- Home
- Sports
- Cricket
- ఆడితే లంకలో ఆడండి.. లేకుంటే మీరు లేకున్నా పోయేదేమీ లేదు : పీసీబీకి షాకిచ్చిన ఏసీసీ..!
ఆడితే లంకలో ఆడండి.. లేకుంటే మీరు లేకున్నా పోయేదేమీ లేదు : పీసీబీకి షాకిచ్చిన ఏసీసీ..!
Asia Cup 2023: ఆసియా కప్ నిర్వహణ వివాదంలో మరో మలుపు. పాకిస్తాన్ లేకుండానే ఈ టోర్నీ నిర్వహించేందుకు ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) సిద్ధమవుతున్నది.

ఈ ఏడాది సెప్టెంబర్ లో జరగాల్సి ఉన్న ఆసియా క్రికెట్ - 2023 పాకిస్తాన్ నుంచి తరలివెళ్లిందా..? అదీగాక ఈ ఏడాది బాబర్ ఆజమ్ సేన లేకుండానే ఈ టోర్నీ జరుగబోతుందా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ప్రతిపాదించిన హైబ్రిడ్ మోడల్ కు బీసీసీఐతో పాటు ఏసీసీ కూడా అంతగా అనుకూలంగా లేనట్టు సమాచారం.
జాతీయ మీడియాలో వస్తున్న కథనాల మేరకు.. ఈ ఏడాది ఆసియా కప్ ను శ్రీలంకలో నిర్వహించేందుకు ఏసీసీ సిద్ధమైంది. ఈ టోర్నీలో ఆడాలనుకుంటే పాకిస్తాన్ క్రికెట్ జట్టు.. శ్రీలంకకు రావాల్సిందేనని రాని పక్షంలో మాత్రం టోర్నీ నుంచి తప్పుకునే స్థితికి వచ్చినట్టు తెలుస్తున్నది.
పాకిస్తాన్ లో ఈ టోర్నీ నిర్వహిస్తే తాము ఆ దేశానికి రాబోమని టీమిండియా ఇదివరకే తన నిర్ణయాన్ని ప్రకటించగా తాజాగా ఆసియా క్రికెట్ కౌన్సిల్ లోని సభ్య దేశాలు కూడా హైబ్రిడ్ మోడల్ (భారత్ మ్యాచ్ లు తటస్థ వేదికపై, ఇతర మ్యాచ్ లు పాకిస్తాన్ లో) ను తిరస్కరించినట్టు తెలుస్తున్నది.
ఇదే విషయమై బీసీసీఐ ప్రతినిధి ఒకరు స్పందిస్తూ.. ‘ఆసియా కప్ ను పాకిస్తాన్ లో నిర్వహించే అవకాశాలు వన్ పర్సెంట్ కూడా లేవు. ఛాంపియన్స్ ట్రోఫీని కూడా తరలించాలని మేం ఐసీసీని కోరనున్నాం.
ప్రస్తుతానికి ఆసియా కప్ మాత్రం శ్రీలంకలో జరిగే అవకాశాలున్నాయి. ఈ మేరకు ఏసీసీ సభ్య దేశాలు కూడా దీనికి అనుకూలంగానే ఉన్నాయి. త్వరలో జరుగబోయే ఏసీసీ మీటింగ్ లో దీనిపై తుది నిర్ణయం వెలువడనుంది...’ అని తెలిపాడు.
కాగా.. పాకిస్తాన్, తటస్థ వేదిక మినహా శ్రీలంకలో ఆసియా కప్ను నిర్వహిస్తే తాము ఈ టోర్నీని బహిష్కరిస్తామని ఇదివరకే హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఏసీసీ, బీసీసీఐ అధికారులు చేస్తున్న ప్రకటనలు ఈ విషయంలో మరింత గందరగోళాన్ని పెంచాయి. ఒకవేళ ఆసియా కప్ లో ఆడకుంటే పాకిస్తాన్.. సౌతాఫ్రికా, జింబాబ్వేతో ట్రై సిరీస్ నిర్వహించాలని, ఆ మేరకు ఇదివరకే ఇరు దేశాలతో చర్చలు సాగిస్తున్నట్టు తెలుస్తున్నది.