ఒకే ఓవర్లో 27 పరుగులు.. అర్ష్దీప్ చెత్త రికార్డు.. లయ తప్పుతున్న యువ పేసర్
INDvsNZ: టీమిండియాకు చాలా కాలం తర్వాత దొరికిన లెఫ్టార్మ్ పేసర్ అర్ష్దీప్ సింగ్. ఆశిష్ నెహ్రా, జహీర్ ఖాన్ తర్వాత ఆ స్థాయి వేగంతో భారత జట్టులోకి చోటు దక్కించుకున్నాడు అర్ష్దీప్..

టీమిండియా యువ పేసర్ అర్ష్దీప్ సింగ్ లయ తప్పుతున్నాడు. ఆసియా కప్ తో పాటు టీ20 ప్రపంచకప్ లో మెరుగ్గా రాణించిన అతడు.. తర్వాత గాడి తప్పాడు. విశ్రాంతి అందరికీ మంచి చేస్తే అర్ష్దీప్ కు మాత్రం అందుకు విరుద్ధంగా పరిణమించింది. టీ20 ప్రపంచకప్ తర్వాత విశ్రాంతి తీసుకుని ఈ ఏడాది జనవరిలో శ్రీలంకతో సిరీస్ లో జట్టులోకి వచ్చిన అతడు దారుణ ప్రదర్శనలతో జట్టుకు భారంగా మారాడు.
జహీర్ ఖాన్, ఆశిష్ నెహ్రాల తర్వాత నిఖార్సైన లెఫ్టార్ట్ పేసర్ కోసం చూస్తున్న భారత జట్టుకు ‘నేనున్నాను’ అని జట్టులోకి వచ్చిన అర్ష్దీప్.. గతేడాది మెరుగైన ప్రదర్శనలతోనే ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా లేకున్నా ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్ లలో భారత్ బౌలింగ్ లో ఆ లోటు తెలియనీయకుండా చేయడంలో అర్ష్దీప్ కీలకపాత్ర పోషించాడు.
అయితే టీ20 ప్రపంచకప్ తర్వాత అతడు గాడితప్పాడు. జనవరి ప్రారంభంలో లంకతో జరిగిన టీ20 సిరీస్ లోని ఓ మ్యాచ్ లో ఏకంగా ఐదు నోబాల్స్ వేశాడు. ఈ మ్యాచ్ లో భారత్ ఓడటానికి పరోక్షంగా అర్ష్దీప్ కారణమయ్యాడు. ఇక తాజాగా కివీస్ తో మ్యాచ్ లో కూడా అతడు ధారాళంగా పరుగులిచ్చుకున్నాడు.
ఈ మ్యాచ్ లో నాలుగు ఓవర్లు వేసిన అర్ష్దీప్.. 51 పరుగులిచ్చాడు. మరీ ముఖ్యంగా చివరి ఓవర్లో అయితే 27 పరుగులు సమర్పించుకున్నాడు. 20 వ ఓవర్ కు ముందు కివీస్ స్కోరు.. 149-6గా ఉండేది. కానీ ఆ ఓవర్ తర్వాత ఏకంగా 176కు చేరింది.
ఈ ఓవర్లో డారిల్ మిచెల్.. మూడు భారీ సిక్సర్లు, ఓ ఫోర్ బాది మొత్తంగా 27 పరుగులు పిండుకున్నాడు. తద్వారా అర్ష్దీప్.. భారత్ తరఫున చివరి ఓవర్ లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్ గా ఉన్న సురేశ్ రైనా రికార్డును బ్రేక్ చేశాడు. 2012లో రైనా.. దక్షిణాఫ్రికాతో మ్యాచ్ ఆడుతూ చివరి ఓవర్ వేసి 26 పరుగులివ్వగా.. తాజాగా అర్ష్దీప్.. 27 పరుగులిచ్చాడు.
రైనా రికార్డుతో పాటు మరో చెత్త రికార్డును కూడా అర్ష్దీప్ తన పేరిట నమోదు చేసుకున్నాడు. ఇప్పటివరకు 22 టీ20 మ్యాచ్ లు ఆడిన అతడు.. ఇప్పటికే 14 నోబాల్స్ వేశాడు. అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక నోబాల్స్ వేసిన బౌలర్ కూడా అతడే. గతంలో ఈ రికార్డు పాకిస్తాన్ బౌలర్ హసన్ అలీ.. (50 మ్యాచ్ లలో 11 నోబాల్స్) కీమో పాల్ (23 మ్యాచ్ లు 11 నోబాల్స్) ల పేరిట ఉండేది.