రోహిత్, కోహ్లీలను టీ20లకు పక్కనబెడుతున్నారా..? మాజీ చీఫ్ సెలక్టర్ స్పందన ఇదే..
INDvsSL:శ్రీలంకతో వన్డే సిరీస్ ముగిశాక న్యూజిలాండ్ తో భారత్ మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో నేడో రోపో జట్టును ప్రకటించనుంది చేతన్ శర్మ సారథ్యంలో ఇటీవల కొత్తగా ఎంపికైన సెలక్షన్ కమిటీ. ఈ కమిటీ.. రోహిత్, కోహ్లీలను పక్కనబెట్టాలని చూస్తుందని..
టీమిండియా వెటరన్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ త్వరలోనే టీ20 ఫార్మాట్ కు గుడ్ బై చెప్పనున్నారా..? ఆ మేరకు సెలక్టర్లు కూడా పావులు కదుపుతున్నారా..? టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత టీమిండియా రెండు టీ20 సిరీస్ లు ఆడినా ఈ ఇద్దరూ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.
ఇక స్వదేశంలో శ్రీలంకతో వన్డే సిరీస్ ముగిశాక న్యూజిలాండ్ తో భారత్ మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో నేడో రోపో జట్టును ప్రకటించనుంది చేతన్ శర్మ సారథ్యంలో ఇటీవల కొత్తగా ఎంపికైన సెలక్షన్ కమిటీ. ఈ కమిటీ.. రోహిత్, కోహ్లీలను పక్కనబెట్టాలని చూస్తుందని.. కొత్త కుర్రాళ్లను 2024 ప్రపంచకప్ వరకూ మరింత మెరుగుపరిచేందుకు ఈ ఇద్దరికీ రెస్ట్ తప్పదని వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే ఈ విషయమై మాజీ క్రికెటర్, గతంలో చీఫ్ సెలక్టర్ గా పనిచేసిన దిలీప్ వెంగసర్కార్ మాత్రం కోహ్లీ, రోహత్ కు అండగా నిలిచాడు. ఆ ఇద్దరిని పక్కనబెట్టొద్దని, భారత క్రికెట్ కు వాళ్లిద్దరూ అపారమైన సేవలు అందించారని కొనియాడాడు.
వెంగసర్కార్ మాట్లాడుతూ..‘రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు భారత క్రికెట్ కు ఎనలేని సేవ చేశారు. వాళ్లిద్దరూ ఇప్పటికీ ఫిజికల్ గానే గాక మానసికంగా కూడా చాలా ధృడంగా ఉన్నారు. వాళ్లలో ఇంకా చాలా క్రికెట్ మిగిలే ఉంది. ఇప్పుడే వాళ్లిద్దరినీ టీ20ల నుంచి పక్కనబెట్టడం సరికాదు.
భారత్ కీలక టోర్నీలు లేదా సిరీస్ లు ఆడుతున్నప్పుడు కోహ్లీ, రోహిత్ లు తప్పకుండా జట్టులో ఉండాలి. వాళ్లు ఉంటే జట్టు యువకులు, సీనియర్లతో సమతూకంగా ఉంటుంది. నేను ఈ ఇద్దరి ఆటకు పెద్ద ఫ్యాన్ ను. వయసు సమస్య కానే కాదు. అది ఒక నెంబర్ మాత్రమే...’అని అన్నాడు.
ఇక త్వరలో భారత్.. న్యూజిలాండ్ తో సిరీస్ ముగిశాక ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టులు ఆడనుంది. ఈ సిరీస్ గెలిస్తేనే భారత జట్టు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ రేసులో ఉంటుంది. అయితే ఈ సిరీస్ లో భారత్ విజయం సాధిస్తుందని వెంగసర్కార్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియా బలమైన జట్టే అయినా స్వదేశంలో టీమిండియా ను ఓడించడం అంత ఈజీ కాదని అన్నాడు.