- Home
- Sports
- Cricket
- నిన్ను చూసి నువ్వే నవ్వకుంటే..? కోహ్లి ఫామ్ పై అనుష్కశర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
నిన్ను చూసి నువ్వే నవ్వకుంటే..? కోహ్లి ఫామ్ పై అనుష్కశర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
Virat Kohli - Anushka Sharma: ఐపీఎల్-15 సీజన్ లో వరుసగా డకౌట్లతో విసుగు పుట్టిస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ సారథి విరాట్ కోహ్లి ఫామ్ పై అతడి భార్య అనుష్క శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

ఆర్సీబీ సూపర్ స్టార్ విరాట్ కోహ్లికి ఈ సీజన్ కలిసిరావడం లేదు. ఈ సీజన్ లో 12 మ్యాచులాడిన కోహ్లి.. 19.64 సగటుతో 216 పరుగులే చేశాడు. అదీగాక ఈ సీజన్ లో మూడు సార్లు గోల్డెన్ డకౌట్ కూడా అయ్యాడు.
ఈ నేపథ్యంలో రెండ్రోజుల క్రితం అతడు ఓ ఇంటర్వ్యూలో తాను డకౌట్ అవుతున్నప్పుడు ఎందుకు నవ్వుతున్నాననే విషయంపై మాట్లాడుతూ.. ‘నేను డకౌట్ అయిన దాని గురించేగా మీరు మాట్లాడుతున్నది. ఓకే. నా కెరీర్ లో ఇలా (వరుసగా రెండు సార్లు డకౌట్) ఎప్పుడూ జరుగలేదు..
అందుకే నేను అప్పుడు నవ్వాను. ఇప్పుడు నేను అన్నీ చూస్తున్నాను. నాకు సపోర్ట్ చేసేది ఎవరు.. విమర్శించేది ఎవరు..? అన్నీ తెలుస్తున్నాయి.. అన్నీ నా అనుభవంలోకి వస్తున్నాయి..’ అని చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆర్సీబీ.. తన సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది.
ఇక తాజాగా ఇదే విషయమై అనుష్క శర్మ తన ఇన్స్టా స్టోరీస్ లో ఈ లింక్ ను షేర్ చేస్తూ.. ‘నిన్ను చూసి నువ్వు నవ్వుకోకుంటే ఈ శతాబ్దంలో బ్రహ్మండమైన జోక్ ను నువ్వు మిస్ అవుతావ్..’ అని రాసుకొచ్చింది.
ఆర్సీబీ వీడియో తో పాటు అనుష్క శర్మ ఇన్స్టా స్టోరీ కూడా ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. డకౌట్ అయిన ప్రతిసారి కోహ్లి ఇలా నవ్వినప్పుడు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మాత్రం తీవ్రంగా బాధపడేవారు. ‘నువ్వు ఆడకున్నా ఫర్లేదు.. కనీసం నవ్వడమైనా ఆపేయి విరాట్ భయ్యా..’ అని కామెంట్లు చేస్తున్నారు.
ఇక ఆర్సీబీ విడుదల చేసిన తాజా వీడియోలో తనపై వస్తున్న విమర్శలపై కూడా కోహ్లి ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ‘వాళ్లు నా పరిస్థితుల్లో లేరు. నేనేం భావిస్తున్నానో వాళ్లు అది భావించడం లేదు. నేను ఔట్ అయినప్పుడు పడుతున్న బాధ, వేధన వాళ్లు పడటం లేదు..’ అని ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
ఇక క్రీజులో తాను విఫలమైనప్పుడు బయట నుంచి వస్తున్న విమర్శలను గాని టీవీలలో అభిమానుల ఆగ్రహాన్ని గానీ ఎలా ఫేస్ చేస్తారని కోహ్లిని ప్రశ్నించగా అతడు సమాధానం చెబుతూ... ‘టీవీలో అయితే మ్యూట్ లో పెట్టేస్తా. నా చుట్టూ ఉన్న ప్రజలు ఏమనుకుంటున్నారో పట్టించుకోను..’ అని చెప్పుకొచ్చాడు.