వన్డేలకు ఉండేదెవరు..? వెళ్లేదెవరు..? లంకతో టీ20ల నుంచి వన్డేలు ఆడబోతున్న ఆటగాళ్లు, షెడ్యూల్ ఇవే..
INDvsSL: ఈ ఏడాదిని సిరీస్ విజయంతో ఆరంభించింది టీమిండియా. హార్ధిక్ పాండ్యా సారథ్యంలోని యువ భారత్.. లంకను 2-1తో చిత్తు చేసి టీ20 సిరీస్ ను చేజిక్కించుకుంది. ఈనెల 10 నుంచి వన్డే సిరీస్ మొదలుకావాల్సి ఉంది.
శ్రీలంకతో మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ ముగిసిన తర్వాత భారత జట్టు ఇప్పుడు వన్డేల బాట పట్టింది. ఫార్మాట్ మారుతున్న క్రమంలో పలువురు ఆటగాళ్లు జట్టును వీడుతుండగా మరికొందరు కలుస్తున్నారు. కొందరు జట్టుతోనే ఉండనున్నారు. అలా ఉన్నవారి జాబితాను ఇక్కడ చూద్దాం.
వన్డే వరల్డ్ కప్ - 2023 ని దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాదిలో తొలి వన్డే సిరీస్ ఆడుతున్న భారత్ కు తిరిగి సీనియర్లు జట్టుతో చేరారు. బంగ్లాతో వన్డే సిరీస్ లో భాగంగా గాయపడి కొన్నిరోజులు విశ్రాంతి తీసుకున్న రోహిత్ శర్మ.. తిరిగి సారథ్య పగ్గాలు చేపట్టాడు. బంగ్లాతో టెస్టు సిరీస్ తర్వాత విశ్రాంతి తీసుకున్న విరాట్ కోహ్లీ కూడా జట్టుతో చేరాడు.
ఈ ఇద్దరితో పాటు కెఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా లు జట్టుతో చేరనున్నారు. అలాగే మహ్మద్ షమీ కూడా వన్డే జట్టులో ఉన్నాడు.
ఇక టీ20 సిరీస్ లో భాగంగా ఉన్న పలువురు కుర్రాళ్లు వన్డే సిరీస్ కు దూరమైతారు. వారిలో రుతురాజ్ గైక్వాడ్, దీపక్ హుడా, హర్షల్ పటేల్, ముఖేష్ కుమార్, జితేశ్ శర్మ, శివమ్ మావి, సంజూ శాంసన్ లు వన్డే టీమ్ కు ఎంపిక కాలేదు.
కానీ శుభమన్ గిల్, సూర్య కుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా, యుజ్వేంద్ర చాహల్, ఇషాన్ కిషన్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్ లు జట్టుతోనే ఉండనున్నారు.
లంకతో వన్డేలకు భారత జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్ధిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, అర్ష్దీప్ సింగ్
లంకతో వన్డే సిరీస్ షెడ్యూల్ : మూడు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా తొలి వన్డే ఈనెల 10న గువహతిలో జరుగుతుంది. ఇప్పటికే ఇరు జట్లు ఇక్కడికి చేరుకున్నాయి. మిస్ అయిన పలువురు ఆటగాళ్లు రేపటికల్లా జట్టుతో చేరతారు. జనవరి 12న తిరువనంతపురంలో రెండో వన్డే జరగాల్సి ఉంది. జనవరి 15న కోల్కతాలో మూడో వన్డే జరుగుతుంది.