా అనలేదని కానీ టీ20లలో గతంలో అత్యుత్తమ ప్రదర్శనలు చేసిన బాబర్ - రిజ్వాన్ జోడీ కొద్దికాలంగా విఫలమవుతుండటం గురించి చెప్పానని సర్ది చెప్పుకొచ్చాడు.
టీ20 ఫార్మాట్ లో ప్రపంచంలోనే దిగ్గజ జోడీగా గుర్తింపు తెచ్చుకుంది బాబర్ - రిజ్వాన్ జోడీ. 2020, 2021 లలో ఈ ఇద్దరూ కలిసి పరుగుల వరద పారించారు. కానీ ఈ ఏడాది మాత్రం దారుణంగా విఫలమవుతున్నారు. బాబర్ తరుచుగా విఫలమవుతుంటే రిజ్వాన్ మాత్రం బంతికి ఒక పరుగు అన్నట్టుగా ఆడుతున్నాడు. అతడి స్ట్రైక్ రేట్ కూడా దారుణంగా పడిపోయింది. ఫిఫ్టీలు కొడుతున్నా.. అందుకు 50కు పైగానే బంతులు తీసుకుంటున్నాడు.
ఇక ముల్తాన్ టెస్టులో తాము చేసిన పోరాటం సరిపోలేదని బాబర్ అన్నాడు. ఈ టెస్టులో 11 వికెట్లతో చెలరేగిన అబ్రర్ కు ఈ మ్యాచ్ చిరకాలం గుర్తుంటుందని తెలిపాడు. రెండు టెస్టులలో విజయానికి దగ్గరగా వచ్చి ఓడటం బాధించిందని చెప్పిన బాబర్.. కరాచీలో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశాడు.