- Home
- Sports
- Cricket
- అనుకున్నదే అయింది.. యాషెస్ సిరీస్ నుంచి తప్పుకున్న ఆర్చర్.. ఇంగ్లాండ్కు వరుస షాకులు
అనుకున్నదే అయింది.. యాషెస్ సిరీస్ నుంచి తప్పుకున్న ఆర్చర్.. ఇంగ్లాండ్కు వరుస షాకులు
Jofra Archer: ఐపీఎల్ -16 లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన ఇంగ్లాండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్.. త్వరలోనే ఇంగ్లీష్ టీమ్ కీలక షెడ్యూల్ అయిన యాషెస్ సిరీస్ నుంచి తప్పుకున్నాడు.

కుడి మోచేతి గాయంతో బాధపడుతున్న ఇంగ్లాండ్ పేసర్ జోఫ్రా ఆ జట్టుకు భారీ షాక్ ఇచ్చాడు. యాషెస్ సిరస్ లో భాగంగా జూన్ 16 నుంచి ఆ జట్టు ఆస్ట్రేలియాతో తలపడబోతున్న విషయం తెలిసిందే. ఐదు టెస్టుల ఈ కీలక సిరీస్ కు ఆర్చర్ అందుబాటులో ఉండటం లేదు. ఈ విషయాన్ని స్వయంగా ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) తెలియజేసింది.
గత మూడేండ్లుగా గాయాలతో సతమతమవుతూ జట్టులోకి వస్తూ పోతూ 2022లోనే రెండు, మూడు ద్వైపాక్షిక సిరీస్ లు ఆడిన ఆర్చర్ ఇటీవలే ఐపీఎల్ ఆడేందుకు భారత్ కు వచ్చాడు. కానీ ఐపీఎల్ లో కూడా నాలుగు మ్యాచ్ లకే మళ్లీ గాయం తిరగబెట్టడంతో గత వారం ఆర్చర్ ముంబై క్యాంప్ ను వీడి ఇంగ్లాండ్ కు పయనమయ్యాడు.
ఈసీబీ వైద్యుల పర్యవేక్షణలో ఉన్న ఆర్చర్ కు ఇటీవలే స్కాన్స్ నిర్వహించారు. ఈ మేరకు ఈసీబీ స్పందిస్తూ.. ‘ఇటీవల అతడికి తీసిన స్కాన్లలో ఆర్చర్ కుడి మోచేయిలో పగులు పునరావృతం అయినట్టు వెల్లడైంది’ అని తెలిపింది.
‘ఆర్చర్ ఇకనుంచి ఈసీబీ , సస్సెక్స్ వైద్య బృందాలతో ఉంటాడు. వాళ్లు అతడి గాయంపై పర్యవేక్షిస్తారు. ఇది ఆర్చర్ చాలా నిరాశతో పాటు ఫ్రస్ట్రేషన్ కు గురి చేసే అంశం. కానీ అతడు త్వరలోనే మళ్లీ జట్టుతో చేరతాడు..’అని ఈసీబీ మేనేజింగ్ డైరెక్టర్ రాబ్ కీ ఓ ప్రకటనలో వెల్లడించారు.
ఆర్చర్ దూరం కాగా గతేడాది కాలికి గాయమైన ఇంగ్లాండ్ వికెట్ కీపర్ జానీ బెయిర్ స్టో తిరిగి జట్టుతో చేరనున్నాడు. ఐపీఎల్ - 16 ప్రారంభ సమయంలోనే బెయిర్ స్టో వస్తాడని భావించినా ఫిట్నెస్ కారణంగా అతడికి ఈసీబీ క్లీయరెన్స్ ఇవ్వలేదు. కానీ ఇప్పుడు ఫుల్ ఫిట్ అయిన బెయిర్ స్టో.. ఐర్లాండ్ తో త్వరలో జరుగబోయే ఏకైక టెస్టులో ఆడనున్నాడు.
యాషెస్ సిరీస్ కు క్రిస్ వోక్స్ తో పాటు మార్క్ వుడ్ కూడా ఇంగ్లాండ్ జట్టుతో చేరారు. ఇటీవలే కౌంటీ ఛాంపియన్షిప్ ఆడుతూ గాయపడ్డ ఇంగ్లాండ్ వెటరన్ పేసర్ జేమ్స్ అండర్సన్ గాయంపై ఈసీబీ ఏ ప్రకటనా చేయలేదు. జూన్ 16 నుంచి మొదలయ్యే యాషెస్ మొదటి టెస్టు వరకు అతడు కోలుకుంటాడని ఈసీబీ భావిస్తున్నది.