లంక ప్రీమియర్ లీగ్ వేలంలో సురేశ్ రైనా పేరు మరి‘చారు’.. మిస్టర్ ఐపీఎల్కు అవమానం..?
LPL Auction: భారత అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన లంక ప్రీమియర్ లీగ్ (ఎల్పీఎల్) వేలంలో మిస్టర్ ఐపీఎల్ సురేశ్ రైనాకు అవమానం జరిగింది.
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తో తెగదెంపులు చేసుకున్న మిస్టర్ ఐపీఎల్ సురేశ్ రైనా లంక ప్రీమియర్ లీగ్ (ఎల్పీఎల్) లో ఎంట్రీ ఇవ్వాలని భావించాడు. కానీ దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదు అన్న చందంగా ఎల్పీఎల్ వేలంలో అతడు పేరిచ్చినా ఏ జట్టు తీసుకోలేదు.
అలా అని సురేశ్ రైనా అన్ సోల్డ్ లిస్ట్ లో ఉన్నాడా..? అంటే పప్పులో కాలేసినట్టే.. అసలేం జరిగిందంటే.. ఈ వేలంలో తన బేస్ ప్రైస్ ధరతో సెట్ నెంబర్ 11 లో రైనా పేరు వచ్చింది. ఇదే సెట్ లొ రస్సీ వాన్ డర్ డసెన్, హజ్రతుల్లా జజాయ్, నువాందు ఫెర్నాండో, ఆండ్రూ ఫ్లెచర్, అషీన్ బండారా, సురేశ్ రైనా, ఇమామ్ ఉల్ హక్, ఎవిన్ లూయిస్ పేర్లు ఉన్నాయి.
ఐపీఎల్ - 2022 వేలం నిర్వహించిన చారు శర్మనే ఎల్పీఎల్ యాక్షన్ కూడా నిర్వహించాడు. అయితే సెట్ నెంబర్ 11లో ఉన్నవాళ్లందరి పేర్లు పిలిచిన చారు శర్మ.. రైనా పేరును మాత్రం పిలవకపోవడం గమనార్హం. మరి చారు శర్మ.. రైనా పేరును పిలవడం మరిచిపోయాడా..? లేక ఉద్దేశపూర్వకంగానే అతడిని పిలవలేదా..? అన్నది సస్పెన్సే..
రైనా పేరు పిలకవపోవడంతో పాటు అతడు అన్ సోల్డ్ లిస్ట్ లో కూడా లేకపోవడంతో రైనా ఫ్యాన్స్ గందరగోళానికి గురయ్యారు. దీనిపై లంక క్రికెట్ బోర్డు కూడా ఎలాంటి ప్రకటనా చేయలేదు. మరి భారీ ఆశలతో ఎల్పీఎల్ ఆడేందుకు సిద్ధమైన రైనాకు నిరాశ ఎదురైనట్టేనా..? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే రైనాకు ఇప్పుడే ఎల్పీఎల్లో ద్వారాలు మూసుకుపోలేదు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా అతడిని తీసుకునే అవకాశం ఉందని సమాచారం. కానీ దీనిపై లంక బోర్డు ఏ ప్రకటనా చేయలేదు. ఒకవేళ వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా లేకుంటే రైనాకు నిరాశే..
ఇక ఎల్పీఎల్ లో లంక ఆటగాడు దిల్షన్ మధుషనకకు అత్యధిక ధర పలికింది. అతడిని జఫ్నా కింగ్స్.. 92 వేల డాలర్లకు సొంతం చేసుకుంది. చరిత్ అసలంక 80వేల డాలర్లు కూడా జఫ్నా తరఫునే ఆడనున్నాడు. పాకిస్తాన్ సారథి బాబర్ ఆజమ్, పేసర్ నసీమ్ షాతో పాటు ఇటీవలే చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడిన మతీశ పతిరన కొలంబో స్ట్రైకర్స్ కు ఆడనున్నాడు.