అర్ష్దీప్ ఫిట్.. మరి బలయ్యేదెవరు..? జమ్మూ ఎక్స్ప్రెస్కు షాక్ తప్పదా..!
INDvsSL T20I: శ్రీలంకతో మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భాగంగా భారత జట్టు నేడు ఆ జట్టుతో రెండో మ్యాచ్ ఆడనుంది. తొలి మ్యాచ్ కు దూరమైన టీమిండియా యువ పేసర్ అర్ష్దీప్ సింగ్.. నేటి మ్యాచ్ కు ఫిట్ గా ఉన్నట్టు తెలుస్తున్నది.

సీనియర్లు లేకుండా పూర్తిస్థాయి యువ జట్టులో లంకతో బరిలోకి దిగిన టీమిండియా తొలి టీ20లో చావు తప్పి కన్నులొట్టపోయిన చందంగా గెలిచింది. బ్యాటింగ్ లో విఫలమైన భారత జట్టు.. తర్వాత బౌలింగ్ లో మెరుగ్గానే రాణించినా చివర్లో గాడి తప్పంది. యువ బౌలర్లు ఉమ్రాన్ మాలిక్, అరంగేట్ర కుర్రాడు శివమ్ మావి మెరిసినా చివరి బంతి వరకూ ఫలితం తేలని పరిస్థితి.
కాగా తొలి మ్యాచ్ కు జ్వరం కారణంగా దూరమైన అర్ష్దీప్ రెండో మ్యాచ్ కు ఫిట్ గా ఉన్నట్టు తెలుస్తున్నది. పూణె వేదికగా జరుగబోయే మ్యాచ్ కు అతడు అందుబాటులో ఉన్నడున్నాడని, తుది జట్టులో ఉంటాడని బోర్డు వర్గాలు చెబుతున్నాయి. మరి ఒకవేళ అర్ష్దీప్ ఆడితే బలయ్యేది ఎవరు..? ఎవరి ప్లేస్ కు ఎసరు రానుంది..? అన్నది ఆసక్తికరంగా మారింది.
వాంఖెడేలో అరంగేట్రం చేసి తొలి మ్యాచ్ లోనే నాలుగు వికెట్లు తీసి భారత విజయంలో కీలక పాత్ర పోషించిన శివమ్ మావిని తీసే సాహసం టీమిండియా చేయకపోవచ్చు. ఇక మొన్నటి మ్యాచ్ లో 155 కిలోమీటర్ల వేగంతో బంతులు విసిరి కీలక వికెట్లు పడగొట్టిన జమ్మూ ఎక్స్ప్రెస్ ఉమ్రాన్ మాలిక్ ను తీసేస్తారా..?
లేక తొలి టీ20లో దారాళంగా పరుగులిచ్చిన హర్షల్ పటేల్ ను పక్కనబెట్టేస్తారా..? అన్నది ఇంకా తేలలేదు. కత్తి ఇప్పుడు ఈ ఇద్దరి మీదే వేలాడుతోంది. ఉమ్రాన్ కంటే హర్షల్ పటేల్ పై వేటు తప్పేలా లేదు. పూణె వికెట్ స్లో గా ఉంటుంది.
స్పిన్నర్లకు బాగా అనుకూలిస్తుంది. ఈ నేపథ్యంలో వాషింగ్టన్ సుందర్ ను తుది జట్టులోకి తీసుకునే ఛాన్స్ ఉందని సమాచారం. అతడు వస్తే హర్షల్ పటేల్ పై వేటు తప్పదు. వాషింగ్టన్ బ్యాటింగ్ కూడా చేయగలడు. ఎటొచ్చినా హర్షల్ కు షాక్ తప్పేలా లేదు.
ఇక వాంఖడేలో ఫీల్డింగ్ చేస్తుండగా సంజూ శాంసన్ ఎడమ మోకాలికి గాయమైంది. తొలి టీ20 ముగిసిన తర్వాత టీమిండియా పూణెకు వెళ్లగా శాంసన్ మాత్రం ముంబైలోనే ఆగిపోయాడు. అతడు ప్రస్తుతం బీసీసీఐ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. ఈ సిరీస్ లో మిగిలిన రెండు మ్యాచ్ లకు అతడు దూరమయ్యాడు.
శాంసన్ కు గాయమైన నేపథ్యంలో గత కొంతకాలంగా బెంచ్ కే పరిమితమవుతున్న రాహుల్ త్రిపాఠికి నేటి మ్యాచ్ లో తుది జట్టులో చోటు దక్కే అవకాశమున్నట్టు తెలుస్తున్నది. టీమ్ లో ఇప్పటికే స్పెషలిస్ట్ వికెట్ కీపర్ గా ఇషాన్ కిషన్ ఉన్నాడు. తొలి మ్యాచ్ లో కూడా అతడే కీపింగ్ బాధ్యతలు నిర్వర్తించాడు. ఈ నేపథ్యంలో జితేశ్ ను జట్టులోకి ఎంపిక చేసినా మ్యాచ్ ఆడించడం కష్టమేనని తెలుస్తున్నది. జితేశ్ ను పక్కనబెడితే త్రిపాఠికి అవకాశం రావడం పక్కా.. గతేడాది ఐర్లాండ్ పర్యటన నుంచి జట్టుకు ఎంపికవుతున్నా త్రిపాఠికి ఇంతవరకూ మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు.