షమీ వర్సెస్ అశ్విన్.. అందుకే ఆఫ్ స్పిన్నర్కు ఓటేసిన సెలక్టర్లు
India T20I World Cup Squad: పొట్టి ప్రపంచకప్ కోసం భారత జట్టును సోమవారం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీని రిజర్వ్ ప్లేయర్ గా ఎంపిక చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
టీ20 ప్రపంచకప్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో సీనియర్ పేసర్ మహ్మద్ షమీని స్టాండ్ బై ప్లేయర్ గా ఎంపిక చేయడంపై క్రికెట్ పండితులు విభిన్న వాదనలను వినిపిస్తున్నారు. షమీని 15 మంది సభ్యుల జట్టులోకి తీసుకుని ఉండాల్సిందని కామెంట్స్ చేస్తున్నారు.
అయితే జట్టు ఎంపిక లో షమీకి అశ్విన్ నుంచి గట్టి పోటీ ఎదురైందట. అశ్వినా..? షమీయా..? అని సెలక్టర్లు తలలు బాదుకుంటున్నారట. ఈ క్రమంలో టీమిండియా సారథి రోహిత్ శర్మ తో పాటు హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కూడా అశ్విన్ కే ఓటు వేశారని బీసీసీఐ వర్గాల సమాచారం.
పలు జాతీయ వెబ్ సైట్లలో వచ్చిన కథనం మేరకు.. టీ20 ప్రపంచకప్ జట్టు ఎంపికలో సెలక్టర్లు అశ్విన్-షమీ లలో ఎవరిని తీసుకోవాలనేదానిపై తీవ్రంగా కసరత్తులు చేశారు. అయితే రోహిత్ మాత్రం అశ్విన్ వైపుకే మొగ్గు చూపాడు.
కఠిన పరిస్థితులలో మెరుగ్గా బౌలింగ్ చేసే స్కిల్స్ తో పాటు లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్లపై అశ్విన్ ప్రభావం చూపగలడనే నమ్మకంతో సెలక్టర్లు, కెప్టెన్, హెడ్ కోచ్ లు అతడికే ఓటేశారని తెలుస్తున్నది. అదీగాక అశ్విన్ ఉపయుక్తకరమైన బ్యాటర్ కూడా.. ఇది కూడా అతడి ఎంపికకు కలిసొచ్చింది.
మరోవైపు బుమ్రా, హర్షల్ పటేల్ ఫిట్నెస్ పై ఇంకా పూర్తిస్థాయి అంచనాలకు రాని సెలక్టర్లు.. రిజర్వ్ ప్లేయర్ గా షమీని ఎంపిక చేశారని తెలుస్తున్నది. ఇదే విషయమై మాజీ జాతీయ సెలక్టర్ సబా కరీం ఓ క్రీడా ఛానెల్ తో మాట్లాడుతూ ఇవే వ్యాఖ్యలు చేశాడు.
‘ప్రపంచకప్ కోసం వారు (సెలక్టర్లు)షమీని స్టాండ్ బైగా ఎంపిక చేశారు. అంటే దీనర్థం వారికింకా బుమ్రా, హర్షల్ ల ఫిట్నెస్ పై సందేహాలున్నాయి. అందుకే వాళ్లు రిస్క్ కు పోకుండా షమీని స్టాండ్ బైగా ఎంపిక చేశారు. ఒకవేళ వీరిలో ఏ ఒక్కరు గాయపడ్డా సీనియర్ అయిన షమీని తుదిజట్టులోకి తీసుకోవచ్చు’ అని కరీం తెలిపాడు.