సారీ మేం మా టీమ్స్ను పంపలేం.. మొన్న పాకిస్తాన్, నేడు చైనాకు షాకిచ్చిన బీసీసీఐ
BCCI: ఆసియా కప్ - 2023 నిర్వహణ విషయంలో పాకిస్తాన్ కు షాకిచ్చిన బీసీసీఐ.. తాజాగా చైనాకు కూడా షాకిచ్చింది. ఆసియా గేమ్స్ ఆడేందుకు తాము భారత పురుషుల, మహిళల జట్లను పంపమని తేల్చింది.

ఈ ఏడాది సెప్టెంబర్ లో పాకిస్తాన్ వేదికగా జరగాల్సి ఉన్న ఆసియా కప్ ను ఆడేందుకు తాము ఆ దేశానికి రాబోమని, తటస్థ వేదిక అయితేనే ఆడతామని చెప్పి పంతం నెగ్గించుకున్న భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ).. తాజాగా చైనాకు కూడా షాకిచ్చింది.
ఈ ఏడాది చైనాలోని హాంగ్జౌ వేదికగా జరగాల్సి ఉన్న ఆసియా క్రీడలకు కూడా తమ టీమ్ (పురుషుల, మహిళల) లను పంపించలేమని తేల్చి చెప్పింది. ఈ మేరకు భారత ఏషియన్ గేమ్స్ చీఫ్ భుపేందర్ భజ్వా ఈ విషయాన్ని వెల్లడించారు. ముందుగా ఉన్న షెడ్యూల్స్ కారణంగానే బీసీసీఐ ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు తెలిపారు. ‘చైనాలో జరుగబోయే ఆసియా గేమ్స్ లో అన్ని విభాగాలకు మేం ఎంట్రీ పేర్లు ఇచ్చాం. ఒక్క క్రికెట్ లో మాత్రం ఇవ్వలేదు. బీసీసీఐ తమ జట్లను చైనాకు పంపకూడదని నిర్ణయించింది’ అని ఆయన వెల్లడించారు.
కాగా ఇదే విషయమై బీసీసీఐ ప్రతినిధిని వివరణ కోరగా.. ‘అవును. డెడ్ లైన్ కు ముందే మాకు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఒఏ) నుంచి మెయిల్ వచ్చింది. కానీ అప్పటికే మాకు ఐసీసీ ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్స్ కారణంగా షెడ్యూల్స్ ఫిక్స్ అయ్యాయి. ఆసియా గేమ్స్ జరిగే టైమ్ లో మాకు కీలక మ్యాచ్ లు ఉన్నాయి. అందుకే మేం టీమ్స్ ను పంపకూడదని నిర్ణయించుకున్నాం...’అని తెలిపాడు.
ఆసియా గేమ్స్ ఈ ఏడాది అక్టోబర్ - నవంబర్ లో జరుగుతాయి. కానీ అదే సమయానికి భారత్ లో వన్డే వరల్డ్ కప్ ఉంది. సెప్టెంబర్ లో ఆసియా కప్ ముగిసిన తర్వాత భారత జట్టు స్వదేశంలో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కూడా ఆడనుంది. అది ముగిసిన వెంటనే ఐసీసీ వన్డే వరల్డ్ కప్ ప్రిపరేషన్స్ ఉన్నాయి. ఆసియా కప్ మెడల్ కన్నా భారత్ కు వన్డే వరల్డ్ కప్ చాలా కీలకం.
ఇక మహిళల జట్టు విషయానికొస్తే.. ఆసియా గేమ్స్ జరిగే సమయంలో హర్మన్ప్రీత్ కౌర్ సేన ఎఫ్టీపీలో భాగంగా న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా పర్యటనలకు వెళ్లనుంది. అందుకే మహిళల జట్టును కూడా పంపడం సాధ్యపడదు.
వాస్తవానికి హాంగ్జౌలో జరగాల్సి ఉన్న ఆసియా గేమ్స్ గతేడాది నాటివి. కానీ కరోనా కారణంగా వాటిని ఈ ఏడాదికి వాయిదా వేశారు. ఇక ఆసియా గేమ్స్ గత ఎడిషన్ లో భారత జట్టు 70 మెడల్స్ తో సత్తా చాటింది. ఇందులో 16 స్వర్ణాలు, 23 రజతాలు, 31 కాంస్య పతకాలు ఉన్నాయి. ఈసారి కూడా స్వర్ణాల సంఖ్యను పెంచుకునేందుకు భారత్ ప్రణాళికలు రచిస్తోంది.