ఆసియా కప్ 2025 ఫైనల్లో భారత్ vs పాక్ తలపడే ఛాన్స్ ఉందా?
Asia Cup 2025 India vs Pakistan: ఆసియా కప్ 2025 క్రికెట్ టోర్నీలో ఇండియా, పాకిస్తాన్ లు ఇప్పటికే రెండు సార్లు తలపడ్డాయి. అయితే, మూడోసారి, అదీ ఫైనల్లో తలపడే అవకాశం ఉంది. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆసియా కప్ 2025: భారత్ vs పాకిస్తాన్
ఆసియా కప్ 2025లో ఇండియా, పాకిస్తాన్ మూడోసారి తలపడతాయా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. గ్రూప్ రౌండ్లో, సూపర్ ఫోర్ రౌండ్లో రెండు జట్లు తలపడ్డాయి. రెండింటిలోనూ భారత్ గెలిచింది. గ్రూప్ రౌండ్లో తలపడినప్పుడు భారత్ 7 వికెట్ల తేడాతో గెలిచింది. సూపర్ ఫోర్ రౌండ్లో తలపడినప్పుడు భారత్ 6 వికెట్ల తేడాతో పాక్ ను చిత్తుగా ఓడించింది. ముచ్చటగా మూడో సారి అంటే ఫైనల్లో మళ్ళీ తలపడతాయా? ఈ అవకాశాలు ఉన్నాయా?
ఇండియా, పాకిస్తాన్ మళ్ళీ తలపడతాయా?
ఆసియా కప్ ఫైనల్లో భారత్, పాకిస్తాన్ మళ్ళీ తలపడే అవకాశం ఉంది. ఈ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 28న జరగనుంది. సూపర్ ఫోర్ రౌండ్లో మొదటి మ్యాచ్ గెలిచి, భారత్ తమ ఫైనల్ అవకాశాలను మరింత మెరుగుపరుచుకుంది.
కానీ పాకిస్తాన్కు మాత్రం పరిస్థితి అంత సులభం కాదు. సూపర్ ఫోర్ రౌండ్లో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లే సెప్టెంబర్ 28న జరిగే ఫైనల్కు అర్హత సాధిస్తాయి. దాని కోసం పాక్ మిగతా మ్యాచ్ లను తప్పకుండా గెలవాల్సి ఉంటుంది.
పాయింట్ల పట్టికలో టాప్ లో నిలిస్తేనే మరోసారి భారత్ పాక్ మ్యాచ్
సూపర్ ఫోర్ రౌండ్లో భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక జట్లు ఒక్కో మ్యాచ్ ఆడాయి. భారత్, బంగ్లాదేశ్ తలా రెండు పాయింట్లతో మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి.
భారత్ +0.689 నెట్ రన్ రేట్తో మొదటి స్థానంలో ఉంది, బంగ్లాదేశ్ +0.121 నెట్ రన్ రేట్తో రెండవ స్థానంలో ఉంది. బంగ్లాదేశ్తో జరిగిన మొదటి మ్యాచ్లో ఓడిపోయిన శ్రీలంక -0.121 నెట్ రన్ రేట్తో మూడవ స్థానంలో ఉంది, పాకిస్తాన్ -0.689 నెట్ రన్ రేట్తో నాల్గవ స్థానంలో ఉంది. అంటే మిగతా మ్యాచ్ లలో పాకిస్తాన్ గెలవడంతో పాటు మెరుగైన రన్ రేటును కొనసాగించాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడే పాక్ ఫైనల్ కు చేరే అవకాశం ఉంటుంది.
పాకిస్తాన్ కు కష్టమేనా?
శ్రీలంకతో మంగళవారం పాకిస్తాన్ ఆడబోయే మ్యాచ్, ఆసియా కప్లో భారత్, పాకిస్తాన్ మళ్లీ తలపడతాయా లేదా అని నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఒకవేళ పాకిస్తాన్ శ్రీలంకను ఓడిస్తే, ఫైనల్ ఆశలను సజీవంగా ఉంచుకోవచ్చు.
చివరి మ్యాచ్లో బంగ్లాదేశ్ను కూడా ఓడిస్తే, పాకిస్తాన్ ఫైనల్కు చేరుకునే అవకాశం ఉంది. బంగ్లాదేశ్ను శ్రీలంక ఓడిస్తే, బంగ్లాదేశ్ ఫైనల్ అవకాశాలు తగ్గుతాయి. ఒకవేళ బంగ్లాదేశ్ను భారత్, పాకిస్తాన్ ఓడిస్తే, బంగ్లాదేశ్ ఫైనల్ అవకాశాలు తగ్గుతాయి.
టాప్ గేర్లో భారత జట్టు
భారత్ చేతిలో ఓడిపోయిన పాకిస్తాన్కు మంగళవారం శ్రీలంకతో జరిగే మ్యాచ్ డూ ఆర్ డై పోరాటం కానుంది. మొదటి మ్యాచ్లో బంగ్లాదేశ్పై అనూహ్యంగా ఓడిపోయిన శ్రీలంకకు కూడా పాకిస్తాన్ను ఓడిస్తేనే ఫైనల్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. దీంతో ఈ మ్యాచ్ ఉత్కంఠగా సాగడం పక్కాగా అనిపిస్తోంది.
బుధవారం బంగ్లాదేశ్తో తలపడే భారత్, ఆ మ్యాచ్లో గెలిస్తే శ్రీలంకతో జరిగే చివరి మ్యాచ్ కంటే ముందే ఫైనల్లో తన స్థానాన్ని ఖరారు చేసుకోవచ్చు.
బంగ్లాదేశ్కు కూడా ఛాన్స్ ఉంది
ఒకవేళ బంగ్లాదేశ్, భారత్ను ఓడిస్తే, ఆ జట్టు కూడా ఫైనల్ ఆశలను సజీవంగా ఉంచుకోవచ్చు. దీనివల్ల పాకిస్తాన్, శ్రీలంక జట్లు టోర్నమెంట్ నుండి నిష్క్రమించే పరిస్థితి రావచ్చు. అయితే, మూడు జట్లు తలా రెండు విజయాలు సాధించే అవకాశం ఉన్నందున, ఫైనల్కు ఎవరు చేరుకుంటారో నిర్ణయించడంలో నెట్ రన్ రేట్ కీలక పాత్ర పోషిస్తుంది.
ఆసియా కప్ చరిత్రలో భారత్, పాకిస్తాన్ జట్లు ఇప్పటివరకు ఫైనల్లో తలపడలేదు.