రెండో టెస్టుకు ముందు ఆసీస్కు షాక్.. కెప్టెన్కు గాయం.. మళ్లీ సారథిగా స్మిత్
AUSvsWI: ఈ ఏడాది సమ్మర్ సీజన్ లో ఆసీస్ మరో ఐదు టెస్టులు ఆడాల్సి ఉంది. విండీస్ తో సిరీస్ తర్వాత ఆసీస్.. సౌతాఫ్రికాతో మూడు టెస్టులు ఆడనుంది. మరి ఈ సిరీస్ వరకైనా..
ఆస్ట్రేలియా - వెస్టిండీస్ మధ్య శుక్రవారం నుంచి మొదలుకానున్న రెండో టెస్టుకు ముందే కంగారూలకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు సారథి పాట్ కమిన్స్ కు గాయమైంది. దీంతో అతడు రెండో టెస్టు నుంచి తప్పుకున్నాడు. గాయపడ్డ అతడి స్థానంలో యాషెస్ లో ఆడిన స్కాట్ బొలాండ్ జట్టుతో చేరాడు.
తొడకు గాయం కారణంగా కమిన్స్ ఈ మ్యాచ్ కు దూరమయ్యాడు. పెర్త్ టెస్టులో ఆడుతుండగానే కమిన్స్ కు గాయమైనట్టు తెలుస్తున్నది. రెండో టెస్టు వరకు అతడు కోలుకుంటాడని అనుకున్నా అలా జరుగలేదు. దీంతో అతడు టెస్టు నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది.
పెర్త్ టెస్టులో ఆసీస్ ను నడిపించిన కమిన్స్.. రెండో ఇన్నింగ్స్ లో అసౌకర్యంగానే ఫీల్డ్ కు వచ్చాడు. నాథన్ లియాన్ స్పిన్ మాయాజాలంతో ఈ టెస్టులో ఆసీస్ 164 పరుగుల తేడాతో భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే.
అడిలైడ్ వేదికగా విండీస్తో జరుగబోయే పింక్ బాల్ టెస్టులో కమిన్స్ లేకపోవడంతో అతడి స్థానంలో ఆసీస్ మాజీ సారథి స్టీవ్ స్మిత్ సారథ్య బాధ్యతలు నిర్వర్తించబోతున్నాడు. ఇప్పటికే ముగిసిన పెర్త్ టెస్టులో విజయం సాధించిన ఆసీస్.. అడిలైడ్ టెస్టులో కూడా రాణించి క్లీన్ స్వీప్ సాధించాలని భావిస్తున్నది.
కాగా గతేడాది ఇదే సమయానికి కమిన్స్ యాషెస్ సిరీస్ లో కూడా అడిలైడ్ టెస్టుకు దూరమయ్యాడు. కరోనా కారణంగా అతడు ఈ మ్యాచ్ ఆడలేకపోవడంతో అప్పుడు కూడా స్మిత్ ఈ మ్యాచ్ లో సారథిగా వ్యవహరించిన విషయం తెలిసిందే.
ఈ ఏడాది సమ్మర్ సీజన్ లో ఆసీస్ మరో ఐదు టెస్టులు ఆడాల్సి ఉంది. విండీస్ తో సిరీస్ తర్వాత ఆసీస్.. సౌతాఫ్రికాతో మూడు టెస్టులు ఆడనుంది. మరి ఈ సిరీస్ వరకైనా కమిన్స్ కోలుకుంటాడా..? లేడా..? అన్నది అనుమానంగా ఉంది.