ఆసియా కప్: 300 పరుగులు.. గిల్-అభిషేక్ జోడీతో యూఏఈకి దబిడిదిబిడే !
Asia Cup 2025 : ఆసియా కప్ 2025లో భారత్ తొలి మ్యాచ్ ను యూఏఈతో ఆడనుంది. ఈ టోర్నమెంట్ లో టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ శిష్యులైన శుభ్ మన్ గిల్-అభిషేక్ శర్మ జోడీ పరుగుల సునామీ ఉంటుందనే అంచనాలు ఉన్నాయి.

ఆసియా కప్ 2025: యూఏఈతో భారత్ తొలిపోరు
ఆసియా కప్ 2025లో హాంకాంగ్ పై ఘన విజయంతో ఆఫ్ఘనిస్తాన్ టోర్నమెంట్ను ప్రారంభించింది. ఇప్పుడు అందరి దృష్టి భారత జట్టుపై ఉంది. భారత్ తన తొలి మ్యాచ్లో యూఏఈ జట్టును ఎదుర్కోనుంది. ఆసియా కప్ లో ఎనిమిది సార్లు విజేతగా నిలిచిన భారత జట్టు ఈ సారి కూడా బలంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఓపెనర్లు శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ జోడీపై అభిమానుల అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
KNOW
గిల్-అభిషేక్ జోడీ దూకుడు
భారత్ తరఫున గిల్ తన క్లాసిక్ షాట్లతో ఇన్నింగ్స్ను నిలబెడితే, అభిషేక్ శర్మ తన ఆగ్రెసివ్ శైలితో బౌండరీల వర్షం కురిపించే ఆటగాడు. అండర్-14 స్థాయి నుంచి పంజాబ్కి కలిసి ఆడిన ఈ జోడీ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యర్థులకు తలనొప్పిగా మారింది.
అభిషేక్ బ్యాటింగ్ స్ట్రైక్రేట్ 200లకు దగ్గరగా ఉండగా, స్పిన్ బౌలింగ్ ఎదుర్కోవడంలో అది 250 వరకు పెరుగుతుంది. ఇటువంటి దూకుడుతో ఆడితే భారత్ స్కోరు 300 దాటే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
టీ20 క్రికెట్లో 300 పరుగుల సవాల్
ఇటీవలి సంవత్సరాల్లో టీ20 క్రికెట్లో భారీ స్కోర్లు సాధారణమైపోయాయి. 2024లో జింబాబ్వే గాంబియాపై 344/4 రన్స్ చేసి చరిత్ర సృష్టించింది. తర్వాత నేపాల్ మంగోలియాపై 314/3 స్కోరు చేసింది.
భారత్ కూడా బంగ్లాదేశ్పై 297/6, దక్షిణాఫ్రికాపై 283/1 టోటల్ సాధించింది. ఈ నేపథ్యంలో గిల్-అభిషేక్ జంట ఆడే విధానమే భారత్కి 300 పరుగుల మైలురాయిని అందించగలదని క్రికెట్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
భారత ఓపెనింగ్ జోడీ పై యువరాజ్ సింగ్ కోచింగ్ ప్రభావం
కోవిడ్ సమయంలో యువరాజ్ సింగ్ పంజాబ్ యువ ఆటగాళ్లను తన ఇంటికి పిలిచి కఠినమైన శిక్షణ ఇచ్చారు. అప్పుడు గిల్, అభిషేక్లకు ఇది కీలక మలుపు అయ్యింది. క్రమశిక్షణతో పాటు టెక్నికల్ మార్పులు వారిని అంతర్జాతీయ స్థాయిలో విజయవంతమైన ఆటగాళ్లుగా తీర్చిదిద్దాయి. ప్రస్తుత మ్యాచ్లలో వారు చూపుతున్న ధైర్యం వెనుక యువరాజ్ శిక్షణ ప్రధాన పాత్ర పోషించింది అని చెప్పవచ్చు.
భారత్కు ప్రధాన బలం గిల్-అభిషేక్ జోడీ
గిల్ టెస్ట్ కెప్టెన్గా ఇంగ్లాండ్పై సిరీస్లో అద్భుత ప్రదర్శన చేశాడు. మరోవైపు అభిషేక్ తన ధనాధన్ ఇన్నింగ్స్లతో ఏ బౌలింగ్దళాన్నైనా దెబ్బకొట్టగల సామర్థ్యం కలిగి ఉన్నాడు. ఈ జోడీ ఆసియా కప్ 2025లో ఏ జట్టుకైనా సవాలుగా మారనుంది. ఆసియా కప్ లో తమ తొలి మ్యాచ్ నుంచే తమ దూకుడును చూపించాలని ఈ జోడీ భావిస్తోంది. మొత్తంగా ఆసియా కప్ 2025లో భారత్కు గిల్-అభిషేక్ జంట ప్రధాన బలమని చెప్పవచ్చు. వారు ఎక్కువ సేపు క్రీజులో నిలబడితే భారత్ రికార్డు స్కోర్ సాధించనుంది.