Ind Vs WI: కరేబియన్లతో సిరీస్ అంతా రెండు వేదికల్లోనే.. వెస్టిండీస్ వన్డే, టీ20లకు షెడ్యూల్ ఖరారు చేసిన బీసీసీఐ
India Vs West Indies Series Schedule: కరేబియన్ జట్టు వచ్చే నెలలో భారత పర్యటనకు రానున్న విషయం తెలిసిందే. భారత్ తో విండీస్ జట్టు.. మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనున్నది.
వచ్చే నెలలో భారత పర్యటనకు రానున్న వెస్టిండీస్.. టీమిండియాతో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనున్నది. ఈ మేరకు గతంలో ప్రకటించిన షెడ్యూల్ ను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) పునరుద్దరించింది.
మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడేందుకుగాను విండీస్ జట్టు.. ఫిబ్రవరి 1న భారత్ కు రానుంది. అయితే వన్డే, టీ20 సిరీస్ లకు గాను బీసీసీఐ గతంలో అహ్మదాబాద్, జైపూర్, కోల్కతా లలో వన్డేలను.. కటక్, విశాఖపట్నం, తిరువనంతపురంలలో మూడు టీ20లను నిర్వహించాలని భావించింది.
కానీ దేశంలో కోవిడ్ థర్డ్ వేవ్ కారణంగా ఈ సిరీస్ కు వేదికలను కుదించారు. ఆరు వేదికల్లో జరుగుతుందనుకున్న సిరీస్.. ఇప్పుడు రెండు నగరాలకే పరిమితమైంది. వన్డేలను అహ్మదాబాద్ లో, మూడు టీ 20లను కోల్కతాలో నిర్వహించనున్నది బీసీసీఐ.
ఫిబ్రవరి 6న అహ్మాదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో తొలి వన్డే జరుగనుండగా..9, 11 తేదీలలో రెండు, మూడు వన్డేలు జరుగుతాయి. ఇక ఫిబ్రవరి 16న కోల్కతా వేదికగా మొదలయ్యే పోరుతో టీ20 సమరానికి తెర లేవనుండగా.. 18, 20 తేదీలలో తదుపరి రెండు టీ20లు జరుగుతాయి
కాగా.. ఐపీఎల్ వేలం నేపథ్యంలో ఈ షెడ్యూల్ ను కూడా బీసీసీఐ సవరించింది. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమైతే.. ఈ సిరీస్ లో ఫిబ్రవరి 6, 9, 12న వన్డేలు జరగాల్సి ఉంది. కానీ ఫిబ్రవరి 12, 13 తేదీలలో బెంగళూరు వేదికగా ఐపీఎల్ మెగా వేలం నిర్వహించనున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో వన్డే షెడ్యూల్ లోని చివరి వన్డేను ఒకరోజుకు ముందుకు జరిపారు. మరోవైపు ఫిబ్రవరి 16న మొదలుకావాల్సి ఉన్న టీ 20 సిరీస్.. ఒక రోజు ముందుగానే ప్రారంభం కానున్నది. ఫిబ్రవరి 1న భారత్ కు చేరుకునే వెస్టిండీస్ జట్టు.. మూడు రోజుల పాటు క్వారంటైన్ లో ఉండనున్నది.
దేశంలో కరోనా కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో బీసీసీఐ ఇప్పటికే ఈ నెల 11 నుంచి మొదలుకావాల్సి ఉన్న రంజీ ట్రోఫీని వాయిదా వేసిన విషయం తెలిసిందే. రంజీలతో పాటు కల్నల్ సీకే నాయుడు ట్రోఫీ, సీనియర్ ఉమెన్స్ టీ20 లీగ్ కూడా వాయిదా పడింది.